.
అంతరిక్షంలోకి, ఆ అనంత విశ్వంలోకి వెళ్లడం ఏముంది..? ఎవడైనా పోగలడు… కానీ తిరిగి వచ్చేవాడే తోపు అన్నాడో మిత్రుడు… నిజం… చందమామ మీదకు వెళ్లి, పైపైన తిరిగి, ఈసారి పక్కాగా మీ నేల మీద దిగుతాం, నీతో దోస్తీ చేస్తాం అన్నట్టుగా ఆర్టిమిస్-2 ప్రాజెక్టుతో నాసా వ్యోమగాములు వెళ్లారు కదా… తిరిగి వస్తున్నారు… అసలు అదే పెద్ద టాస్క్…
గతంలో వెళ్లొచ్చారు కదాని అడక్కండి… అది ఓ బోగస్ యాత్ర… కానీ ప్రస్తుత యాత్ర నిజం… సాహసం… అదీ అసలైన ఖగోళ ప్రయోగం… నిజానికి అంతరిక్షం నుంచి భూమికి రావడం అంటే… అది కేవలం ప్రయాణం కాదు, ప్రాణాలతో చేసే పోరాటం…
Ads
ఏప్రిల్ 1న నింగిలోకి ఎగిసిన ఆర్టిమిస్-2 విజయవంతంగా చంద్రుడిని చుట్టి వచ్చేసింది… ఇప్పుడు అసలైన సవాలు మొదలైంది… ఏప్రిల్ 11 తెల్లవారుజామున ఆ నలుగురు యోధులు పసిఫిక్ మహాసముద్రంలో దిగే వరకు ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూడాల్సిందే… ఎందుకంటే.. ఆకాశం నుంచి కిందకు పడే ప్రతి అడుగులోనూ ఒక ‘యుద్ధం’ దాగుంది…
క్యాప్సూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు గంటకు 40,000 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది… అంత వేగంగా గాలిని చీల్చుకుంటూ వస్తున్నప్పుడు పుట్టే రాపిడి వల్ల క్యాప్సూల్ బయట ఉష్ణోగ్రత దాదాపు 2800°C కు చేరుకుంటుంది… అంటే సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రతలో సగం అన్నమాట..!
ఆ సమయంలో క్యాప్సూల్ చుట్టూ అయోనైజ్డ్ ప్లాస్మా పొర ఏర్పడుతుంది… ఇది రేడియో సిగ్నల్స్ను అడ్డుకుంటుంది… సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు నాసా కంట్రోల్ రూమ్కు, వ్యోమగాములకు మధ్య సంబంధాలు తెగిపోతాయి… ఆ పది నిమిషాలు వాళ్లు ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా ఎవరికీ తెలియదు… అందుకే దీన్ని శాస్త్రవేత్తలు “మినిట్స్ ఆఫ్ టెర్రర్” అని పిలుస్తారు…
గుండెను పిండేసే ‘జీ-ఫోర్స్’… శూన్యంలో తేలియాడే (Microgravity) స్థితి నుంచి ఒక్కసారిగా భూమి లాగే శక్తి (Gravity) పెరగడం వ్యోమగాములకు నరకప్రాయం… 70 కేజీల మనిషి తన మీద మరో నలుగురు కూర్చున్నంత బరువును (7g వరకు) అనుభవిస్తాడు… ఛాతీ మీద కొండను పెట్టినట్లు ఉంటుంది… ఊపిరి తీసుకోవడం ఒక సవాలు, కనురెప్ప ఎత్తడం ఒక యుద్ధం…
సముద్రపు ఒడిలో ‘స్ప్లాష్ డౌన్’ … భూమి మీద దిగితే క్యాప్సూల్ ముక్కలయ్యే ప్రమాదం ఉంది కాబట్టే, శాన్ డియాగో తీరంలోని పసిఫిక్ సముద్రాన్ని నాసా వేదికగా ఎంచుకుంది…
-
24 వేల అడుగులు…: వేగం తగ్గించడానికి చిన్న పారచూట్లు తెరుచుకుంటాయి…
-
మెయిన్ పారచూట్లు…: చివరగా మూడు భారీ నారింజ- తెలుపు రంగు పారచూట్లు విచ్చుకుని, ఆ భారీ క్యాప్సూల్ను ఒక పక్షి ఈకలా మెల్లగా నీటి మీదకు చేరుస్తాయి…
దిగిన తర్వాతే అసలు పరీక్ష! …. సముద్రంలో పడగానే పని అయిపోలేదు… 10 రోజుల పాటు భారరహిత స్థితిలో ఉన్న వ్యోమగాముల శరీరాలు భూమి గురుత్వాకర్షణకు ఒక్కసారిగా షాక్ అవుతాయి… రక్తం కాళ్లలోకి చేరిపోతుంది, మెదడుకు రక్తప్రసరణ తగ్గి కళ్లు తిరుగుతాయి… నిలబడటం కాదు కదా, కనీసం తల తిప్పడం కూడా కష్టమవుతుంది… అందుకే రికవరీ టీమ్ అత్యంత జాగ్రత్తగా వారిని బయటకు తీసి, మెడికల్ వెహికల్స్లోకి మారుస్తుంది…
చంద్రుడి మీద మనిషి నివాసం కోసం వెళ్ళిన ఈ నలుగురు యోధులు… అగ్నిగోళాన్ని దాటి, గాలి ఒత్తిడిని తట్టుకుని, మృత్యువు ముఖద్వారం నుంచి క్షేమంగా భూమి మీదకు అడుగుపెట్టే ఆ క్షణం కోసమే ఇప్పుడు ప్రపంచమంతా ఎదురుచూస్తోంది…. నిజంగానే ఇది మానవ మేధస్సు సాధించిన మరో అద్భుతం….
Share this Article