.
NEET … ఢిల్లీ అట్టుడికిపోతోంది… పరీక్షపత్రాల లీక్ వివాదం మంటల్ని రాజేస్తోంది… విద్యార్థుల పేరుతో సంఘవిద్రోహ, జాతివ్యతిరేక శక్తులు, సామూహిక ఉన్మాదానికీ, సీజేపీ బ్యానర్ కింద అరాచకానికి తెరలేపాయి… అక్కడ కొందరు పిల్లల్ని కొన్ని యూబ్యూబ్ చానెళ్లు నీట్, సీబీఎస్ఈ వంటి పదాల స్పెల్లింగులు అడిగితే చెప్పలేకపోయారు… ఈ అల్లర్లలో నీట్ సంబంధ విద్యార్థుల సంఖ్య దాదాపు శూన్యం…
మరోవైపు తమిళనాడు సీఎం విజయ్ నీట్ మొత్తాన్నే రద్దు చేయాలని డిమాండ్ ఎత్తుకున్నాడు, ఇది స్టాలిన్ బాపతు డిమాండే… నిజంగానే చాలామందికి నీట్ అంటే ఏమిటి..? అసలు ఆ సిస్టం ఏమిటి..? తెలియవు! ఓసారి చెప్పుకుందాం… అవగాహన కోసం…
Ads
NEET సిస్టమ్ అంటే ఏమిటి?
NEET (National Eligibility cum Entrance Test) అనేది భారతదేశంలో మెడికల్ కోర్సులైన MBBS, BDS వంటి వాటిలో ప్రవేశం పొందడానికి నిర్వహించే ఒకే ఒక జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష.
-
ప్రారంభం & నిర్వహణ…: దీన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా మెడికల్ సీట్ల భర్తీలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు.
-
ప్రధాన ఉద్దేశం…: గతంలో రాష్ట్రాలు విడివిడిగా ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహించేవి లేదా ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా సీట్లు ఇచ్చేవి. వాటి స్థానంలో దేశం మొత్తానికి కలిపి ఒకే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ను తెచ్చారు. దీని ద్వారా అర్హత సాధిస్తేనే దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలలో మెడికల్ సీటు పొందేందుకు అవకాశం ఉంటుంది.
-
కటాఫ్ మార్కులు సాధించి, పరీక్షలో పాస్ కావాలి… తరువాత ర్యాంకుల్ని బట్టి సీట్లు… NEET పరీక్షలో కేవలం హాజరైతే సరిపోదు, నేషనల్ మెడికల్ కమిషన్ (NMC), నిబంధనల ప్రకారం నిర్దేశించిన కనీస అర్హత శాతాన్ని (Percentile) సాధించాల్సి ఉంటుంది…
NEETను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు కొందరు? తమిళనాడు మొదటి నుంచీ NEETను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. దీని వెనుక ప్రధాన కారణాలు:
-
గ్రామీణ, పేద విద్యార్థులకు నష్టం…: NEET పరీక్షలో అర్హత సాధించాలంటే ఖరీదైన కోచింగ్ సెంటర్లు అవసరమవుతాయి. ఇది పట్టణ ప్రాంతాల వారికి, ఆర్థికంగా బలంగా ఉన్నవారికే ఎక్కువ అనుకూలంగా మారుతోందని, గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు ఇది భారంగా మారిందని వాదన.
-
స్టేట్ సిలబస్ విద్యార్థులకు వివక్ష…: NEET సిలబస్ ఎక్కువగా CBSE విధానం ఆధారంగా ఉంటుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు/ కళాశాలల్లో (State Board Syllabus) చదివిన విద్యార్థులు సిలబస్ లొసుగుల వల్ల వెనుకబడిపోతున్నారని తమిళనాడు వాదిస్తోంది…
-
రాష్ట్రాల హక్కులకు భంగం (Federalism…): విద్య అనేది ఉమ్మడి జాబితాలో (Concurrent List) ఉన్నప్పటికీ, ప్రవేశ పరీక్షల ద్వారా రాష్ట్రాల విద్యా విధానాలపై కేంద్రం గుత్తాధిపత్యం ప్రదర్శిస్తోందని, స్థానిక విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వాలకున్న అధికారాలు హరించుకుపోతున్నాయని ఆ రాష్ట్రం భావిస్తుంది…
-
ఆత్మహత్యలు & మానసిక ఒత్తిడి…: సింగిల్ ఎంట్రెన్స్ పరీక్ష తెచ్చే విపరీతమైన పోటీ వల్ల విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు తమిళనాడులో పెద్ద రాజకీయ, సామాజిక ఆందోళనకు దారితీశాయి.
అలాగని మెడికల్ సీట్లు పూర్తిగా కేంద్రం నియంత్రణలో లేవు. సీట్ల కేటాయింపు, నిర్వహణ రెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది:
-
ఆల్ ఇండియా కోటా (AIQ – 15%)…: ప్రతి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉండే మొత్తం సీట్లలో 15 శాతం సీట్లను కేంద్ర ప్రభుత్వం తన ఆధ్వర్యంలో (మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ద్వారా) దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన విద్యార్థులతో భర్తీ చేస్తుంది. AIIMS (ఎయిమ్స్), JIPMER వంటి కొన్ని ప్రత్యేక కేంద్ర ప్రభుత్వ సంస్థల సీట్లు మాత్రం పూర్తిగా కేంద్రం ఆధ్వర్యంలోనే ఉంటాయి.
-
స్టేట్ కోటా (85%)…: మిగిలిన 85 శాతం సీట్లు పూర్తిగా యాక్చువల్గా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంటాయి. ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ కాలేజీలు, స్థానిక ప్రైవేట్ కాలేజీలలోని సీట్లను రాష్ట్ర ప్రభుత్వాల కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. దీనికి ఆయా రాష్ట్రాల స్థానికత (Domicile) నిబంధనలు వర్తిస్తాయి.
అంటే, పరీక్ష నిర్వహణ, అర్హతా ప్రమాణాలు (NEET) మాత్రమే కేంద్రం (NTA/NMC) చేతిలో ఉంటాయి, కానీ సింహ భాగం సీట్ల కేటాయింపు మాత్రం రాష్ట్రాల కోటా కింద రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే నడుస్తుంది… ఇదీ సంగతి!!
Share this Article