.
( Gopu Vijaya Kumar Reddy ) …. బంకిపూర్ పోస్ట్మార్టం: ప్రశాంత్ కిషోర్ గెలుపు కంటే బీజేపీ ఆత్మపరిశీలన అవసరం కర్ణుడి చావుకు లక్ష కారణాలు… బీజేపీ ఓటమికి లక్షాఒకటి కారణాలూ !
ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకి అయినా అంతిమ రిఫరెండం ఎన్నికలే. ఇటీవల దేశంలోని మూడు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త సమీకరణలకు లేదా పూర్తిస్థాయి మూడ్ చేంజ్కు సంకేతమా అంటే కచ్చితంగా కాదు. అయితే ఒక రాజకీయ పార్టీ తన రాజకీయ ప్రస్థానాన్ని నిర్మించుకున్న మూల సిద్ధాంతం (Core Ideology) నుండి ఎప్పుడైతే దూరం కావడం ప్రారంభిస్తుందో, అలాంటి సమయంలోనే ఇటువంటి ఫలితాలు కనిపించడం సహజం.
Ads
రాజకీయాల్లో ప్రతి పార్టీకి ఒక కోర్ ఐడెంటిటీ ఉంటుంది. ఆ ఐడెంటిటీనే ఆ పార్టీకి బలమైన సామాజిక, రాజకీయ మద్దతును తీసుకొస్తుంది. ఆ కోర్ను వదిలి కొత్త ప్రయోగాలు చేసే సమయంలో ఆ పార్టీ తన సంప్రదాయ ఓటు బ్యాంకును కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను కూడా ఇదే కోణంలో చూడాల్సిన అవసరం ఉంది.
—
గుజరాత్ మంజలాపూర్: గెలుపు ఉన్నా… హెచ్చరిక గంట మోగిందా?
గుజరాత్లోని మంజలాపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. అయితే ఈ విజయం వెనుక ఒక చిన్న హెచ్చరిక మాత్రం దాగి ఉంది.
గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో బీజేపీ మెజారిటీ ఎప్పుడూ 50 వేల ఓట్లకు దిగువకు రాలేదు. 2002లో అయితే లక్ష ఓట్లకు పైగా ఆధిక్యం నమోదైంది. ఇటీవల సీనియర్ బీజేపీ నాయకుడు, స్థానికంగా “కాకా”గా పేరుపొందిన యోగేష్ పటేల్ మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు సతీష్ పటేల్ విజయం సాధించారు.
అయితే గణాంకాలను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది.
– 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లు – సుమారు 2.60 లక్షలు
– తాజా ఉప ఎన్నికలో పోలైన ఓట్లు – కేవలం 82 వేల వరకు
అంటే దాదాపు 1.8 లక్షల మంది ఓటర్లు ఈసారి ఓటు వేయలేదు. అందువల్ల ఈ ఫలితాన్ని అతిగా విశ్లేషించాల్సిన అవసరం లేదు.
అయితే మరో అంశం మాత్రం బీజేపీ దృష్టిని ఆకర్షించాల్సిందే. మెజారిటీ శాతం 75% నుండి 67%కు పడిపోయింది. సాధారణంగా సానుభూతి ఎన్నికల్లో అధికార పార్టీకి మరింత బలం రావాలి. కానీ ఇక్కడ అది జరగలేదు.
దీనికి ప్రధాన కారణం మరో ఏడాదిలోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2027 డిసెంబర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఓటర్లు ఈ ఎన్నికను అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదనే విశ్లేషణ కూడా ఉంది.
—
మధ్యప్రదేశ్ దతియా: గెలిచింది కాంగ్రెస్… కానీ కథ అంతటితో ముగియదు
మధ్యప్రదేశ్లోని దతియా అసెంబ్లీ నియోజకవర్గం సంప్రదాయంగా కాంగ్రెస్ బలమైన స్థావరం. గత తొమ్మిది ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది.
ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచినా, ఓటు శాతం గణనీయంగా తగ్గింది.
– 2023లో కాంగ్రెస్ ఓటు శాతం – 50.34%
– ఉప ఎన్నికలో – 42.39%
అంటే కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ దాని ఓటు ఆధారం తగ్గినట్లు స్పష్టమవుతోంది.
అదే సమయంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ ఉప ఎన్నికలో ఓడిపోవడం రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బగానే పరిగణించాలి.

దేశం మొత్తం దృష్టి బంకిపూర్పై ఎందుకు?
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అత్యధిక చర్చకు కారణమైన నియోజకవర్గం బీహార్లోని బంకిపూర్.
రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, 2029 లోక్సభ ఎన్నికలకు ఇది ఒక రాజకీయ సూచిక (Political Indicator)గా చాలామంది విశ్లేషకులు చూస్తున్నారు.
ఈ ఫలితం బీజేపీకి కేవలం ఓటమి మాత్రమే కాదు… ఒక గుణపాఠం కూడా.
—
Gen-Z ఉద్యమమే కారణమా?
చాలామంది ఈ ఫలితాన్ని Gen-Z ఉద్యమ ప్రభావంగా చెబుతున్నారు.
అది ఒక కారణమే అయినప్పటికీ, అసలు కారణం మాత్రం అది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ముఖ్య కారణం బీజేపీ తన కోర్ ఐడెంటిటీ నుండి క్రమంగా దూరం కావడమే.
అది పార్టీకి మరింత ప్రమాదకరమైన అంశం.
—
మినీ బీహార్గా బంకిపూర్
బంకిపూర్ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే అది ఒక మినీ బీహార్ అర్బన్ నియోజకవర్గంలా కనిపిస్తుంది.
హైదరాబాద్లో దిల్సుఖ్నగర్, కేపీహెచ్బీ వంటి మిశ్రమ సామాజిక నిర్మాణం ఉన్న ప్రాంతాలతో దీన్ని పోల్చవచ్చు.
అందువల్ల ఈ నియోజకవర్గ ఫలితాలను కేవలం స్థానిక ఎన్నికగా కాకుండా బీహార్ రాజకీయ మూడ్కు ప్రతిబింబంగా కూడా చూడవచ్చు.
—
బూత్ వారీ ఫలితాలు ఏమి చెబుతున్నాయి?
మొత్తం 422 బూత్లలో బీజేపీ ఆధిక్యం సాధించింది కేవలం 20 బూత్ల్లో మాత్రమే.
ఇది ఓటర్లు ఎంత స్పష్టంగా బీజేపీని తిరస్కరించారో చూపించే గణాంకంగా విశ్లేషించబడుతోంది.
—
బంకిపూర్ సామాజిక సమీకరణ
కులాల వారీ జనాభా
– Kayastha – 14%
– Yadav – 12%
– Muslim – 8%
– Chandravanshi – 9%
– Vaishya – 8%
– Dalit / SC – 8%
– Bhumihar – 7%
– Rajput – 7%
– Brahmin – 6%
– Kurmi – 5%
– Kushwaha – 3%
ఈ గణాంకాలను పరిశీలిస్తే, అగ్రవర్ణాల ఓటు ప్రభావం దాదాపు 42-45 శాతం వరకు ఉంటుందని అర్థమవుతుంది.
ఇదే వర్గం చాలా కాలంగా బీజేపీకి ప్రధాన బలంగా నిలిచింది.
—
అగ్రవర్ణాల అసంతృప్తి ప్రభావం
ఈసారి అగ్రవర్ణాల ఓటు గణనీయంగా దూరమవ్వడానికి ప్రధాన కారణంగా బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నాయకత్వంపై వచ్చిన అసంతృప్తిని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు.
కుశ్వాహా సామాజిక వర్గానికి చెందిన సీఎం హయాంలో బ్రాహ్మణ యువకుడు భరత్ భూషణ్ తివారి ఫేక్ ఎన్కౌంటర్ ఘటన జరిగిన తర్వాత అగ్రవర్ణాల్లో అసహనం పెరిగిందనే అభిప్రాయం ఉంది.
దాని ప్రభావం నేరుగా బీజేపీ సంప్రదాయ ఓటు బ్యాంకుపై పడిందని విశ్లేషణలు సూచిస్తున్నాయి.
—
ప్రశాంత్ కిషోర్ వ్యూహం
అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ (బ్రహ్మణ సామాజిక వర్గం ) చదువుకున్న అర్బన్ ఓటర్లను ఆకర్షించడంలో విజయవంతమయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆ వర్గాన్ని కౌంటర్ చేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది.
ఒకప్పుడు లాలూ ప్రసాద్, నితీష్ కుమార్, కాంగ్రెస్ కలిసి పోటీ చేసినా సుమారు 40 వేల మెజారిటీతో గెలిచిన నితిన్ నబిన్ ఇప్పుడు జాతీయ స్థాయి నాయకుడిగా ఉన్నప్పటికీ తన సీటును కోల్పోవడం బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
—
ఓటమికి దారితీసిన ఇతర అంశాలు
ఈ ఫలితానికి మరికొన్ని కారణాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
– అభ్యర్థి ఎంపికపై అసంతృప్తి.
– ఎన్నికల సమయంలో ఆర్జేడీ పెద్ద ఎత్తున ప్రచారం చేయకపోవడం.
– తేజస్వి యాదవ్ రెండు వారాలపాటు విదేశీ పర్యటనలో ఉండడం.
– ప్రశాంత్ కిషోర్ ఎన్నికల నిర్వహణ.
– “కుక్కనైనా, పిల్లినైనా నిలబెట్టినా గెలుస్తాం” అనే ధోరణిలో బీజేపీ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను జనసూరజ్ పార్టీ బూత్ స్థాయిలో బలంగా ప్రచారం చేయడం.
ఈ అన్ని అంశాలు కలిపి బీజేపీ ఓటమికి దోహదపడ్డాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
—
బంకిపూర్ ఫలితాన్ని కేవలం ప్రశాంత్ కిషోర్ వ్యక్తిగత విజయంగా మాత్రమే చూడలేం .
ఈ ఎన్నిక బీజేపీకి ఒక స్పష్టమైన రాజకీయ సందేశాన్ని ఇచ్చింది. ఒక రాజకీయ పార్టీ తన కోర్ ఐడియాలజీ, సంప్రదాయ సామాజిక మద్దతు, ప్రాథమిక ఓటు బ్యాంకును నిర్లక్ష్యం చేస్తే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ ఉప ఎన్నిక గుర్తు చేసింది.
కర్ణుడి చావుకు లక్ష కారణాలు అన్నట్లే… బంకిపూర్లో బీజేపీ ఓటమికి కూడా ఒక్క కారణం కాదు, లక్ష కారణాలు ప్లస్ ఇంకో కారణం అదనంగా కలిసి పనిచేశాయి.
Share this Article