.
Mohammed Rafee...
కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారాలు, ప్రసాద్ సూరికి యువ సాహిత్య పురస్కారం,
గంగిశెట్టి శివకుమార్ కు బాల సాహిత్య పురస్కారం…
రచయితలు డా.గంగిశెట్టి శివకుమార్, ప్రసాద్ సూరి తెలుగు విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమి బాల, యువ సాహిత్య పురస్కారాలకు ఎంపికయ్యారు. బాల సాహిత్యంలో తెలుగు విభాగంలో తొమ్మిది పుస్తకాలు తుది పోటీలో నిలువగా డా.గంగిశెట్టి శివకుమార్ రచన కబుర్ల దేవతను 2025వ సంవత్సరానికి ఎంపిక చేశారు.
Ads
ఆయన 2023లో రచించిన కబుర్ల దేవత కథల సంపుటికి ఈ అవార్డు లభించింది. కేంద్ర సాహిత్య అకాడమి యువ సాహిత్య పురస్కారానికి తెలుగు విభాగం నుంచి ఎనిమిది పుస్తకాలు పోటీ పడగా, సంచలన రచయిత, చిత్రకారుడు ప్రసాద్ సూరి రచన మై రావణ నవల ఎంపికైంది.
నెల్లూరు జిల్లా రావూరుకు చెందిన గంగిశెట్టి శివకుమార్ ప్రభుత్వ హైస్కూల్ లో ప్రధానోపాధ్యాయులుగా 2012లో ఉద్యోగ విరమణ పొందారు. కబుర్ల దేవత పుస్తకంతో పాటు ఎవరు గొప్ప, తాను తీసుకున్న గొయ్యి, భేతాళ కథలు, ఇదీ నెల్లూరు తదితర పుస్తకాలు ప్రచురించారు. ఆయన రచించిన కష్టనష్టాలు, అసూయ, మాటల్లో తేడా కథలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాఠాలుగా మారాయి.
ఆంధ్రప్రదేశ్ బాల సాహిత్య అకాడమితో పాటు పలు సాహిత్య సంస్థల పురస్కారాలు పొందారు. బాల సాహితీ రత్న, బాల కథారత్న, బాలమిత్ర అవార్డులు వరించాయి. అమెరికాలోని పిల్లల కోసం మూన్ బీమ్ పుస్తకం ప్రచురించారు. 2005లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో గౌరవించింది. పున్నమి పత్రిక గౌరవ సంపాదకులుగా పని చేస్తున్నారు. వివిధ దిన పత్రికల ఆదివారం అనుబంధాల్లో బాలల కథలు రాస్తున్న శివకుమార్ కు అభినందనలు.
ఇక సృజనాత్మకత రచయిత ప్రసాద్ సూరి రచన మై రావణ వదలకుండా చదవగల స్టఫ్ వున్న నవల. ఈ నవల కేంద్ర సాహిత్య అకాడమి యువ సాహిత్య పురస్కారం గెలుచుకుంది. యలమంచలి రాంబెల్లి బెస్త ప్రాంతానికి చెందిన ఈయన గుజరాత్ బరోడాలో ఆర్కియాలజీ సబ్జెక్ట్ లో పిజి చేస్తున్నారు.
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ JNTU ఫైనార్ట్స్ కాలేజీ లో బిఎఫ్ఎ చేశాడు. ఆర్టిస్ట్ మోహన్ దగ్గర ఉండి తను కూడా చిత్రకారుడయ్యారు! జానపద వీరుడు లాంటి బెస్త మైరావణుడు ప్రధాన పాత్రగా భారతదేశ గత 80 ఏళ్ల సామాజిక చరిత్రకు వర్తమాన రాజకీయ అంశాలను చేర్చి బలమైన తర్కంతో రాసిన నవల ఇది. సముద్ర తీర ప్రాంతంలో వుండే బెస్తకారుల జీవితాల సినిమా కథ చదువుతున్నట్లే ఉంటుంది. ఇతని వయసు జస్ట్ 26
. మై నేమ్ ఈజ్ చిరంజీవి, మై రావణ నవలలు రాశారు.
కేంద్ర సాహిత్య అకాడమి యువ పురస్కారాలను ఈసారి 23 భాషల రచయితలకు ప్రకటించింది. తెలుగు విభాగం నుంచి యువ సాహిత్య పురస్కారానికి తుది పరిశీలనకు ఎంపికైన రచయితల్లో ప్రసాద్ సూరి (దళపతి సూరి) మైరావణతో పాటు సురేంద్ర దేవ్ చెల్లి (నడిచే దారిలో), సురేంద్ర శీలం (పార్వేట), వి.మల్లికార్జున్ (నల్గొండ కథలు), కె.వి.మేఘనాథ్ రెడ్డి (కలుంకూరి గుట్ట), నర్రా ప్రవీణ్ రెడ్డి (పొత్తి), చరణ్ పరిమి (బొంబాయి పొట్టేలు), శ్రీ వశిష్ట సోమేపల్లి (ఆకురాలిన చప్పుడు) ఉన్నారు.
అలాగే బాల సాహిత్యంలో తుది పరిశీలన పోటీలో గంగిశెట్టి శివకుమార్ తోపాటు సమ్మెట విజయ (బడే నాలోకం), ఎం.హరికిషన్ (చందమామ చెప్పిన కథలు, తెలుగు వారి జానపద కథలు), మాచిరాజు కామేశ్వరరావు (దేవ సేవ), నీరజ అమరవాది (ఏడు రంగుల జెండా), గరిపెల్లి అశోక్ (మా బడి కథలు, ఎనకటి కథలు, సరికొత్త ఆవు పులి కథలు) ఉన్నారు….. - డా.మహ్మద్ రఫీ
Share this Article