.
Subramanyam Dogiparthi …. మధురమే సుధాగానం
మనకిదే మరో ప్రాణం
మదిలో మోహన గీతం
మెదిలే తొలి సంగీతం
1992 నవంబరులో విడుదలయిన ఈ బృందావనం సినిమా పేరు వినగానే నాకు గుర్తొచ్చేది ఈ మధుర గీతమే . కె వి రెడ్డి గారి శిష్యుడు సింగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహించిన ఈ బృందావనం సినిమా కూడా ఈ పాటలాగానే సుధాగానం . ఆ సుధాగానానికి తగ్గట్లుగానే కధను , సంభాషణలను రచించారు అలనాటి మేటి రచయిత డి వి నరసరాజు గారు .
ఓ చక్కని కధకు సింగీతం వారు హాస్యరసాన్ని జోడించి ఓ ప్రేమ కధను , దానితోపాటు అమ్మమ్మ కలను నిజం చేసే మనమడి నిర్వాహకత్వాన్ని తెరపై ఎక్కించారు . మనుషుల్లో చాలామందికి తాము కష్టపడి నిర్మించుకున్న నివాసాల మీద , వ్యాపార సామ్రాజ్యాల మీద , కుటుంబాల మీద అపేక్ష ఉంటుంది , ఏర్పడుతుంది .
Ads
గుమ్మడి వద్ద పనిచేసే సత్యనారాయణ కామందుని మోసం చేసి అతని బృందావనాన్ని కబ్జా చేస్తాడు . ఆ మనోవ్యధతోనే అతను చనిపోతాడు . ఆ విషాద సమాచారాన్ని తెలుసుకున్న మనమడు రాజేంద్రప్రసాద్ ఆ బృందావనాన్ని తిరిగి సాధించే వ్యవహారమే ఈ సినిమా కధాంశం .
తన తాతను ఎలా అయితే సత్యనారాయణ మోసం చేసాడో అలాగే రీప్లే చేసి ప్రతీకారం తీర్చుకుంటాడు . ఆ కార్యక్రమంలో తన ప్రియురాలు , సత్యనారాయణ కూతురు రమ్యకృష్ణ కూడా సహాయపడుతుంది . ఈ ప్లాటుకి హీరోహీరోయిన్ల కామెడీ , ప్రేమ , శ్రావ్యమైన పాటల్ని కలిపి ఓ చక్కని కావ్యంగా తీర్చిదిద్దారు సింగీతం వారు .
సినిమా అంతా రాజేంద్రప్రసాద్ , రమ్యకృష్ణలే . చాలా ఎనర్జిటిక్ గా , హిలేరియస్ గా నటించారు . అద్భుతమైన కెమిస్ట్రీ ఇద్దరి మద్య . శ్రీలక్ష్మికి మరో మంచి పాత్ర లభించింది . మారు తల్లి అయినా రమ్యకృష్ణని వీర సపోర్ట్ చేస్తూ తన నటనతో , డైలాగ్ డెలివరీతో భర్త సత్యనారాయణని విసిగిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది .

ఇతర పాత్రల్లో శుభలేఖ సుధాకర్ , భాగ్యశ్రీ , అంజలీదేవి , రావి కొండలరావు , రాధాకుమారి , రాళ్ళపల్లి , నాగేష్ , గుమ్మడి , రంగనాథ్ తదితరులు నటించారు . సినిమా హిట్టవ్వటానికి మరో ప్రధాన కారణం మాధవపెధ్ది సురేష్ సంగీతం , బేక్ గ్రౌండ్ స్కోర్ . మధ్యలో ఎక్కడో ఒకచోట ఎంత హాయి ఈరేయి ఎంత మధురమీ హాయి పాట హమ్మింగుని ప్లే చేస్తారు . వెన్నెలకంటి వ్రాసిన పాటల సాహిత్యాన్ని మెచ్చుకోవాలి . మధురమే సుధాగానం పాట . ఎంత మధురంగా వ్రాసారో .
అంతే మధురంగా పాటలనన్నీ బాలసుబ్రమణ్యం , జానకమ్మ శ్రావ్యంగా పాడారు . ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి , అబ్బో ఏమి వింతో తొలిసారి కౌగిలింత , ఓహో ఓహో బుల్లి పావురమా డ్యూయెట్లను సింగీతం వారు చాలా అందంగా చిత్రీకరించారు . సత్యనారాయణను అల్లరి పెట్టే పాటను రాజేంద్రప్రసాద్ మీద ఓ మావయ్యా మాయల్లో శకునికే తాతయ్య పాట హుషారుగా సాగుతుంది .
చందమామ విజయ కంబైన్స్ బేనరుపై నిర్మించబడింది ఈ సినిమా . చందమామ అంటే పత్రిక , విజయ అంటే ఏంటో చెప్పే పనిలేదు తెలుగు వారికి ముఖ్యంగా . ఆ రెండు సంస్థల ఆధ్వర్యంలో బి వెంకటరామిరెడ్డి నిర్మించిన ఈ చక్కటి చిత్రం యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూసి ఉన్నా మరలా చూడవచ్చు …
Share this Article