.
గాజ-ాపై ఇజ్రాయిల్ దాడులతో నెలకొన్న ఆహార సంక్షోభం అక్కడి జనాన్ని అతలాకుతలం చేస్తోంది. కనీస ఆహార నిల్వలు లేక బిస్కట్స్ తిని బతుకుతున్న దైన్య పరిస్థితుల్లో మన పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్ ధర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఇండియన్స్ కు 19 వ శతాబ్దంలో నోస్టాల్జియాగా మారిన పార్లే-జీ బిస్కట్ ప్యాకెట్ రేటు ఇప్పుడక్కడ 24 యూరోలు.. అంటే 2400 రూపాయలంటే మీరు నమ్మగలరా..? మన దగ్గర కేవలం ఐదు రూపాయలకు కొనుక్కోగల్గిన బిస్కట్ ప్యాకెట్ కు అక్కడి ఆహార సంక్షోభం ఏకంగా 500 రెట్లు ధర పెంచేసింది.
Ads
ఈ క్రమంలో తన కొడుకు రవీఫ్ కు ఇష్టమైన పార్లే జీ బిస్కట్ ప్యాకెట్ ను మొత్తానికి కొనుక్కోగల్గానని.. అయితే, దాని ధర ఒకటిన్న యూరోల నుంచి అమాంతం 24 యూరోలకు పెరిగిందంటూ మహమ్మద్ జావద్ అనే వ్యక్తి X వేదికగా చేసిన పోస్ట్ తో.. ఇప్పుడు మళ్లీ పార్లే జీ చర్చ ట్రెండింగ్ గా మారింది.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధికంగా అమ్ముడుపోయిన బిస్కట్ ప్యాకెట్ గా పార్లే జీకి పేరుంది. వేడి వేడి టీ కప్పో వైపు.. ఓ ప్లేట్ లో పెట్టిన పార్లే జీ బిస్కట్స్ ఇంకోవైపు అలా ఇప్పటికీ ఆస్వాదించేవారున్నారు. 1929లో మోహన్ లాల్ దయాల్ ఈ పార్లే జీ బిస్కట్ తయారీని మొదలెట్టాడు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తీవ్ర ఆహార సంక్షోభాన్ని దేశం ఎదుర్కొన్న పరిస్థితుల్లో కొన్ని సవాళ్లనూ ఎదుర్కొంది ఈ కంపెనీ. అయినా, వెనుకడుగు వేయకుండా విలక్షణమైన ప్యాకింగ్, బలమైన బ్రాండ్ గుర్తింపుతో జనాదరణ సంపాదించింది.
ఓ చిన్న పాప రెండు చేతుల వేళ్లను చూపిస్తూ కాస్త పైకి చూస్తుండే ఫోజుతో పార్లే జీ ప్యాకెట్ పైనుండే డిజైనింగ్ మన దేశంలోని ఓ రెండు తరాలకు ఓ మధురమైన జ్ఞాపకం. అలా నగరాల నుంచి మారుమూల పల్లెల వరకూ పార్లే జీ బిస్కట్ ఓ ప్రత్యేకతను దక్కించుకుంది.
మగన్ లాల్ దహియా అనే ఆర్టిస్ట్ పార్లే జీ ప్యాకింగ్ కు రూపకల్పన చేశాడు. సుమారు 1960ల్లో మనం ఇప్పటికీ చూసే ఆ పాపతో కూడిన పార్లే జీ ప్యాకింగ్ డిజైన్ పురుడుపోసుకుంది.
పార్లే జీ ప్యాకెట్ పై కనిపించే అమ్మాయి బొమ్మ వెనుక ఏదైనా కారణముందా అంటే యాదృచ్ఛికంగానే ఓ కల్పిత పాత్రగా ఆ అమ్మాయి బొమ్మతో డిజైన్ చేశారు మగన్ లాల్. కానీ, అది వినియోగదారులతో చాలా డెప్త్ గా కనెక్టైపోయింది. ఆ తర్వాత దాదాపు భారతదేశంలో ఇంటింటికీ పార్లే జీ బిస్కట్ ప్యాకెట్ చేరుకునే స్థాయికి చేరుకుంది.
ఇంతకీ పార్లే జీ లో జీ అంటే ఏమిటి..?
చాలామంది పార్లే జీ లో జీని గ్లూకోజ్ అని అర్థం చేసుకుంటుంటారు. కానీ, అది జీనియస్ కు సింబాలిక్ గా పెట్టిన పేరట. నాణ్యతతో పాటు, స్నాక్స్ గా ఆకలి తీర్చడం, ఛాయ్ బిస్కెట్ పార్టీల్లో తరచూ కనిపించడంతో ఈ బ్రాండ్ బలంగా జనంలోకి వెళ్లి బంధాన్నేర్పర్చుకుంది. ప్రతీ ఇంట్లో కనిపిస్తూ ఓ నోస్టాల్జియాగా మారిపోయింది. పురా జ్ఞాపకాల్లోకెళ్లే ప్రతీసారీ ఆ బిస్కట్ కూడా ఓ చర్చగా మారేంత బంధాన్నేర్పర్చుకుంది.
ప్రపంచంలోనే అత్యుత్తమ బిస్కెట్ గా పార్లే జీ!
1980ల్లో పెప్సీ వర్సెస్ కోలా మధ్య పానీయపట్టు యుద్ధాలు జరుగుతున్న సమయంలో.. స్వదేశీ బ్రాండ్ పార్లే కూడా పానీయాల మార్కెట్ లోకి వచ్చి ఆ స్పేస్ ను ఆక్రమించింది. ఎంతలా అంటే.. అప్పటికే కూల్ డ్రింక్స్ మార్కెట్ ను శాసిస్తున్న కోకాకోలా.. ఏకంగా పార్లే జీ ప్రోడక్టైన థమ్స్ అప్ ను కొనాలని నిర్ణయించుకునే స్థాయికి చేర్చింది దాని శీతల పానీయ ఉత్పత్తుల స్థాయిని. అలా స్వదేశీ బ్రాండ్స్ గా థమ్స్ అప్, లిమ్కా, గోల్డ్ స్పాట్ తో పాటు.. ఫ్రూటీ వంటి శీతల పానీయాలతోనూ పార్లే మార్కెట్ ను శాసించింది
2011లో నీల్సన్ సర్వేలో పసుపు పచ్చ ప్యాకెట్ తో కనిపించే పార్లే జీ ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన బిస్కెట్ గా గుర్తింపు పొందింది.
మార్కెట్ లో ఎన్నో వస్తువుల ధరలు అనూహ్యంగా పెరుగుతూ వస్తున్నా.. ద్రవ్యోల్బణాన్నీ తట్టుకుని ఎటువంటి లొంగుబాట్లకు గురికాకుండా పార్లే జీ మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీగా దాని ఉనికిని కాపాడుకుని వినియోగదారులకు అందుబాటు ధరలో లభించింది. ఇప్పటి గాజా తరహాలోనే.. చాలా సంక్షోభ సమయాల్లోనూ పార్లే జీ కేవలం ఒక బిస్కెట్ గా మాత్రమే మిగిలిపోకుండా కొందరికి జీవనాధారమైన ఆహారంగా కూడా నిలుస్తూ వచ్చింది.
పార్లే జీ వ్యవస్థాపకులు – వారి వారసత్వం!
పార్లే జీ వ్యవస్థాపకుడు మోహన్లాల్ దయాల్ చౌహాన్ వారసత్వాన్ని.. ఇప్పుడు ఆయన వారసులు విజయ్ చౌహాన్, శరద్, రాజ్ చౌహాన్ కలిసి ముందుకు తీసుకువెళుతున్నారు. పార్లే ఉత్పత్తులు మార్కె ట్ లో ఇప్పుడు హాట్ కేక్స్. మిల్క్ శక్తి బిస్కెట్స్, మొనాకో బిస్కెట్స్, క్రాక్ జాక్, మెలోడీ చాక్లెట్స్, మ్యాంగోబైట్, పాపిన్స్, లండన్ డెర్రీ, కిస్ మీ టోఫీ బార్స్ వంటివన్నీ పార్లే జీ ఉత్పత్తులే.
ఫోర్బ్స్ పత్రిక 2022లో వేసిన అంచనా ప్రకారం ఇప్పుడు పార్లే జీ యజమానులైన విజయ్ చౌహన్ వ్యాపార ఆస్తుల నికర విలువ ఏకంగా 5. బిలియన్ డాలర్స్… అంటే సుమారు 45 వేల 579 కోట్ల రూపాయలు. అయితే, చాలామంది బిజినెస్ టైకూన్స్ లా ఎలాంటి మీడియా హడావిడి, ఆర్బాటాలు కోరుకోని కుటుంబంగా విజయ్ చౌహన్ కుటుంబం కనిపిస్తుంది. తమ ఉత్పత్తులు.. పార్లే జీ బిస్కెట్సే తమ వినియోగదారులతో మాట్లాడతాయన్నదే వారి విశ్వాసమేమో…
.
Share this Article