.
వెయ్యి మంది వలస పిల్లలకు, యుద్ధ బాధిత పిల్లలకు తండ్రయ్యాడు… వేల కిలోమీటర్ల దూరంలో ఇప్పటికీ ‘మంచి మహారాజా’గా కొలుస్తున్నారు! వార్సా నగరంలో ఓ చిన్న స్క్వేర్ ఉంది. పేరు ‘గుడ్ మహారాజా స్క్వేర్’.
అక్కడికి వెళ్లినవారికి మొదట ఇది ఏదో పోలిష్ రాజు పేరేమో అనిపించొచ్చు. కానీ ఆ పేరు వెనుక ఉన్న కథ తెలిస్తే మాత్రం మనసు ఆగిపోతుంది. ఎందుకంటే ఆ మహారాజా పోలాండ్కు చెందినవాడు కాదు. భారతదేశానికి చెందిన రాజు.
Ads
గుజరాత్లోని జామ్నగర్ను పాలించిన నవానగర్ సంస్థాన మహారాజా జామ్ సాహెబ్ దిగ్విజయ్సింహ్జీ రంజిత్సింహ్జీ జడేజా. పోలాండ్లో ఆయనను ఇప్పటికీ ప్రేమగా ‘డోబ్రీ మహారాజా’.. అంటే ‘గుడ్ మహారాజా’ అని పిలుస్తారు. అలా పిలవడానికి కారణం ఒక యుద్ధకాలపు మానవత్వం.
యుద్ధం… అనాథలైన పిల్లలు… రెండో ప్రపంచ యుద్ధం. యూరప్ అంతా అగ్నిగుండంలా మారిపోయిన కాలం. పోలాండ్పై నాజీ జర్మనీ దాడి చేసింది. వేలాది మంది పోలిష్ ప్రజలు తమ ఇళ్లను, కుటుంబాలను కోల్పోయారు.
చాలామంది పిల్లలు సోవియట్ ప్రాంతాల్లోని శిబిరాలకు తరలించబడ్డారు. అక్కడి నుంచి ఎలాగో ప్రాణాలతో బయటపడిన వెయ్యి మందికి దగ్గరలో ఉన్న పోలిష్ పిల్లలు చివరకు భారతదేశం వైపు వచ్చారు. కానీ వారి పరిస్థితి దయనీయంగా ఉంది.
దేశం లేదు.
ఇల్లు లేదు.
తల్లిదండ్రులు లేరు.
ఆ సమయంలో వారికి భారతదేశం ఒక పరాయి దేశం.
అంతేకాదు.. వారిని భారతదేశంలోకి తీసుకురావడానికే ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి.
అక్కడే ఓ మహారాజా ముందుకొచ్చాడు. “వాళ్లు అనాథలు కాదు.. నా పిల్లలు!” ఆ పిల్లల గురించి తెలుసుకున్న జామ్ సాహెబ్ దిగ్విజయ్సింహ్జీ.. “వాళ్లను నా దగ్గరకు తీసుకురండి” అన్నాడు.
జామ్నగర్ సమీపంలోని బాలాచడిలో వారి కోసం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. వాళ్ల భోజనం నుంచి వసతి వరకు.. వారి చదువు నుంచి వారి సంస్కృతి వరకు.. అన్నింటినీ చూసుకున్నాడు.
పిల్లలకు తమ భాషలో చదువుకునే అవకాశం కల్పించాడు. పోలిష్ పుస్తకాలతో గ్రంథాలయాలు ఏర్పాటు చేశాడు. వాళ్లకు అలవాటైన ఆహారాన్ని అందించాడు. అంతకంటే ముఖ్యంగా.. వాళ్లకు వాళ్ల ఇల్లు పోయిందనే బాధ కలగకుండా చూసుకున్నాడు.
ఒకసారి ఆ పిల్లలను ఉద్దేశించి ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ పోలాండ్లో గుర్తు చేసుకుంటారు. “మీరు ఇకపై అనాథలు కాదు. మీరు నవానగర్ వాసులు. నేను మీ బాపు.” ‘బాపు’.. అంటే తండ్రి. ఒక రాజు తన రాజ్యానికి వచ్చిన శరణార్థులను ప్రజలుగా మాత్రమే చూడలేదు. తన పిల్లలుగా చూశాడు.
నాలుగేళ్లు.. కానీ జీవితాంతం గుర్తుండిపోయే బంధం
1942 నుంచి 1946 వరకు ఆ పిల్లలు నవానగర్లో ఆశ్రయం పొందారు. యుద్ధం ముగిసింది. పిల్లలు తిరిగి పోలాండ్కు వెళ్లారు. కాలం గడిచిపోయింది. వాళ్లు పెద్దయ్యారు. వాళ్లకు కుటుంబాలు ఏర్పడ్డాయి. వాళ్ల పిల్లలు, మనవళ్లు పుట్టారు. కానీ…
భారతదేశంలో తమకు దేవుడిచ్చిన ఒక తండ్రి ఉన్నాడన్న జ్ఞాపకం మాత్రం వాళ్లతోనే ఉండిపోయింది. తరాలు మారినా ఆ రుణం మాత్రం పోలాండ్ మరచిపోలేదు.

ఒక స్క్వేర్కు ‘గుడ్ మహారాజా’ పేరు!
ఆ కృతజ్ఞతకు ప్రతీకే వార్సాలోని గుడ్ మహారాజా స్క్వేర్. 2012 మే 31న వార్సాలోని ఓచోటా జిల్లాలోని ఓ పార్కుకు అధికారికంగా ఈ పేరు పెట్టారు. 2014లో అక్కడ మహారాజా జ్ఞాపకార్థం స్మారక చిహ్నాన్ని కూడా ఏర్పాటు చేశారు.
అంతేకాదు.. పోలాండ్లోని పలు పాఠశాలలకు కూడా ఆయన పేరు పెట్టారు. పోలిష్ ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి మరణానంతరం దేశ అత్యున్నత గౌరవాల్లో ఒకటైన కమాండర్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెరిట్తో సత్కరించింది.
అంటే.. భారతదేశంలో ఒకప్పుడు ఒక సంస్థానాన్ని పాలించిన రాజు.. వేల కిలోమీటర్ల దూరంలోని పోలాండ్లో మాత్రం ఒక కుటుంబ సభ్యుడిగా మారిపోయాడు.
2024 ఆగస్టులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు ఈ గుడ్ మహారాజా స్క్వేర్ను సందర్శించాడు. అక్కడి స్మారక చిహ్నానికి పూలమాలలు వేసి జామ్ సాహెబ్కు నివాళులర్పించాడు. ఆ దృశ్యం చూస్తే ఒక విషయం అర్థమవుతుంది.
దేశాల మధ్య సంబంధాలను ప్రభుత్వాలు నిర్మిస్తాయి. కానీ.. ప్రజల హృదయాల్లో శాశ్వతమైన సంబంధాలను నిర్మించేది మాత్రం మానవత్వం….
ఒకవైపు ప్రపంచం యుద్ధంలో మునిగిపోయినప్పుడు..
ఒక రాజు మాత్రం తన రాజ్యపు తలుపులు తెరిచాడు.
వచ్చిన పిల్లలు ఏ దేశానికి చెందినవారో అడగలేదు.
వాళ్ల మతం ఏమిటో అడగలేదు.
వాళ్ల దగ్గర డబ్బెంతుందో అడగలేదు.
“పిల్లలు కదా.. వాళ్లను కాపాడాలి” అనుకున్నాడు.
అందుకే.. జామ్ సాహెబ్ దిగ్విజయ్సింహ్జీ జడేజా ఇప్పుడు కేవలం భారత చరిత్రలోని ఒక మహారాజా కాదు. పోలాండ్ జ్ఞాపకాల్లో ఒక ‘బాపు’…!!
Share this Article