.
బనకచర్ల ప్రాజెక్టు వివాదం సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా హఠాత్తుగా ప్లస్ అయ్యింది… అది ఎన్నిరకాలుగా అంటే..?
1)
ఏ తెలంగాణ సెంటిమెంట్ను కేసీయార్ ఇన్నాళ్లూ తన ఎదుగుదలకు బ్రహ్మాండంగా వాడుకున్నాడో... అదే తెలంగాణ ప్రయోజనాలకు కేసీయార్ స్వయంగా పాతరేశాడు అని నిజాలు చెబుతూ... ఆ సెంటిమెంట్ బలాన్ని కత్తిరించి, అదే సెంటిమెంట్ను కేసీయార్ మెడకు చుట్టాడు...
గోదావరి జలాల మళ్లింపు విషయంలో కేసీయార్ అడుగులు, ఆలోచనలు మొత్తం ఏపీకే అనుకూలంగా మారి, తెలంగాణకు నష్టదాయకం అయ్యాయని తను కార్నర్ చేస్తుంటే, బీఆర్ఎస్ క్యాంపు నుంచి సరైన కౌంటర్ లేదు, సమర్థన లేదు…
2) ఏపీలో సక్సెస్ అయ్యాం, ఇక తెలంగాణలోనూ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి రంగప్రవేశం, అధికారం హస్తగతం అనే ప్రచారాల్ని చేస్తున్నది కదా టీడీపీ క్యాంపు… కాదు, ఈరోజుకూ తెలంగాణకు అసలైన శత్రువు చంద్రబాబే అనే భావనను తెలంగాణ సమాజంలోకి బలంగా వెళ్లిపోయేలా చేసింది ఈ బనకచర్ల వివాదం… చంద్రబాబు తెలంగాణ ద్రోహి అనే భావన ఎంత బలంగా ఉంటే తెలంగాణ కాంగ్రెస్కు అంత సేఫ్… కూటమి రాకను ఇలా పరోక్షంగా అడ్డుకోవడం, చంద్రబాబును మళ్లీ మళ్లీ తెలంగాణ సమాజం ఎదుట దోషిగా నిలబెట్టడం...
Ads
3) తెలంగాణలో ఎదుగుతున్న బీజేపీని ఇరుకునపెట్టేశాడు రేవంత్ రెడ్డి… మోడీ దగ్గర అనుమతులు తెచ్చుకున్నంతమాత్రాన బనకచర్ల కట్టలేవు చంద్రబాబూ అని అడగడం ద్వారా ఒకేసారి చంద్రబాబును, బీజేపీని నిలేశాడు… చంద్రబాబును వ్యతిరేకించలేక, తెలంగాణ ప్రయోజనాల విషయంలో బనకచర్లపై దూకుడుగా పోలేక బీజేపీ సతమతం అవుతోంది ఇప్పుడు...
నష్టనివారణకు కిషన్ రెడ్డి కేంద్ర జలవనరుల మంత్రిని కలిసి, ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగనివ్వను అనిపించడం ఈ తిప్పలే…
4) ఇన్నాళ్లు రేవంత్ రెడ్డి మీద ఓ బలమైన విమర్శ ఉండేది… తను చంద్రబాబు మనిషి, తెలంగాణలో పరోక్షంగా చంద్రబాబు ప్రభుత్వమే నడుస్తోంది అనే భావనను కేసీయార్ క్యాంపు బలంగా జనంలోకి రకరకాలుగా తీసుకెళ్లేది కదా… ఇప్పుడు చంద్రబాబూ, బనకచర్ల విషయంలో ఏ బాబైనా, ఎవరి బాబైనా మేం సహించం అనే అర్థమొచ్చేట్టుగా స్పష్టంగా నేరుగా చంద్రబాబుకు కౌంటర్ వదిలాడు రేవంత్ రెడ్డి, ఇది తనకే రాజకీయంగా మేలు...
5) నిన్నటి అఖిల పక్ష సమావేశంలో… ఒవైసీని పక్కన కూర్చోబెట్టుకుని, తెలంగాణ ముస్లింలు ఇక ఏమాత్రం కేసీయార్ పక్కన లేరు, అండగా ఉండరు, నమ్మరు అనే సంకేతాన్ని ఇచ్చాడు...
ఇదీ పొలిటికల్గా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మేలు… ఈ భేటీకి కేవలం ఎంపీలనే పిలిచారు… పార్టీ ప్రతినిధులు ఎవరైనా సరే అని ఉంటే, హరీష్ రావు పాల్గొని ఆ భేటీని రాజకీయంగా హైజాక్ చేసేవాడు…
6) బీఆర్ఎస్ తప్పులో కాలేసింది… ఎంపీల సమావేశంలో పాల్గొన్న వద్దిరాజు వాకౌట్ చేశాడు, అదేమైనా చట్టసభా, నిరసన ప్రకటించడానికి… వాదించాలి, సూచనలివ్వాలి, అభిప్రాయాలు చెప్పాలి... తెలంగాణ స్థూల ప్రయోజనాల కోణంలో మా స్టాండ్ ఇదీ అని వివరించాలి, అలా కనిపించాలి... అందులో బీఆర్ఎస్ ఫెయిల్ కావడమే కాదు
, రేవంత్ రెడ్డి బీజేపిని ఒక్క మాటా అనలేదు అనే మరో నిరర్థక విమర్శ చేసింది…
7) బయట హరీష్ రావు ఏవేవో చెబుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ పాత తప్పుల్ని సమర్థించుకునే విఫల ప్రయత్నం చేస్తున్నాడు గానీ… కీలకమైన ప్రశ్నలకు హరీష్ రావు దగ్గర జవాబుల్లేవు… బేసిన్లు లేవు, భేషజాల్లేవు అంటూ జగన్తో కలిసి గోదావరి జలాల్ని ఏపీకి తరలించే ప్రయత్నం చేశాడు కదా... దాని మీద కిక్కుమనడం లేదు ఎవరూ...
ఫుల్లు కార్నర్ అయిపోతున్నారు కదా, ఇదుగో ఫాఫం ఇలా కవరింగు…
8) నేరుగానే చంద్రబాబును అడిగాడు రేవంత్ రెడ్డి… మా 968 టీఎంసీల నికరజలాల వాటా వినియోగానికి సమ్మతించాకే బనకచర్ల కట్టుకో అన్నాడు… రాజకీయ పోరాటం ఫలించకపోతే న్యాయపోరాటం అనీ చెప్పాడు… ఏపీ, తెలంగాణ మధ్య దూరం పెంచకు గురూ అనేశాడు డైరెక్టో, ఇన్డైరెక్టో...
9) ఏ రాష్ట్రంలోనైనా ప్రాంతీయ ప్రయోజనాలు రాజకీయాల్ని బలంగా ప్రభావితం చేస్తాయి… ఇదీ అదే… పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు, రాయలసీమ లిఫ్టు తదితర చర్యలతో జగన్ తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వెళ్లిన తీరు... తనకు కేసీయార్ పెద్దన్నలాగా సహకరించిన తీరు కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది... ఎక్స్పోజ్ అవుతోంది...
అదే చేశాడు రేవంత్ రెడ్డి…
10) ఇక్కడి వరకూ వోకే… ఇకపై చేసే పోరాటాలే రేవంత్ రెడ్డికి కీలకం… బనకచర్లపై అన్ని పార్టీలనూ కౌంటర్ చేయడం, కార్నర్ చేయడం వరకూ వోకే... కానీ ఒక్కచోట వంగిపోయినా, లొంగిపోయినా తన రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదకరం...
అది తనకు అర్థమైనట్టుంది… అందుకే నిన్నటి అఖిల పక్ష సమావేశం ప్లస్ ప్రెస్ మీట్ చెప్పిందీ అదే…
ఇంకా చాలా ఉన్నాయి… చెప్పుకుందాం…. పరిణామాల్ని బట్టి, ఫలితాల్ని బట్టి…
Share this Article