.
కొన్ని వార్తలు కనిపించాయి… మహేశ్ బాబు, ప్రియాంక చోప్రాలతో రాజమౌళి తీస్తున్న ‘వారణాసి’ పిక్చర్ షూటింగు ఆగిపోయిందని..! అండర్ వాటర్ షూటింగు కోసం 150 ట్యాంకర్ల నీటిని సరఫరా చేయాలని నిర్మాతలు హైదరాబాద్ జలమండలిని అడిగితే, బోర్డు తిరస్కరించిందనీ, సో, నీటి ఎద్దడితో సినిమాకు షాక్, షూటింగ్కు బ్రేక్ అన్నట్టుగా ఆ వార్తల సారాంశం… ముందుగా ఆ వార్తలు చదువుదాం…
‘‘‘ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా షూటింగ్ కోసం 150 నీటి ట్యాంకర్లను సరఫరా చేయాలన్న విన్నపాన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) తిరస్కరించింది…
Ads
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నగరం శివార్లలో వేసిన ప్రత్యేక సెట్లో జరుగుతోంది… ‘వారణాసి’ చిత్రాన్ని నిర్మిస్తున్న శ్రీ దుర్గా ఆర్ట్స్ ప్రతినిధులు ఇటీవల జలమండలిని సంప్రదించారు… ఒక్కోటి 10,000 లీటర్ల సామర్థ్యం కలిగిన 150 ట్యాంకర్ల నీటిని సరఫరా చేయాలని వారు కోరారు…
రాజేంద్రనగర్ పరిధిలోని గగన్పహాడ్లో ఉన్న హైదరాబాద్ ఫిలిం సిటీ స్టూడియోలో అండర్ వాటర్ (నీటి అడుగున) సన్నివేశాలను చిత్రీకరించడానికి ఈ భారీ మొత్తంలో నీరు అవసరమని వారు పేర్కొన్నారు… జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ (MD) కె. అశోక్ రెడ్డికి రాసిన ఈ లేఖలో… సప్లై పాయింట్ నుండి షూటింగ్ లొకేషన్ వరకు అయ్యే ట్యాంకర్ ఛార్జీలను చెల్లించడానికి తాము సిద్ధంగా ఉన్నామని నిర్మాణ సంస్థ తెలిపింది…
మే 18న జరగబోయే షూటింగ్ కోసం స్టూడియోలో ఒక నీటి కొలనును నిర్మించామని, ఆ సన్నివేశాల కోసం శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని వారు కోరారు… ప్రస్తుతం నగరంలో ఎండలు మండిపోతున్నాయి… నగరవ్యాప్తంగా నీటి వినియోగం పెరగడంతో పాటు ట్యాంకర్ల కోసం విపరీతమైన డిమాండ్ ఉంది… ఈ నేపథ్యంలో, సాధారణ ప్రజల అవసరాలను పక్కన పెట్టి సినిమా షూటింగ్ కోసం భారీగా నీటిని సరఫరా చేయడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు…’’
….. ఇవీ వార్తలు… రోజూ వేల ట్యాంకర్ల నీటిని సప్లయ్ చేయగల జలమండలికి 150 ట్యాంకర్ల నీరు అనేది చాలా చిన్న విషయం, కానీ ఇక్కడ ఎండీ అశోక్రెడ్డి తీసుకున్న నిర్ణయం, విచక్షణ అభినందనీయం… ఎందుకంటే… ఒకవేళ నిజంగానే ఆ నీరు సప్లయ్ చేసి ఉంటే మండలి మీద విమర్శల దుమారం రేగేది… ఒకవైపు నగరంలో నీటి ఎద్దడి ఉంది… భూగర్భజలాలు మరింత పడిపోయాయి…
అనేకచోట్ల రోజువిడిచిరోజు నీళ్లు ఇవ్వడం కూడా గగనమే అవుతోంది… ఈ స్థితిలో మండలి ప్రయారిటీ ఖచ్చితంగా గృహావసరాలే… పైగా మండలి నీటి సరఫరాకు కొన్ని లెక్కలుంటాయి, పద్ధతి ఉంటుంది… ఈ ఎద్దడి స్థితిలో ఓ సినిమా షూటింగు వాణిజ్యావసరాలకు నీళ్లు ఇస్తే ప్రభుత్వం బాగా విమర్శల పాలయ్యేది… దాన్నుంచి అశోక్రెడ్డి తప్పించుకున్నాడు, ప్రభుత్వాన్ని తప్పించాడు… అయితే..?
ఆశ్చర్యం కలిగించింది ఏమిటంటే..? 1300 నుంచి 1500 కోట్ల బడ్జెట్ ఈ సినిమా… అవసరమైతే ఆ కొలనును మినరల్ వాటర్తో నింపగలడు రాజమౌళి… (సరే, ఆ లెక్కల్లో మతలబులేమిటో ఇక్కడ అప్రస్తుతం)… అది పాన్ వరల్డ్ మూవీ… ప్రైవేటు ట్యాంకర్లను అడిగినా జస్ట్ 2 లక్షల రూపాయల్లో సప్లయ్ చేసేవాళ్లు… ఐనాసరే, జలమండలినే ఎందుకు అడిగినట్టు..? మండలి సప్లయ్ చేసే నీళ్లు శుద్ధి చేసి ఉంటాయి కాబట్టి… తమ అవసరాలకు సిస్టమ్ను వాడేసుకోవాలని రాజమౌళి అనుకున్నాడు కాబట్టి..!!
Share this Article