.
ఏపీలో ఏదైనా అంతే.,. మొత్తం పెట్రోల్ పోసి ఉంటుంది… ఏ చిన్న అగ్గిరవ్వయినా చాలు అంటుకోవడానికి… తెలుగు రాజకీయాలు పరమ నీచస్థాయికి చేరిన ప్రాంతం… మంటలు కొన్నిసార్లు ఎటు వ్యాపిస్తున్నాయో కూడా అర్థం కాదు…
అమరావతి ప్రాంత మహిళల్ని సాక్షి చానెల్ అవమానించింది అనేది తాజా వివాదం… ఎవరో జర్నలిస్టు మ్యాగజైన్ ఎడిటర్ కృష్ణంరాజు అట… పేరు పెద్దగా తెలియదు, కొమ్మినేని వంటి సీనియర్ జర్నలిస్టు నిర్వహించే డిబేట్లోకి అతిథుల ఎంపిక జాగ్రత్తగా ఉండాలి, అది ఈమధ్య లోపించినట్టుంది…
Ads
వైసీపీ చానెల్ కాబట్టి కూటమి నాయకులో, అధికార ప్రతినిధులో పెద్దగా పాల్గొన్నట్టు కనిపించదు… ఎవరైతే ప్రొ-జగన్ ఆలోచన ధోరణిని కలిగి ఉంటారో వాళ్లను పిలిచి, ఒకే లైన్లో అందరూ మాట్లాడతారు, సరే, వాళ్లు డిబేట్ వాళ్లిష్టం… కానీ సదరు జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా నీచాభిరుచే… అతను నిజంగానే జర్నలిస్టు అయి ఉంటే, అది పాత్రికేయానికి కూడా మచ్చే…
అమరావతి దేవతల రాజధాని కాదు, అది వ్యభిచారులు, వేశ్యల రాజధాని, ఎయిడ్స్ క్యాపిటల్ అని చేసిన కామెంట్ ఖచ్చితంగా ఆ ప్రాంత మహిళలందరినీ కించపరిచేదే… అక్కడ వేశ్యల సంక్షేమం కోసం వందా, నూటా యాభై స్వచ్చంద సంస్థలు పనిచేస్తున్నాయంటాడు సదరు సోకాల్డ్ జర్నలిస్టు…
వేదిక ఏదయినా సరే, అసందర్భ, అనుచిత, అవాంఛనీయ, వెగటు, విచక్షణారహిత వ్యాఖ్యలు ఎవరు చేసినా అవి ఖండించాల్సిన ధోరణే… కొమ్మినేని తనను వారించకపోవడం ఇన్నేళ్ల తన పాత్రికేయానికి ఓ మరక… అందుకే రాష్ట్రంలో పలుచోట్ల మహిళలు సదరు జర్నలిస్టుతోపాటు కొమ్మినేని మీద కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు…
లోకేష్ సహా కూటమి నేతలు మండిపడుతున్నారు… ఎస్, ఏపీకి సంబంధించిన రెండు ప్రధాన జర్నలిస్టు సంఘాలు కూడా ఖండించాయి… ఈ ధోరణిని, ఈ వ్యాఖ్యల్ని తూర్పారబట్టాయి… అవును మరి, ఆ స్పందన హేతుబద్దమే… కూటమి ప్రభుత్వం ఏం కేసు పెడుతుంది, ఎవరెవరిని నిందితులుగా నమోదు చేస్తారనేది వదిలేస్తే… ఇందులోకి భారతీరెడ్డిని లాగడం కూడా కరెక్టు కాదు…
ఒక ఛైర్పర్సన్గా నైతిక బాధ్యత వహించాలనేది నిజమే గానీ… ఒక డిబేట్లో ఏ అంశాలు చర్చకొస్తాయో ఆమెకూ తెలియదు కదా ప్రాక్టికల్గా… కొమ్మినేని వంటి సీనియర్లు జాగ్రత్తగానే డీల్ చేస్తారని నమ్ముతారు కదా…. కాకపోతే మహిళలు ఆగ్రహంగా ఉన్నప్పుడు సంబంధిత వ్యక్తులందరినీ నిందిస్తారు, సహజం…
సదరు జర్నలిస్టు ఏదో ట్వీటుతూ వివరణ ఇచ్చుకున్నట్టు కనిపిస్తోంది… అవును, వేశ్యల సంఖ్యలో ఏపీ నంబర్ వన్ అనీ, అమరావతి పరిసర ప్రాంతాల్లో 100, 150 స్వచ్చంద సంస్థలు వారి సంక్షేమం కోసం పనిచేస్తునన్నట్టు గతంలో టైమ్స్ ఓ స్టోరీ రాసిందని చెప్పుకొచ్చాడు…
వోకే, ఏ రాజధానైనా సరే దానికి వేరే పవిత్రత ఏమీ ఉండదు… అది నిజమే గానీ… పనిగట్టుకుని ఒక ప్రాంతాన్ని, రాజధానిగా డెవలప్ కావాలనే ఆకాంక్ష ఉన్న పర్టిక్యులర్ ప్రాంతాన్ని, ఏళ్ల తరబడీ తమకు జరిగిన అన్యాయంపై మహిళలే తిరగబడి పోరాడిన ప్రాంతాన్ని వేశ్యల రాజధానిగా ప్రస్తావించడం, వ్యాఖ్యానించడం, సంబోధించడం ఖచ్చితంగా తప్పే… పైగా దానికి పదే పదే సమర్థన… లెంపలేసుకోకుండా..!
అఫ్కోర్స్, సాక్షి యాజమాన్యానికి ప్రత్యక్ష సంబంధం ఏమీ లేనట్టు పైకి కనిపించవచ్చుగాక… కానీ ఆ మూర్ఖ కూతలకు వేదికయింది సాక్షే కాబట్టి… సాక్షిని కూడా టార్గెట్ చేస్తున్నారు ఏపీ మహిళలు… ప్రత్యేకించి తూళ్లూరు తదితర ప్రాంతాల మహిళలు… ఏపీ రాజకీయ నేతలు… సాక్షి గనుక దీన్ని సమర్థించుకుంటే తనను తానే దిగజార్చుకున్నట్టు..!! అమరావతి రాజధానిని మరీ ఈ ముద్రలతో కించపరచడం కరెక్టు కాదు..!!
Share this Article