పేద దేశాల్లో హెచ్ఐవి-క్షయవ్యాధి తీవ్రతను చౌకైన మాంటు పరీక్షతో అంచనా వేయవచ్చని కాకినాడ వైద్యుని పరిశోధనకు అంతర్జాతీయ గుర్తింపు
పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలలో హెచ్ఐవి/ఎయిడ్స్ మరియు క్షయవ్యాధి ప్రజారోగ్య రంగానికి ఇప్పటికీ ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి. అయితే, ఈ దేశాలలో ఎయిడ్స్ వ్యాధి తీవ్రతను అంచనా వేయడానికి ఉపయోగించే ఖరీదైన సీడీ4 మరియు వైరల్ లోడ్ పరీక్షలు అందరికీ అందుబాటులో లేవు.
ఇప్పటికీ ఈ దేశాలలో దాదాపు 40 శాతం మంది హెచ్ఐవి రోగులు వ్యాధి బాగా ముదిరిన దశలోనే ఆసుపత్రులకు చేరుతున్నారు. వీరిలో అధిక శాతం మంది క్షయవ్యాధితో బాధపడుతుంటారు.
Ads
ఇలాంటి రోగులలో మాంటు (ట్యూబర్క్యులిన్ స్కిన్) పరీక్ష అనే చౌకైన పరీక్ష ద్వారా వ్యాధి తీవ్రతను అంచనా వేయవచ్చని, తద్వారా ఖరీదైన పరీక్షలు అందుబాటులో లేని పేద దేశాలలో కూడా రోగులకు తగిన చికిత్స అందించవచ్చని డాక్టర్ యనమదల మురళీకృష్ణ తన పరిశోధనలో నిరూపించారు.

ఈ అధ్యయనాన్ని డాక్టర్ మురళీకృష్ణ 1998–99 సంవత్సరాలలో కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో ఎం.డి. పరిశోధన సిద్ధాంతంగా నిర్వహించారు. 2000 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలోని డర్బన్లో జరిగిన 13వ అంతర్జాతీయ ఎయిడ్స్ సదస్సులో, ప్రపంచవ్యాప్తంగా సమర్పించిన 5,300కు పైగా పరిశోధన సారాంశాలలో ఈ అధ్యయనం అత్యుత్తమ 25 సారాంశాలలో ఒకటిగా ఎంపికైంది.
ఈ పరిశోధనను ఇప్పుడు పూర్తి స్థాయి పరిశోధనా వ్యాసంగా ప్రపంచ ప్రఖ్యాత ఎల్సివియర్ సంస్థ ప్రచురించే జర్నల్ ఆఫ్ క్లినికల్ ట్యుబర్ క్యులోసిస్ అండ్ అదర్ మైకోబాక్టీరియల్ డీసీజెస్ (Journal of Clinical Tuberculosis and Other Mycobacterial Diseases) పత్రిక 2026 ఆగస్టు సంచికలో ప్రచురించింది.
దీంతో ఖరీదైన పరీక్షలు అందుబాటులో లేని పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలలో మాంటు పరీక్షను ఉపయోగించి హెచ్ఐవి-క్షయవ్యాధి రోగుల వ్యాధి తీవ్రతను అంచనా వేసి, తగిన చికిత్స అందించే అవకాశాలకు ఈ పరిశోధన శాస్త్రీయ ఆధారం అందించినట్లైంది.
ఈ సందర్భంగా డాక్టర్ యనమదల మురళీకృష్ణ మాట్లాడుతూ, “అందుబాటులో ఉన్న వనరులతోనే సమర్థవంతమైన వైద్యం అందించడానికి ఇలాంటి పరిశోధనలు ఎంతో ఉపయోగపడతాయి” అని అన్నారు.
ఈ పరిశోధనలో క్షయ మరియు శ్వాసకోశ వ్యాధుల విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సున్నం సత్యశ్రీ సహకారం అందించారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ జాన వీరభద్ర ప్రసాద్, డాక్టర్ పొన్నమళ్ళ వి ప్రసన్న కుమార్, శ్రీమతి యనమదల గీత తదితరులు పాల్గొన్నారు.
Share this Article