.
‘‘నమ్మలేని కథ ఇది… గత కొన్ని సంవత్సరాలుగా మొసాద్ అండర్కవర్ ఏజెంట్లు ఇరాన్లో డాక్టర్లు, డెంటిస్టులుగా పనిచేస్తూ లోపలికి చొరబడ్డారని కథనాలు చెబుతున్నాయి… డెంటిస్టులు ముఖ్యంగా ఇరాన్ సైనిక, ప్రభుత్వ ఎలైట్ వ్యక్తులకు ప్రాధాన్యం ఇచ్చేవారట… సాధారణ దంత పరీక్షల సమయంలో క్యావిటీల ఫిల్లింగ్స్లో ట్రాకింగ్ డివైసులు అమర్చారట…
అదే విధంగా గ్యాస్ట్రో డాక్టర్లు కూడా తమ ఎలైట్ పేషెంట్లలో ఇలాంటి డివైసులు ఇంప్లాంట్ చేశారని అంటున్నారు… దీంతో నిన్న, వాళ్లు ఎక్కడ ఉన్నారో నిమిషం నిమిషానికి తెలుసుకుని, ఇజ్రాయెల్ మిసైల్ దాడులు చేసినట్టు సమాచారం… ఆ మొదటి క్షణాల్లోనే 400కి పైగా ఇరాన్ ఎలైట్ సైనికులు, ప్రభుత్వ పెద్దలు హతమయ్యారని వార్తలు వస్తున్నాయి…
Ads
ఇది వాళ్లు ఎక్కడ దాక్కున్నారో ఖచ్చితంగా ఎలా తెలిసిందన్న దానికి ఒక కారణం కావచ్చని విశ్లేషకులు అంటున్నారు… కథ నిజమైతే — ఇది యుద్ధ చరిత్రలోనే అత్యంత షాకింగ్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ అవుతుంది…’’
………… పైన చెప్పిన కంటెంటు సోషల్ మీడియాలో బాగా కనిపిస్తోంది… నిజంగానే ఖమేనీ, ఆయన కుటుంబం ఉన్న భవనాన్నే ఖచ్చితంగా టార్గెట్ చేసి కొట్టిన తీరు విస్మయం కలిగిస్తోంది… అంత పర్ఫెక్ట్, యాక్యురేట్ సమాచారం ఇజ్రాయిల్, అమెరికాలకు ఎలా తెలిసిందనేది ఆశ్చర్యమే… అయితే దంతాల్లో లేదా కడుపులో అమర్చేంత చిన్న ట్రాకింగ్ డివైసులు, శరీరంలోని ద్రవాలు, కణజాలం మధ్య నిరంతరం సిగ్నల్స్ పంపడం సాంకేతికంగా చాలా క్లిష్టమైన విషయం… వీటికి బ్యాటరీ బ్యాకప్, శాటిలైట్ కనెక్టివిటీ ఉండటం ప్రస్తుత టెక్నాలజీతో కొంత కష్టతరమే… అందుకే పైన కథ సందేహాస్పదం…
-
పేజర్ దాడుల ప్రభావం..: కొన్ని వారాల క్రితం లెబనాన్లో హిజ్బుల్లా సభ్యుల పేజర్లు, వాకీటాకీలు పేలిపోయిన ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది… ఆ ఘటన నిజంగానే మొసాద్ పనే అని తేలింది… బహుశా ఆ ఘటన స్ఫూర్తితోనే, ఇప్పుడు ఈ “డెంటిస్ట్ కథ” పుట్టి ఉండవచ్చు…
ఇరాన్ మీద దాడులకు ఇజ్రాయిల్, అమెరికా చెప్పే సాకులు అది అణుబాంబుల్ని తయారు చేస్తుందనే కదా… ఇవే అణుపరీక్షలకు సంబంధించి ఇజ్రాయిల్ నిర్వహించిన మూడు దాడుల్ని ఓసారి వివరంగా చెప్పుకోవచ్చు… మొసాద్ ఆపరేషన్లు ఎలా ఉంటాయో తెలిసిందే కదా…
1. డిజిటల్ బాంబు ‘స్టక్స్నెట్’: ఇరాన్ అణు కలను ఛిన్నాభిన్నం చేసిన అదృశ్య సైన్యం
తేదీ…: సెప్టెంబర్, 2010 (వార్త వెలుగులోకి వచ్చిన సమయం) వేదిక..: నతాంజ్ (Natanz), ఇరాన్.
ప్రపంచం ఎన్నడూ చూడని ఒక వింత యుద్ధానికి ఇరాన్ అణు కేంద్రం వేదికైంది… ఎటువంటి శబ్దం లేదు, విమానాల మోత లేదు, కనీసం ఒక్క సైనికుడు కూడా సరిహద్దు దాటలేదు… కానీ, ఇరాన్ గర్వంగా చెప్పుకునే వేల సంఖ్యలోని యురేనియం సెంట్రిఫ్యూజ్లు (Centrifuges) ఒక్కొక్కటిగా పేలిపోతున్నాయి… ఏం జరుగుతుందో అక్కడ పనిచేసే శాస్త్రవేత్తలకు కూడా అర్థం కాలేదు…
ఏమిటీ స్టక్స్నెట్? స్టక్స్నెట్ అనేది సాధారణ కంప్యూటర్ వైరస్ కాదు… ఇది ఒక ‘డిజిటల్ మిసైల్’… అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థలు (CIA & Mossad) కలిసి రహస్యంగా అభివృద్ధి చేసిన ఈ సైబర్ ఆయుధానికి ‘ఆపరేషన్ ఒలింపిక్ గేమ్స్’ అని పేరు పెట్టారు… దీని లక్ష్యం ఒక్కటే: ఇరాన్ అణు బాంబు తయారీని అడ్డుకోవడం…
ఆపరేషన్ ఎలా జరిగింది? (The Silent Strike) ఇరాన్ అణు కేంద్రం (Natanz) ఇంటర్నెట్కు కనెక్ట్ అయి ఉండదు (Air-gapped)… మరి వైరస్ లోపలికి ఎలా వెళ్ళింది..? ఒక ఇరాన్ ఉద్యోగి తెలియక వాడిన USB డ్రైవ్ (Pen Drive) ద్వారా ఈ వైరస్ లోపల ఉన్న కంప్యూటర్లలోకి చేరింది…
లోపలికి వెళ్ళిన తర్వాత ఈ వైరస్ వెంటనే దాడి చేయలేదు… కొన్ని నెలల పాటు సిస్టమ్లను గమనించింది… అక్కడ ఉన్న ‘PLC’ (Programmable Logic Controllers) అనే పరికరాలను తన ఆధీనంలోకి తీసుకుంది… ఇవి సెంట్రిఫ్యూజ్ల వేగాన్ని నియంత్రిస్తాయి…
స్టక్స్నెట్ ఒక్కసారిగా సెంట్రిఫ్యూజ్ల వేగాన్ని అత్యధిక స్థాయికి పెంచి, మళ్ళీ తగ్గించేది… దీనివల్ల ఆ యంత్రాలు విపరీతమైన ఒత్తిడికి లోనై ముక్కలయ్యేవి… యంత్రాలు నాశనమవుతున్నా, కంట్రోల్ రూమ్లో ఉన్న శాస్త్రవేత్తల కంప్యూటర్ స్క్రీన్లపై మాత్రం “అంతా బాగుంది” (Normal Operation) అని చూపిస్తూ వైరస్ వారిని తప్పుదోవ పట్టించింది… వాళ్ళు ఏదో జరిగిందని గుర్తించే లోపే వెయ్యికి పైగా యంత్రాలు పనికిరాకుండా పోయాయి…
-
మొదటి సైబర్ వెపన్…: సాఫ్ట్వేర్ ద్వారా భౌతికంగా యంత్రాలను (Physical Infrastructure) నాశనం చేయవచ్చని ప్రపంచానికి మొదటిసారి తెలిసింది…
-
కచ్చితత్వం..: ఈ వైరస్ కేవలం నతాంజ్ ప్లాంట్లోని ప్రత్యేకమైన సిమెన్స్ (Siemens) సాఫ్ట్వేర్ను మాత్రమే టార్గెట్ చేసింది… ఇతర కంప్యూటర్లకు సోకినా అది ఏమీ చేయదు…
-
ప్రభావం…: ఈ దాడి వల్ల ఇరాన్ అణు కార్యక్రమం కనీసం రెండేళ్లు వెనక్కి వెళ్ళింది…
భౌతిక యుద్ధం కంటే సైబర్ యుద్ధం ఎంత శక్తివంతమైనదో ఇది నిరూపించింది… అందుకే పైన చెప్పుకున్న ‘దంతాల్లో ట్రాకర్లు’ వంటి వార్తలు వచ్చినప్పుడు, ప్రజలు స్టక్స్నెట్ వంటి గతాన్ని గుర్తు చేసుకుని “మొసాద్ ఇది కూడా చేసే ఉంటుంది” అని సులభంగా నమ్ముతుంటారు… (మరో రెండు ఆపరేషన్లు తరువాయి కథనంలో)...
Share this Article