.
ఒక మెడికో మృతి.. మరో మెడికోకు న్యాయం కోసం పునర్విచారణ!
ఆర్.జి. కర్ మళ్లీ ఎందుకు తెరపైకి వచ్చింది?
రెండేళ్ల క్రితం దేశాన్ని కుదిపేసిన కోల్కతాలోని ఆర్.జి. కర్ మెడికల్ కాలేజ్ ఘటన మళ్లీ తెరపైకి వచ్చింది.
Ads
2024 ఆగస్టులో ప్రభుత్వ ఆసుపత్రిలో విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలు అత్యాచారం, హత్యకు గురైన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. వైద్యులు రోడ్లపైకి వచ్చారు. దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. వైద్యుల భద్రత, ఆసుపత్రుల్లో మహిళల రక్షణ, ప్రభుత్వాల బాధ్యతపై జాతీయ స్థాయిలో చర్చ జరిగింది.
బెంగాల్లో జూనియర్ డాక్టర్లు దాదాపు 42 రోజుల పాటు విధులకు దూరంగా ఉండి ఆందోళన చేశారు.
కానీ ఆ ఆగ్రహం ఎంత పెద్దదో.. ఆ కేసు దర్యాప్తుపై అంతే పెద్ద అనుమానాలు తలెత్తాయి.
బాధితురాలి కుటుంబం మొదటి నుంచీ దర్యాప్తు తీరుపై ప్రశ్నలు లేవనెత్తింది. కేసు దర్యాప్తు చివరకు కలకత్తా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ చేతికి వెళ్లింది. అయినప్పటికీ కేసులో మరిన్ని అంశాలు వెలుగులోకి రావాల్సి ఉందన్న అనుమానాలు మాత్రం తొలగిపోలేదు.
ఇప్పుడు రెండేళ్ల తర్వాత అదే కేసు మళ్లీ మొదటి పేజీకి వచ్చింది.
కారణం ఒక్కటే కాదు.
ఆర్.జి. కర్ బాధితురాలి తల్లి ఇప్పుడు ఎమ్మెల్యే.
రత్నా దేబ్నాథ్ 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పానిహాటి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆమెకు 28,836 ఓట్ల మెజారిటీ వచ్చింది.
ఒకప్పుడు తన కుమార్తెకు న్యాయం చేయాలని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన తల్లి.. ఇప్పుడు చట్టసభలో కూర్చుంది.
అక్కడితో కథ ముగియలేదు.
న్యాయం కోసం ఆమె పోరాటం ఆగలేదు.
తాజాగా కలకత్తా హైకోర్టు ఆర్.జి. కర్ కేసులో తాజా దర్యాప్తుకు ఆదేశించింది. గత దర్యాప్తు తేల్చిన అంశాలకు మాత్రమే పరిమితం కాకుండా.. ఘటన జరిగిన రాత్రి నుంచి బాధితురాలి అంత్యక్రియల వరకు జరిగిన మొత్తం వ్యవహారాన్ని మరోసారి పరిశీలించాలని కోర్టు సూచించింది. దర్యాప్తులో సుమారు 30 మంది వరకు ఇప్పుడు పరిశీలనలో ఉన్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి.
అంటే..
రెండేళ్లు గడిచినా ఆర్.జి. కర్ కథకు ఫుల్స్టాప్ పడలేదు.
ఇదే సమయంలో ఏపీలో మరో మెడికో విషాదం
ఆర్.జి. కర్ కేసు మళ్లీ తెరపైకి వచ్చిన సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో ఒక మెడికో మృతి జనంలో తీవ్ర ఆగ్రహాన్ని రేపుతోంది.
రాజమహేంద్రవరంలో ఆగస్టు 3న ఇద్దరు పీజీ మెడికల్ విద్యార్థులు స్కూటీపై వెళ్తుండగా కారు ఢీకొట్టిన ఘటనలో ఒక వైద్య విద్యార్థిని తీవ్రంగా గాయపడి దాదాపు వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి మరణించింది. ఈ ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి పోలీసులు ప్రకటించారు.
ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టంగా వేరు చేయాలి.
ఆంధ్రప్రదేశ్ ఘటనను ఆర్.జి. కర్ తరహా అత్యాచారం- హత్య కేసుగా పేర్కొనవచ్చా? పేరుకు అది కారు ఢీకొట్టిన హిట్-అండ్-రన్/ రోడ్డు ప్రమాద ఘటన. కానీ ఉద్దేశపూర్వక హత్య అని జనం అంటున్నారు.
అయితే రెండు ఘటనలను కలిపే ఒకే ప్రశ్న ఉంది.
మెడికో ప్రాణానికి విలువ ఎంత?
ఆర్.జి. కర్లో ఆసుపత్రి గోడల మధ్య ఒక వైద్యురాలి ప్రాణం పోయింది.
ఆంధ్రప్రదేశ్లో రోడ్డుపై మరో వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది.
రెండు ఘటనల స్వభావం వేరు. నేర స్వభావం వేరు… కానీ ఒక కుటుంబానికి మాత్రం విషాదం ఒక్కటే.
తమ కూతురు తిరిగి రాదు. న్యాయంపై ప్రశ్న మాత్రమే మిగులుతుంది.
ఆర్.జి. కర్ ఎందుకు మళ్లీ గుర్తొచ్చింది?
ఎందుకంటే ఆర్.జి. కర్ ఘటన ఒక సాధారణ క్రైమ్ కేసుగా మిగిలిపోలేదు.
అది ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకానికి పరీక్షగా మారింది.
ఒక వైద్యురాలు ఆసుపత్రిలోనే సురక్షితంగా లేకపోతే.. ఇంకెక్కడ సురక్షితం?
అన్న ప్రశ్నను దేశం అడిగింది.
వేలాది మంది వైద్యులు రోడ్లపైకి వచ్చారు.
దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా వైద్యుల భద్రతపై ప్రత్యేకంగా స్పందించింది.
అంతటి సంచలనం సృష్టించిన కేసే రెండేళ్ల తర్వాత మళ్లీ దర్యాప్తు దశకు రావడం.. సాధారణ విషయం కాదు.
ఇది ఒక కుటుంబానికి మాత్రమే సంబంధించిన ప్రశ్న కాదు.
దర్యాప్తు వ్యవస్థపై ప్రజల నమ్మకానికి సంబంధించిన ప్రశ్న.
ఒక తల్లి ఎమ్మెల్యేగా మారింది.. కానీ ప్రశ్న మాత్రం అదే
రత్నా దేబ్నాథ్ రాజకీయాల్లోకి రావడం వెనుక ప్రధాన కారణంగా తన కుమార్తెకు న్యాయం చేయాలన్న ఆకాంక్షను ఆమె స్వయంగా వెల్లడించారు.
ఇప్పుడు ఆమె చేతిలో ఒక రాజకీయ పదవి ఉంది.
కానీ ఆమెకు కావాల్సింది మరో పదవి కాదు.
తన కుమార్తెకు న్యాయం.
ఆమె ఎమ్మెల్యేగా గెలిచింది.
కానీ ఆమె తల్లి అనే బాధ్యత నుంచి మాత్రం బయటపడలేదు.
అందుకే ఆర్.జి. కర్ కేసు మళ్లీ విచారణకు రావడం ఒక రాజకీయ పరిణామం మాత్రమే కాదు.
ఒక తల్లి రెండేళ్లుగా అడుగుతున్న ప్రశ్నకు మరోసారి సమాధానం వెతకడం.
ప్రజలు మర్చిపోయినా.. తల్లి మర్చిపోలేదు
కేసులు కోర్టుల్లో ఉంటాయి.
ఫైళ్లు అధికారుల దగ్గర ఉంటాయి.
దర్యాప్తులు మారుతాయి.
ప్రభుత్వాలు మారుతాయి.
అధికారులు మారుతారు.
ఎన్నికలు వస్తాయి.. పోతాయి.
కానీ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు మాత్రం కాలం ముందుకు కదలదు. ఏడ్వటానికి నీటి తడి కూడా కంట్లో మిగలదు
ఆగస్టు 2024లో ఆర్.జి. కర్లో ఆగిపోయిన ఒక తల్లి జీవితం.. 2026లో ఎమ్మెల్యేగా మారినా ముందుకు కదల్లేదు.
ఇప్పుడు మరో మెడికో మృతి ప్రజల్లో ఆగ్రహాన్ని రేపుతున్న వేళ.. ఆర్.జి. కర్ కేసు మళ్లీ దేశం ముందు నిలబడటం ఒక చేదు గుర్తు.
మెడికోలకు భద్రత ఎక్కడ?
న్యాయం కోసం పోరాడే తల్లిదండ్రులకు వ్యవస్థ ఎప్పుడు స్పందిస్తుంది?
ఒక సంచలన ఘటన జరిగినప్పుడు మాత్రమేనా? లేక ప్రతి ప్రాణానికి సమానమైన విలువ ఉన్నప్పుడా?
ఆర్.జి. కర్ కేసు పునర్విచారణకు వెళ్లింది.
ఇప్పుడైనా నిజం బయటకు రావాలి.
ఎవరెంత పెద్దవారైనా సరే.. ఎవరెంత కాలం తప్పించుకున్నా సరే..
ఒక వైద్యురాలి ప్రాణానికి న్యాయం జరిగేలా దర్యాప్తు జరగాలి.
అదే ఈ పునర్విచారణకు అసలు పరీక్ష.
Share this Article