.
Subramanyam Dogiparthi ……… ఎక్కువ మంది తల్లిదండ్రులు బహుదూరపు బాటసారులే . ఢెభ్భై ఏళ్ళు దాటినా ఎనభై ఏళ్ళు దాటినా పొద్దున్నే లేచి తట్టాబుట్టా సర్దుకొని ప్రయాణానికి బయలుదేరుతూ ఉండాల్సిందే .
అలాంటి సంతాన వజ్రాలు దొరుకుతాయి కొందరు తల్లిదండ్రులకు . అలా కాకుండా కష్టాల్లో ఉన్న తల్లిదండ్రుల్ని , వయసుడిగిన తల్లిదండ్రుల్ని తామే తల్లిదండ్రులయి సాకే బిడ్డలు ఎంత మంది !! అలా ఉన్న బిడ్డలందరికీ శత కోటి వందనాలు .
Ads
బిడ్డలే కాదు ; తోబుట్టువులు , బంధువులు , స్నేహితులు , సహచరులు , అనుచరులు అందరూ కల్తీ అయిపోతున్నారు . కల్కి కాలం కదా !
ఇలాంటి కధా వస్తువుతో ఎన్నో సినిమాలు వచ్చాయి . చాలానే సక్సెస్ అయ్యాయి . ప్రేక్షకులు సినిమాలో లీనం కావడమే కాకుండా ఆ పాత్రల్లో తమను తాము చూసుకుంటారు . తమకు అన్వయించుకుంటారు . ఆ కోవకు చెందిందే 1983 మే 19 న వచ్చిన ఈ బహుదూరపు బాటసారి సినిమా .
దాసరి మార్క్ సినిమా , దాసరి సినిమా . స్వంత నిర్మాణ సంస్థ బేనరులో మాటలు , పాటలు , స్క్రీన్ ప్లే , దర్శకత్వంలను వహించి సూపర్ హిట్టుగా తీసారు . ఓ కోతలరాయుడి ప్రధాన పాత్ర కూడా వహించారు . నేనే పాత్ర . అన్నీ ఆయనే చేసినట్లు పోజు కొట్టే డబ్బారాయుడి పాత్ర .
ప్రేక్షకులకు , ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు , ఎంత నచ్చిందంటే 18 సెంటర్లలో వంద రోజులు , 3 సెంటర్లలో 125 రోజులు , రెండు సెంటర్లలలో 175 రోజులు , హైదరాబాదులో 200 రోజులు ఆడించారు . ఈ సినిమాకు రెండు నంది అవార్డులు కూడా వచ్చాయి . ఉత్తమ నేపధ్య గాయకుడిగా బాలసుబ్రమణ్యంకు , ఉత్తమ కధగా రచయితలు పాలగుమ్మి పద్మరాజు మరియు ఆర్ కె ధర్మరాజులకు అవార్డులు వచ్చాయి .
అంతగా హిట్టయింది . సినిమాలో ముందుగా అభినందించ వలసింది అక్కినేని , సుజాతలనే . కొన్ని సన్నివేశాల్లో ధర్మదాత అక్కినేని కనిపిస్తాడు . ఎక్కడి తలుపులు అక్కడే మూసేయ్ పాటలో పొండిరా పొండి అంటూ పాడిన ధర్మదాత పాత్ర గుర్తుకు వస్తుంది .
ఇంక డాన్సుల్లో చెప్పేదేముంది ! అరవై ఏళ్ళ వయసులో కూడా జయమాలినితో సమానంగా గంతులు వేసాడు అలమటించి పోతున్నాను బాబు పాటలో . జయమాలిని కూడా రొటీన్ డాన్సుకు భిన్నంగా డాన్సించింది .
తర్వాత సుజాత . ఆమె అంటే దాసరికి ప్రత్యేక ఇష్టమేమో తెలీదు కానీ ఆమె నటించిన పాత్రలన్నీ దాసరి తన సినిమాలలో గొప్పగా రచించారు . ఈ సినిమాలో కూడా భార్య- తల్లి పాత్రల బాధ్యతల మధ్య నలిగిపోయే పాత్రలో జీవించింది . అక్కినేనితో ఎవరో ఎవరో తెలియకుండా అంటూ సాగే డ్యూయెట్లో అందంగా అలరించింది .
ఇతర ప్రధాన పాత్రల్లో డబ్బారాయుడు దాసరి , కొడుకులుగా భానుచందర్ , రాజా , మూగ చెవిటి కూతురుగా సుహాసిని నటించారు . ఆమెకు జంటగా నారాయణరావు నటించారు . అతనిదీ మూగ చెవిటి పాత్రే . ఇద్దరూ బాగా నటించారు . ఇతర పాత్రల్లో సుమలత , గుమ్మడి , అల్లు రామలింగయ్య , రమాప్రభ , ప్రభాకరరెడ్డి , ప్రభృతులు నటించారు .
రమేష్ నాయుడు సంగీత దర్శకత్వంలో పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . మరీ మరీ ముఖ్యంగా సుమలత పాత్ర పాడే మేఘమా నీలి మేఘమా పాట సాహిత్యపరంగా కూడా గొప్పగా ఉంటుంది . పాటను వ్రాసిన దాసరిని మెచ్చుకోవలసిందే . అయ్యప్ప మీద భక్తి పాట పంపానది తీరాన శబరిమల పీఠాన ఎంత పాపులర్ అయిందంటే అయ్యప్ప భజనల్లో కూడా పాడుతుంటారు .
ఇంత సూపర్ హిట్టయిన సినిమా ఎందుకనో యూట్యూబులో లేదు . మిత్రులు ప్రయత్నించి ఈ సినిమాను యూట్యూబులోకి ఎక్కిస్తే ముందు తరాల వాళ్ళకు వీక్షించే అవకాశం కలుగుతుంది . తరచూ ఏదో ఒక టివి చానల్లో వస్తూ ఉంటుంది . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు
Share this Article