.
Subramanyam Dogiparthi …. పుణ్యభూమి నా దేశం నమో నమామి
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి
మహామహుల కన్న తల్లి నా దేశం
మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం
…. చరిత్ర సృష్టించిన మేజర్ చంద్రకాంత్ సినిమా పేరు చెప్పగానే ఎవరికయినా ముందుగా గుర్తొచ్చేది జాలాది వ్రాసిన ఈ పాటే . స్వాతంత్ర్య దినోత్సవం నాడు , రిపబ్లిక్ డే నాడు , తెలుగు దేశం పార్టీ సభలప్పుడు ఈ పాటను వేయాల్సిందే .
Ads
సినిమాలో కూడా రాఘవేంద్రరావు ఈ పాటను యన్టీఆర్ లెవెల్లోనే చిత్రీకరించాడు . ఈ పాటలో యన్టీఆర్ ఛత్రపతి శివాజీ , వీర పాండ్య కట్టబ్రహ్మన , సుభాష్ చంద్ర బోస్ , అల్లూరి సీతారామరాజు వంటి దేశ భక్తుల వేషాల్లో అభిమానులను అలరించారు . అన్నీ తన అభిమాన పాత్రలే. కొన్ని చేయాలనుకునీ చేయని పాత్రలే…
ఈ సినిమాకు మరో రెండు విశేషాలు కూడా ఉన్నాయి . బసవ తారకం కేన్సర్ హాస్పిటల్ నిధుల కొరకు యన్టీఆర్ నటించాలని ప్రకటించినప్పుడు మోహన్ బాబు ముందుకొచ్చి ఈ బ్లాక్ బస్టర్ నిర్మించి యన్టీఆర్ సినీ చరిత్రలో చోటు సంపాదించుకున్నాడు . మరో విశేషం ఈ సినిమా శత దినోత్సవ సభలోనే లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోబోతున్నట్లు యన్టీఆర్ ప్రకటించారు . ఆ ప్రకటన రాష్ట్రంలో , దేశంలో కలకలం రేపింది .
ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ యన్టీఆర్ స్థాయికి తగ్గకుండా కధను నేసి, తదనుగుణంగా డైలాగులను కూడా వ్రాసారు . ఆ డైలాగులు యన్టీఆరే చెప్పాలి . ఆ తర్వాత కృష్ణే . ఈ సినిమా అఖండ విజయానికి యన్టీఆర్ డైలాగులు కూడా పనిచేసాయి . సినిమా కధ దేశద్రోహుల శిక్షణ . సినిమా చూడనివారు ఎవరూ ఉండరేమో ! ఒకరూ అరా ఉంటే యూట్యూబులో ఉంది . చూడండి .
సినిమా ఘన విజయానికి కీరవాణి సంగీత దర్శకత్వంలో జాలాది , గురుచరణ్ , రసరాజు , కీరవాణి వ్రాసిన పాటలు , వాటిని అత్యంత ప్రేక్షక రంజకంగా పాడిన బాలసుబ్రమణ్యం , జేసుదాస్ , మనో , చిత్ర గాత్రం దోహదం చేసాయి . ముఖ్యంగా డ్యూయెట్లను తన ప్రత్యేక బాణిలో చిత్రీకరించారు రాఘవేంద్రరావు .
నగ్మా & మోహన్ బాబు , రమ్యకృష్ణ & మోహన్ బాబుల మీద అయిదు డ్యూయెట్లు బ్రహ్మాండంగా ఉంటాయి . ముద్దులతో ఓనమాలు , ఉలికిపడకు అల్లరి మొగుడు , బుంగమూతి , లప్పం తప్పం గాళ్ళకి , నీక్కావలసింది నా దగ్గర ఉంది అంటూ సాగుతాయి . సుఖీభవ సుమంగళి సుఖీభవ పాట కూడా బాగా హిట్టయింది .
1993 ఏప్రిల్లో విడుదలయిన ఈ సినిమాలో భారీ తారాగణాన్ని దించేసారు . సినిమా అంతా యన్టీఆర్ , మోహన్ బాబే . మోహన్ బాబు కొడుకు అప్పట్లో మాస్టర్ మనోజ్ కుమార్ యన్టీఆర్ మనమడిగా నటించాడు . ప్రధాన పాత్రల్లో మోహన్ బాబు , శారద , అమ్రీష్ పురి , నగ్మా , రమ్యకృష్ణ , రేఖ , గుమ్మడి , శ్రీహరి , సాయికుమార్ , శుభ , ప్రసాద్ బాబు , పరుచూరి గోపాలకృష్ణ , అచ్యుత్ , వినోద్ , నర్రా , బాబూమోహన్ , బ్రహ్మానందం , అన్నపూర్ణమ్మ , బాలయ్య , కిన్నెర , చలపతిరావు , తదితరులు నటించారు .
ప్రజా ఉద్యమం పేరుతో ప్రధాన నగరాలలో యన్టీఆర్ మీటింగులు అప్పట్లో ఆయన political come back కు కూడా ఉపకరించాయి . యన్టీఆర్ నట చరిత్రలో ఇదే ఆఖరి సినిమా . ఆ తర్వాత 1994 చివర్లో ఎన్నికల్లో గెలవటం , ముఖ్యమంత్రి కావటం , 1995 ఆగస్టులో పదవీచ్యుతుడు కావటం , 1996 జనవరిలో చనిపోవటం తెలుగు వారందరికీ తెలిసినవే . తెలుగు చలన చిత్ర రంగంలో , రాజకీయ రంగంలో అలా ఆయన శకం ముగిసింది .
Share this Article