.
Subramanyam Dogiparthi …. నోటి తుత్తర ఎంత ప్రమాదకరమో చెప్పే సినిమా ఈ మధురా నగరిలో . ఓ పాతికేళ్ల కింద ఇలాంటి కధే నిజంగా జరిగింది . గుంటూరుకు దగ్గరలో ఉన్న ఓ పట్టణానికి సంబంధించిన అమ్మాయి గుంటూరులో ఒక కాలేజీలో చదువుకుంది . చదువు అయిపోయాక స్వంత ఊర్లో హత్య చేయబడింది . హత్య చేయకపోయినా ఒక కుర్రాడిని పోలీసులు అరెస్ట్ చేసారు . ఆ కుర్రాడి కుటుంబ సభ్యులు ఆ అమ్మాయికి సంబంధించిన వివరాలను కూపీ లాగుతున్నారు .
ఆ అమ్మాయి క్లాస్ మేట్ ఒకడు తన ఫ్రెండ్సుతో ఆ అమ్మాయి తనకు బాగా తెలుసని మెహర్బానీ కోసం చెప్పుకున్నాడు . ఆ ఫ్రెండ్సులో ఒకరు అరెస్ట్ కాబడ్డ కుర్రాడి కుటుంబ సభ్యులకు ఆ విషయాన్ని చేరవేసాడు . కుటుంబ సభ్యులు ఈ నోటి తుత్తర గారిని కిడ్నాప్ చేసి, ఓ మూడు నాలుగు రోజులు బంధించి, అన్ని వివరాలను చెప్పమని హడావుడి చేసారు . ఈ తుత్తర గారికి ఏమీ తెలియదు .
Ads
కిడ్నాపర్లు కూడా ఈ తుత్తర గారికి ఏం తెలియదని నమ్మకానికి వచ్చాక వదిలేసారు . తుత్తర గారు చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా బతుకుజీవుడా అంటూ బయటపడి గుంటూరుకు చేరుకున్నాడు .
ఈ మధురా నగరిలో సినిమా చూసినప్పుడల్లా నాకు నిజ జీవితంలో జరిగిన ఆ ఉదంతమే గుర్తుకు వస్తూ ఉంటుంది . సందేశం ఏమిటంటే మెహర్బానీల కోసం అన్నీ తెలుసు అని కానీ , వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని name dropping కాని చేయకూడదు . చేస్తే టైం బాగుండకపోతే తాడే పాము అయి కాటేస్తుంది .
ముఖ్యంగా మనలాంటి పెద్దవారు మన కుటుంబాలలో ఉండే పిల్లలకు ఇవన్నీ చెప్పాలి . నాన్నా పులి కధ లాంటిదే ఈ కధ కూడా .
ఇంక సినిమాకొస్తే భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ గోపాలరెడ్డి గారు “మ” మీద సెంటిమెంటుతో మళయాళంలో హిట్టయిన ఇన్ హరిహరనగర్ సినిమాను మధురా నగరిలో టైటిలుతో కోడి రామకృష్ణ దర్శకత్వంలో రీమేక్ చేసారు .

తన అన్న శరత్ బాబు కనిపించటం లేదని చెల్లెలు నిరోషా విశాఖపట్టణానికి వస్తుంది . ఆవారాగా తిరిగే నలుగురు కుర్రాళ్లు లైనేయటం మొదలు పెడతారు . నోటి తుత్తరతో ఆ కేసులో ఇరుక్కోవటం , విలన్లు ఎత్తుకుపోవటం , చావు తప్పి కన్ను లొట్టపోయి బయటపడటం , నిరోషా వాస్తవాలను కూపీ తీయటం , క్లైమాక్సులో నిరోషాని , ఆమె కుటుంబ సభ్యులను విలన్ల నుండి కాపాడటం , తన అన్న చంపివేయబడ్డాడని తెలిసిన నిరోషా బొంబాయికి తిరిగి వెళ్ళిపోవటం , వెళ్ళిపోతూ డబ్బులు నగలు ఉన్న బేగుని నలుగురు యువకులకు ఇచ్చి వెళ్ళిపోవటంతో సినిమా ముగుస్తుంది .
నలుగురు కుర్రాళ్ళుగా శ్రీకాంత్ , రవిశంకర్ , రియాజుద్దీన్ , చిన్నా నటించారు . ఇతర ప్రధాన పాత్రల్లో సురేష్ , శరత్ బాబు , శుభ , వై విజయ , బాబూమోహన్ , సంధ్యారాణి , అనిత , బాలాజీ తదితరులు నటించారు . యస్ బాలకృష్ణ సంగీత దర్శకత్వంలో వెన్నెలకంటి వ్రాసిన పాటలు థియేటర్లో బాగానే ఉంటాయి . గణేష్ పాత్రో డైలాగులను వ్రాసారు .
1991 జూన్లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకర్షించింది . యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూసి ఉండకపోతే వాచ్ లిస్టులో పెట్టుకోవచ్చు . It’s a crime , suspense thriller …
Share this Article