.
ఏదో వీడియోలో ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటున్నాడు… అమరావతిలో కాలచక్ర ఉత్సవాలు జరిగాయి, శాతవాహనుల రాజధాని, ఓ పవిత్రత ఉంది, ఎవరు కించపరిచినా ఖండనార్హం… అని… ఇంకా ఏదేదో…
సారు గారు దారితప్పారు… అమరావతికి పవిత్రత ఉంది, దాన్ని కించపరడచానికి జర్నలిస్టు అని చెప్పబడుతున్న ఓ కృష్ణంరాజు వెక్కిరించలేదు… అది చంద్రబాబు కలల రాజధాని కాబట్టి వేశ్యల రాజధాని అన్నాడు… ఎయిడ్స్ రాజధాని అన్నాడు… ఎందుకు..?
Ads
అతను జగన్ క్యాంపు మనిషి కాబట్టి… అందుకే కొమ్మినేని తనను వారించలేదు సరికదా, ఈ వ్యాఖ్యలు చేసినందుకు నీ మాట ట్రోలింగు ఉంటుంది అన్నాడు… అంటే, తనకు తెలుసు, ఆ వ్యాఖ్యలు ఎంత నీచమో… ఐనా వారించలేదు, వెంటనే తను సారీ చెప్పలేదు… ఓ టీవీ డిబేట్ హోస్టుగా ఏమాత్రం నైతికతను పాటించలేదు… ఎందుకు..?
అది సాక్షి టీవీ కాబట్టి, ఇవన్నీ ఆశించలేం కాబట్టి… పైగా ఆ అతిథి ఎవరో తమకు ఆత్మానందం కలిగేలా ఏవో పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నాడు కాబట్టి…. సో, ఈ ధోరణితో కొమ్మినేని ఇన్నేళ్ల సీనియారిటీ, ఈ పేరు మట్టిగలిసిపోయాయి…
నిజానికి ఒకప్పుడు… అంటే ఎన్టీయార్ను వెన్నుపోటు పొడిచిన రోజుల్లో కొమ్మినేని చంద్రబాబుకు అత్యంత ఆత్మీయుడు… ఎస్, సీనియర్ జర్నలిస్టు బుద్ధా మురళి చెప్పినట్టు… ఇవి రాజకీయాలు, ఇందులో బంధుత్వాలకు పెద్ద విలువేమీ ఉండదు… జీవితాంతం కొమ్మినేని ఆ క్యాంపు లక్షణాల్నే కలిగి ఉన్నా సరే, ఎప్పుడో ఏదో దుర్బల క్షణంలో లోకేష్కెు కోపమొచ్చింది… ఎన్టీవీ నుంచి తరిమేదాకా ఊరుకోలేదు…
మరి ఎన్టీవీ కాపాడుకుందా..? లేదు, వదిలేసింది… బాబు బాధితుడు అనగానే… తను అమితంగా వ్యతిరేకించే క్యాంపు మనిషి అయినా సరే కొమ్మినేనిని హత్తుకున్నాడు… కొలువు ఇచ్చాడు, మీడియా అకాడమీ కూడా ఇచ్చాడు…
వైసీపీలో జగన్ రైట్ హ్యాండ్ సజ్జల ఇలా చెబుతున్నాడు కొమ్మినేని గురించి.,.
కొమ్మినేని సుదీర్ఘకాలం జర్నలిస్టు… ఎస్… ఇష్యూస్ మీద ఆవేశం ఉంటుంది కానీ అసభ్యంతా ఎవరి మీద మాట్లాడడు… కరెక్ట్… డిబేట్ల విషయంలో కరుకుగా ఉంటాడు… సరే, ఏదో సమర్థింపు… చానెల్ లైన్ దాటడు అనడం కరెక్టు…
ఏదైనా మొహం మీదే కుండబద్దలు కొట్టినట్టు చెబుతాడు… తన అభిప్రాయాన్ని స్పష్ఠంగా చెబుతాడు… ఎన్టీవీలో చంద్రబాబే కొలువు తీయించాడు… న్యూట్రల్గా, భిన్నాభిప్రాయాలు తన డిబేట్లో ఉండాలనే భావిస్తాడు…. ఏదో విఫల సమర్థన ఇదంతా… ఒక వాక్యంతో మరో వాక్యానికి పొంతనే లేదు…
ఇక్కడ కొమ్మినేని అసభ్యంగా కామెంట్లు చేశాడని ఎవరూ అనడం లేదు… తనను ఆ కోణంలో తప్పుపట్టడం లేదు… నిజానికి తప్పంతా సాక్షి యాజమాన్యానిది… అబ్బే, ఆ గెస్టు అభిప్రాయాలు అవి, చానెల్కు సంబంధం లేదు అంటారు తప్ప… ఆ ప్రసారానికి బాధ్యత తనదే కదా, అంగీకరించదు, సారీ చెప్పదు… అదీ దారుణం…
అవును, రాజకీయం చేస్తున్నారు అంటారా..? ఏపీలో రాజకీయం కానిదేముంది..? ఎక్కడ ఎవరు ఏ రీతిన దొరికినా రాజకీయం వాడేసుకుంటోంది… జర్నలిస్టులు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతరత్రా అందరూ బోన్లలో నిలబడుతున్నారు, కాదు, నిలబెడుతున్నారు… సేమ్, జగన్… సేమ్, లోకేష్… మరీ సూక్ష్మ విశ్లేషణలు, లోతు సమీక్షలు, ప్రమాణాల బేరీజులు వేస్ట్…
అన్నట్టు… నాగేశ్వరా… ఇష్యూ అమరావతి పవిత్రత గురించి కాదు… ఓ ప్రాంత మహిళలందరినీ వేశ్యలుగా ముద్ర వేయడం గురించి, అందరూ ఎయిడ్స్ రోగులే అన్నట్టుగా ఓ మానసిక రోగి చేసిన వ్యాఖ్య గురించి… అదీ అభ్యంతరకరం… మరి టీవీ5, ఏబీఎన్, ఈటీవీ ఏం తక్కువా అనడక్కండి… ఏపీ రాజకీయాలంటేనే అంత… ఎవరూ తక్కువ కాదు… కాకపోతే ఏదైనా చాన్స్ దొరికితే చాలు… అధికారం ఆడుకుంటుంది… అదే జరుగుతోంది..!!
ఒక్క సాక్షి మినహా మిగతావన్నీ దాదాపు కూటమివే… ఈ ఒక్కటీ మూసేయాలనేదే అధికారం ఆలోచన.,. దానికి తగినట్టు నీచమైన వ్యాఖ్యలతో చేజేతులా చాన్స్ ఇచ్చే సాక్షి… దిద్దుబాటు కూడా లేదు పార్టీకి, చానెల్కు… ఐతే ఎవడో అతిథి చేసే ఏదో నీచమైన వ్యాఖ్యల వల్ల హోస్ట్ నేరస్థుడు అవుతాడా..? తన తప్పేం ఉంది..? ఇది అన్యాయం కాదా..?
ఎస్, అధికారం అంత లోతుల్లోకి వెళ్లదు… దొరికాడు, మూసేద్దాం, మిగతావాళ్లకు ఓ హెచ్చరిక, ఓ బెదిరింపు సంకేతం… అంతే… కొమ్మినేని కూడా ఆ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని చెప్పడం లేదు, నేను సీనియర్ సిటిజెన్ను, నోటీసులు ఇవ్వలేదేమి..? అని లాపాయింట్లు తీస్తున్నాడు… ఓ పాత్రికేయుడిగా నైతికతను మరిచినతనం అది…
అఫ్కోర్స్, కోర్టు ఏమంటుందో చూడాలిక..!! ఈ ఇష్యూ అప్పుడే సద్దుమణగదు… ఓ ప్రాంతం మీద గుండుగుత్తాగా వేశ్యలు అనే ముద్ర చాలా సీరియస్ ఇష్యూ… రాబోయే పరిణామాలు చూస్తుండాలి…! ఇది జర్నలిజం నైతిక ప్రమాణాలు, సవాళ్లు, సమర్థనల ఇష్యూ కాబట్టే ఇంత చెప్పుకోవడం..!!!
చివరగా…. మీడియాకు ప్రత్యేక హక్కులు ఏమీ ఉండవు, చట్టాలకు అతీతమైన స్వేచ్ఛ ఏమీ ఉండదు… రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటన స్వేచ్ఛ కల్పించినది, దానికే లోబడినది ఈ వ్యవస్థ… ప్రతి స్వేచ్ఛకూ పరిమితులుంటాయి… గీత దాటితే ఇదుగో.,. ఇలాంటి పరిణామాలు ఉంటయ్, పైగా రాజకీయాల బురద సరేసరి..!!
Share this Article