.
కాల్పులు కాదు… భోజనమే ఆయుధమా?
‘దురంధర్’ తరహా మృతి… లష్కరే ఉగ్రనేత భోజనంలో విషం కలిసిందా? ఎవరు కలిపారు?
ఉగ్రవాదిని అంతమొందించాలంటే తుపాకీ అవసరమా? పిస్టల్తో కాల్చాలి… బాంబు పేల్చాలి… కత్తితో పొడవాలి… ఇదే మనకు తెలిసిన హత్యా పద్ధతులు. కానీ…
Ads
శత్రువుతో స్నేహం చేసి, అతడితో కలిసి భోజనం చేసి, అదే భోజనాన్ని అతడి చివరి భోజనంగా మార్చితే? అది కాల్పుల కంటే నిశ్శబ్దమైన ఆయుధం.
‘దురంధర్’ సినిమా తరహాలోనే ఇంటెలిజెన్స్ ప్రపంచంలోనూ ఒక విషయం తరచూ చర్చకు వస్తుంది. ప్రతి ‘అన్వాంటెడ్ ఎలిమెంట్’ను తుపాకీతోనే తొలగించాల్సిన అవసరం లేదు. ప్రత్యక్ష దాడి కంటే, అనుమానం రాకుండా జరిగే ఆపరేషన్ కొన్నిసార్లు మరింత ప్రభావవంతంగా ఉంటుంది.
ఇప్పుడు పాకిస్తాన్లో జరిగిన ఒక మృతి అలాంటి ప్రశ్నలనే లేవనెత్తుతోంది. లష్కరే తోయిబా సీనియర్ ఆపరేటివ్ ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్. ఆగస్టు 8న ఇస్లామాబాద్లో ఒక చోట భోజనం చేసిన అతడు ప్రార్థనల కోసం ఖుబా మసీదుకు వెళ్లాడు. మసీదు ప్రవేశద్వారం వద్దకు చేరుకోగానే అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. కొద్దిసేపటికే అతడు మరణించినట్లు సమాచారం.
ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. భోజనం చేసిన తర్వాతే ఎందుకు కుప్పకూలాడు? అతడి భోజనంలో ఏదైనా కలిపారా? కలిపితే ఎవరు?
ప్రస్తుతం ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు. ముఖ్యంగా, అతడి మరణానికి విషప్రయోగమే కారణమని అధికారికంగా నిర్ధారణ కాలేదు. కానీ భోజనం తర్వాత అనూహ్యంగా మృతి చెందడంతో విషప్రయోగం జరిగిందనే అనుమానాలు మాత్రం పాకిస్తాన్లో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే అబ్దుల్ అజీజ్ సాధారణ వ్యక్తి కాదు. 26/11 ముంబై ఉగ్రదాడులతో సంబంధం ఉన్న లష్కరే తోయిబా నెట్వర్క్లో అతడు కీలక వ్యక్తిగా పేర్కొనబడుతున్నాడు. ముంబైపై జరిగిన ఆ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇంతటి నేపథ్యం ఉన్న వ్యక్తి… పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో… భోజనం చేసిన తర్వాత… మసీదు గుమ్మం వద్ద అకస్మాత్తుగా చనిపోవడం…
సహజ మరణమా?
లేక…
ఎవరైనా పన్నిన ఆపరేషనా?
అనుమానం రావడానికి కారణం ఇదొక్కటే కాదు.
అబ్దుల్ అజీజ్ జమ్మూ–కాశ్మీర్లో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లలో మరణించిన లష్కరే తోయిబా ఉగ్రవాదుల కుటుంబాలకు సహాయం చేసే వ్యవస్థతోనూ సంబంధం కలిగి ఉన్నట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. అంటే అతడు కేవలం గతంలోని 26/11 నెట్వర్క్తో సంబంధం ఉన్న వ్యక్తి మాత్రమే కాదు… ఉగ్రవాద వ్యవస్థకు ఆర్థిక, లాజిస్టిక్ మద్దతుతోనూ అనుసంధానమై ఉన్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు.
అలాంటి వ్యక్తిని కాల్చి చంపితే?
కెమెరాలు ఉంటాయి.
సాక్షులు ఉంటారు.
బుల్లెట్లు ఉంటాయి.
ఆయుధం ఉంటుంది.
విచారణ ఉంటుంది.
కానీ…
భోజనంలో ఏదైనా కలిస్తే?
అది వేరే కథ.
ఎవరు భోజనం పెట్టారు?
ఎక్కడ తిన్నాడు?
ఎవరెవరు అతడితో ఉన్నారు?
భోజనం ఎక్కడి నుంచి వచ్చింది?
అతడి ప్లేట్ను ఎవరెవరు తాకారు?
అతడు తిన్న ఆహారాన్ని మరెవరైనా తిన్నారా?
ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరికితేనే ఇది సాధారణ మరణమా… లేక పక్కాగా ప్లాన్ చేసిన హత్యా అనేది తేలుతుంది.
‘డేగ రెక్కల చప్పుడు’ గుర్తుకొస్తోంది!
ఇక్కడే ఒక తెలుగు పాపులర్ నవలలోని సన్నివేశం గుర్తుకు వస్తుంది. ‘డేగ రెక్కల చప్పుడు’లో హీరో ఉగ్రవాద నేత ఒసామా బిన్ లాడెన్ను కలసి వచ్చిన తర్వాత ఒక ఆలోచనను చెబుతాడు.
పిస్టల్తో కాల్చడం, కత్తితో పొడవడం పాత పద్ధతులు. దేశానికి హాని చేస్తున్న ప్రత్యర్థి గురించి శత్రుదేశంలోనే ఆరా తీసి… అతడితో స్నేహం చేసి… భోజనానికి పిలిచి… విషప్రయోగంతో అంతమొందించడం కూడా ఒక మార్గమే అన్నది ఆ ఆలోచన.
అది అప్పట్లో ఒక కల్పిత కథలోని ఇంటెలిజెన్స్ ఆలోచన. కానీ ఇప్పుడు ఇస్లామాబాద్లో జరిగిన ఈ మృతి ఆ కల్పనను మరోసారి గుర్తు చేస్తోంది. కల్పన వాస్తవాన్ని ముందే ఊహించిందా? లేక మనమే ఒక మిస్టరీని మరొక మిస్టరీతో కలుపుతున్నామా?
విషప్రయోగం జరిగిందని నిర్ధారణ కాలేదు. అయితే… ఎవరు చేయగలరు? ఇదే అసలు ఆసక్తికరమైన ప్రశ్న. భారత్? పాకిస్తాన్లోని ప్రత్యర్థి ఉగ్రవాద వర్గాలా? ఉగ్రవాద సంస్థలోని అంతర్గత శత్రువులా? లేక… అతడితో వ్యక్తిగతంగా శత్రుత్వం ఉన్నవారెవరైనా? ఇవేవీ ఇప్పుడు ఆధారాలతో చెప్పలేం.
కానీ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ అనుకుంటే ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంటుంది. ప్రత్యక్షంగా వేలిముద్రలు కనిపించకుండా పని పూర్తి చేయడం. అందుకే తుపాకీ కాల్పుల కంటే విషప్రయోగం జరిగిందనే అనుమానం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే మరో కోణం కూడా ఉంది.
పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థల మధ్య అంతర్గత విభేదాలు, ప్రత్యర్థి వర్గాల మధ్య హింస కొత్త విషయం కాదు. కాబట్టి ప్రతి అనుమానాస్పద మరణం వెనుక భారత గూఢచారి సంస్థలే ఉన్నాయని తేల్చేయడం కూడా సరైన జర్నలిజం కాదు.
ఇంటెలిజెన్స్ ప్రపంచంలో అసలు ఆట ఇదే. నిజం బయటకు వచ్చే వరకు… ఒక మృతి కేవలం మృతే. ఒక ప్రమాదం కేవలం ప్రమాదమే. ఒక విషప్రయోగం కేవలం అనుమానమే. కానీ ఆధారాలు బయటపడితే… అదే మృతి ఒక ఆపరేషన్గా మారుతుంది.
అందుకే ఇప్పుడు అబ్దుల్ అజీజ్ విషయంలో అసలు ప్రశ్న — “అతడు ఎలా చనిపోయాడు?” కాదు. “అతడి చివరి భోజనంలో ఏముంది?” అన్నదే. అది తేలితే… ఇస్లామాబాద్లోని ఒక రెస్టారెంట్ టేబుల్ నుంచి ఏదైనా గూఢచారి కథ బయటకు రావచ్చు!
Share this Article