.
Subramanyam Dogiparthi…. కైకాల సోదరులు నిర్మాతలుగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా ఈ ఇద్దరు దొంగలు
. ఈ మాస్ మసాలా 1984 సంక్రాంతికి విడుదలయింది . వినోదంతో పాటు ఓ సందేశం కూడా ఉన్న సినిమా .
నేరస్థులను కఠిన శిక్షల ద్వారా సంస్కరించాలా లేక వారిలో మార్పును తెచ్చి సంస్కరించాలా అనేది ఈరోజుకీ ముడిపడని చర్చ . దో ఆంఖే బారా హాత్ హిందీ సినిమా , దాని తెలుగు రీమేక్ మా దైవం. కరుడుగట్టిన దొంగలను కూడా నమ్మకం , ప్రేమాభిమానాలతో సంస్కరించవచ్చనే సందేశంతో నిర్మించబడ్డ సినిమాలు .
Ads
ఆ సందేశమే ప్రేరణగా రచయిత సత్యానంద్ నేసిన కధే ఈ ఇద్దరు దొంగలు సినిమాది . విధివశాత్తూ చిల్లర దొంగలయిన ఇద్దరు యువ చోరులను సంస్కరిస్తానికి ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతిని తీసుకుని తన ఇంట్లో పెట్టుకుంటాడు యస్పీ సత్యనారాయణ . మొదట్లో ఆయన భార్య జీర్ణించుకోలేక పోయినా క్రమంగా వాళ్ళని ఆదరిస్తుంది .
ఇద్దరి దొంగలలో ఒకరయిన శోభన్ బాబు మాజీ ప్రేయసి జయసుధ అదే ఇంట్లో యస్పీ గారి మరదలు . ఆమెకు తాను దొంగగా ఎలా చేయబడ్డాడో వివరిస్తాడు . ఆ వివరణతో మాజీ ప్రేయసి మళ్ళా ప్రేయసి అయిపోతుంది . ఇలాంటి కధే మరో దొంగ కృష్ణకు కూడా ఉంటుంది . అలా ఇద్దరూ దొంగలుగా చేయబడ్డవారేనని రచయిత మనకూ చెపుతాడు .
యస్పీ గారు ఈ ఇద్దరు దొంగల సహాయంతో ఊళ్ళో పెద్ద మనుషుల ముసుగులో అఘాయిత్యాలు చేస్తున్న విలనాసురులను జనం ముందు నిలబెడతాడు . నేరస్థులను సంస్కరించవచ్చని రుజువు చేస్తాడు . కధ పాతదే అయినా కధనం బాగుంది . బిర్రయిన స్క్రీన్ ప్లే . భారీ తారాగణం .
ఇంక రాఘవేంద్రరావు గారి మసాలాలు ఉండనే ఉంటాయి కదా ! ఉన్నాయి కూడా . చక్రవర్తి సంగీత దర్శకత్వంలో వేటూరి వారి పాటలు , వాన పాట , వగైరాలతో సినిమాను రక్తి కట్టించారు దర్శకుడు . 16 కేంద్రాలలో వంద రోజులు ఆడింది . మా గుంటూరులో కృష్ణా పిక్చర్ పేలసులో ఆడింది . శత దినోత్సవ వేడుకలు మద్రాస్ తాజ్ కోరమాండల్ హోటల్లో జరిగాయి .
పాటలన్నీ హిట్టే . హుషారు హుషారుగా ఉంటాయి . జయసుధ, శోభన్ బాబు మీద పూటకొక్క పులకరింత , ఆ నవ్వుకు ఒక ఆమని డ్యూయెట్లు బాగుంటాయి . కృష్ణ, రాధ మీద డ్యూయెట్లు ఇంకా బాగుంటాయి . చిటుక్కు చిటుక్కు చినుకంటా వాన పాట రాఘవేంద్రరావు చాలా అందంగా చిత్రీకరించాడు . రాధ డాన్స్ కూడా బాగుంటుంది . నృత్య దర్శకుడు సలీంను అభినందించాలి . జిగినక జిగిజిగినక అంబ పలుకు , పంచదార చిలక పెట్టనా కంచి పట్టుచీరె పెట్టనా డ్యూయెట్లు అదరగొట్టేసారు .
సాధారణంగా ఇద్దరు టాప్ హీరోలు నటిస్తున్నప్పుడు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తూ సినిమాను తీస్తారు . దర్శకుడికి కత్తి మీద సామే . హీరోలు సర్దుకున్నా అభిమానులు రాజీ పడరు . గోలగోల చేస్తారు . ఆ గోల కాస్త ఈ సినిమాలో ఉంటుంది .
శోభన్ బాబు పాత్రకన్నా కృష్ణ పాత్ర ఎలివేట్ చేసినట్లుగా ఆయన అభిమానులు గోల పెట్టారు . అందులో కొంత నిజం ఉందని అనిపిస్తుంది . క్లైమాక్సులో ఇద్దరు హీరోలు , హీరోయిన్లు , కుటంబ సభ్యులు అందరూ ఉమ్మడిగా సంఘవిద్రోహులను ప్రభుత్వానికి అప్పచెప్పే కార్యక్రమంలో పాల్గొంటారు . ఓ పాట కూడా ఉందండోయ్ . గంగానమ్మ చెబుతోంది అంటూ సాగుతుంది .
కృష్ణకు జోడీగా రాధ , శోభన్ బాబుకు జోడీగా జయసుధ , సత్యనారాయణకు జోడీగా శారద నటించారు . విలనాసురులుగా రావు గోపాలరావు , గిరిబాబు , అల్లు రామలింగయ్య , ప్రభాకరరెడ్డి , నూతన్ ప్రసాదులు నటించారు . ఇంకా నాగేష్ , మమత , రాజ్యలక్ష్మి , చలపతిరావు , పి జె శర్మ , అన్నపూర్ణ , ప్రభృతులు ఉన్నారు . రావు గోపాలరావు డైలాగులను ప్రత్యేకంగా వ్రాసారు . సినిమా టైటిల్సుని వాడుతూ సంభాషిస్తూ ఉంటాడు . సరదాగా ఉంటుంది .
ఫుల్ ఎంటర్టయిన్మెంటుతో పాటు ఓ ఆలోచించతగ్గ సందేశం కూడా ఉన్న ఈ సినిమా యూట్యూబులో ఉంది . పాటల వీడియోలూ ఉన్నాయి . ఇంతకుముందు చూడనట్లయితే తప్పక చూడండి . కృష్ణ , శోభన్ బాబు , రాధ అభిమానులు మళ్ళా చూడొచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు
Share this Article