.
రాఘవ్ చద్దా..? ఎవరు ఈయన..? వృత్తి రీత్యా చార్టర్డ్ అకౌంటెంట్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్నాడు… పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ పోస్టు నుంచి తనను కేజ్రీవాల్ పక్కకు తప్పించేశాడు… ‘గాయపడ్డాను, మరింత రాటుదేలతాను’ అని దురంధర్ హంజా టైపు డైలాగ్ విసిరి, ఇక ఆప్ అధినేతపై తిరుగుబాటు ప్రకటించేసినట్టే తను…
ఎందుకు కేజ్రీవాల్కు తనపై కోపం..? కేజ్రీవాల్ అండ్ కో చాలా కారణాలు చెబుతోంది, రాఘవ్ చద్దాను బీజేపీ ఏజెంటుగా అభివర్ణిస్తోంది… రకరకాల కారణాలు ఏకరువు పెడుతోంది… యాంటీ-బీజేపీ ప్రచారం అనగానే మిగతా యాంటీ-బీజేపీ సెక్షన్లు కూడా ఈ ప్రచారాన్ని మరింత జోరుగా అందుకున్నాయి… వాళ్ల మాటల్లో…
Ads
‘‘ఆర్ఎస్ఎస్ స్పాన్సర్ చేసిన అన్నా హజారే ఉద్యమం ముసుగులో రాఘవ్ చద్దా రాజకీయాల్లో దూరి, కేజ్రీవాల్కు సన్నిహితుడయ్యాడు… కానీ అదంతా ఓ కుట్ర… ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటపడి ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలంతా జైలుకు వెళ్తున్న తరుణంలో, ఈ చద్దా తన అసలు నైజాన్ని బయటపెట్టుకున్నాడు… కంటి ఆపరేషన్ అని ఒక ఫేక్ సాకు చెప్పి లండన్ పారిపోయి, అక్కడ బీజేపీ పెద్దలతో రహస్య ఒప్పందాలు చేసుకున్నాడు…
తన తోటి నేతలు జైల్లో మగ్గుతుంటే, పార్టీ తరుపున పోరాడకుండా, తన మీద ఈడీ (ED) కేసులు రాకుండా ఉండటానికి బీజేపీకి అమ్ముడుపోయిన ఒక పొలిటికల్ ఏజెంట్లా మారిపోయాడు… పార్లమెంటులో విపక్ష ఎంపీలందరినీ వరుసపెట్టి సస్పెండ్ చేసినప్పుడు, ఈ చద్దాను మాత్రం బీజేపీ ఎందుకు వదిలేసింది..?
పార్లమెంటులో తను లేవనెత్తే ప్రతి అంశం పక్కా ఫేక్… తను లేవనెత్తని, మాట్లాడటానికి భయపడే అసలైన అంశాలు ఇంధన ధరలు & ఎల్పిజి, గ్యాస్ సిలిండర్ ధరలు… అవి మాట్లాడడు… ఐటీ రూల్స్ & సోషల్ మీడియా అకౌంట్లు అక్రమంగా బ్లాక్ చేస్తున్నా, ఎఫ్ఐఆర్ (FIR)లు వేస్తున్నా తను సైలెంట్…
రూపాయి పతనం & స్టాక్ మార్కెట్, దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమవుతుంటే “సమోసా సైజు, పెటర్నిటీ లీవ్” లాంటి చిల్లర విషయాల మీద టైమ్ పాస్ చేస్తాడు… ఇవన్నీ ఆలోచించాకే కేజ్రీవాల్ తనను పక్కనపెట్టాడు’’ …. ఇదీ యాంటీ-బీజేపీ సోషల్ మీడియా అందుకున్న ప్రచారం…
అంతేకాదు, త్వరలో రాఘవ్ చద్దా ఇక బీజేపీలో చేరతాడనీ అంటున్నారు… ఈ వాదనలో ఆప్యేతర ప్రతిపక్షాలు లేవనెత్తిన ఒకటీరెండు అంశాలు నిజానికే కేజ్రీకే వ్యతిరేకం… 1. అన్నా హజారే ఉద్యమం ఆర్ఎస్ఎస్ స్పాన్సర్డ్ అట… అంటే అన్నాహజారేతో క్లోజ్గా ఉద్యమంలో ఉన్న కేజ్రీవాల్ కూడా ఆర్ఎస్ఎస్ మనిషేనా..? 2. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అట… అంటే స్కామ్ అనే మాట స్వీయాంగీకారమా..?
నిజం ఏమిటంటే..? కేజ్రీవాల్కే ఎవరితోనూ శృతి కుదరదు, ఎవరైనా తనను మించి ప్రచారం పొందుతుంటే సహించడు… అంతెందుకు, సాక్షాత్తూ తన గురువునే వదిలేసి వచ్చి పార్టీ పెట్టాడు కదా… అన్నా హజారే స్వయంగా కేజ్రీవాల్ పోకడలపై నిందాస్త్రాలు సంధించాడు అనేకసార్లు… అన్నా హజారే ప్రత్యక్ష రాజకీయాలకు దూరం ఎప్పుడూ…
కానీ కేజ్రీవాల్ “వ్యవస్థను మార్చాలంటే వ్యవస్థలోకి వెళ్లాలి” అనే సాకుతో ఓ రాజకీయ పార్టీని (AAP) స్వయంగా స్థాపించాడు… పార్టీ పునాదుల్లో ఉన్నవాళ్లు సైతం తనను వీడి వెళ్లిపోయారు… కొన్ని ఉదాహరణలు…
1. వ్యవస్థాపక సభ్యులు (Founding Members):
-
ప్రశాంత్ భూషణ్…: సుప్రీంకోర్టు సీనియర్ లాయర్…. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని విమర్శించడంతో 2015లో బయటికి పంపబడ్డాడు…
-
యోగేంద్ర యాదవ్…: ప్రముఖ రాజకీయ విశ్లేషకులు… కేజ్రీవాల్ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకించినందుకు ప్రశాంత్ భూషణ్తో పాటు ఈయన్ని కూడా పార్టీ నుండి తొలగించారు…
-
శాంతి భూషణ్…: మాజీ కేంద్ర మంత్రి… పార్టీ సిద్ధాంతాల నుండి తప్పుకుందని విమర్శించాడు…
-
కుమార్ విశ్వాస్…: ప్రముఖ కవి, వక్త… రాజ్యసభ సీటు విషయంలో గొడవలు, పార్టీపై ఆయన చేసిన విమర్శల వల్ల చివరకు దూరమయ్యాడు…
2. కీలక నేతలు & మంత్రులు:
-
కైలాష్ గెహ్లాట్…: ఇటీవల (2024 నవంబర్) మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాడు… యమునా నది ప్రక్షాళన, “షీష్ మహల్” వివాదాలను ఈయన ప్రస్తావించాడు…
-
అశుతోష్..: మాజీ జర్నలిస్ట్… వ్యక్తిగత కారణాలు అని చెప్పేసి 2018లో పార్టీకి దూరమయ్యాడు…
-
కపిల్ మిశ్రా…: ఢిల్లీ మాజీ మంత్రి… కేజ్రీవాల్పై అవినీతి ఆరోపణలు చేసి బయటకు వచ్చాడు… ప్రస్తుతం బీజేపీలో ఉన్నాడు…
-
షాజియా ఇల్మీ…: పార్టీ ప్రారంభంలో కీలక పాత్ర పోషించి, తర్వాత బీజేపీలో చేరిక…
-
అంజలి దమానియా…: మహారాష్ట్రలో పార్టీని నడిపించిన నేత… అవినీతి ఆరోపణల నేపథ్యంలో పార్టీకి రాజీనామా…
డిల్లీ ఎమ్మెల్యేల రాజీనామా…: 2025 ఢిల్లీ ఎన్నికలకు ముందు దాదాపు 7- 8 మంది ఎమ్మెల్యేలు (నరేష్ యాదవ్, రాజేష్ రిషి, భావనా గౌడ్ వంటి వారు) పార్టీ టికెట్లు నిరాకరించడం వల్ల లేదా అసంతృప్తితో రాజీనామా చేశారు…
కరప్షన్ వ్యతిరేక సిద్ధాంతంతో ఎదిగి, చివరకు లిక్కర్ కరప్షన్ వంటి ఆరోపణలతో జైలు పాలు కావడం కేజ్రీవాల్ నైతిక పతనం...
Share this Article