.
Ashok Kumar Vemulapalli …. ఇదేం రాజకీయం?
విజయవాడలో సాయికృష్ణ మిస్సింగ్ కేసు చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలు ఏ ఒక్క రాజకీయ పార్టీని లక్ష్యంగా చేసుకుని అడుగుతున్నవి కావు. ఎవరికైనా నచ్చకపోవచ్చు. కొందరికి అసౌకర్యంగా అనిపించవచ్చు. కానీ సమాజం భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రతి పౌరుడు అడగాల్సిన ప్రశ్నలు ఇవి.
ఒక వ్యక్తి కనిపించకుండా పోవడం చాలా తీవ్రమైన విషయం. అతను ఎక్కడ ఉన్నాడు? బతికే ఉన్నాడా? చనిపోయాడా? పోలీసుల పాత్ర ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలి. నిజం బయటకు రావాలి. ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి ఉంటే, వారు ఎంత పెద్ద అధికారులైనా కఠినంగా శిక్షించబడాలి. ఇందులో రెండో అభిప్రాయానికి తావే లేదు.
Ads
అయితే ఇక్కడ మరో కోణం కూడా ఉంది. అదే ఇప్పుడు చాలామంది ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్న కోణం.
సాయికృష్ణ మిస్సింగ్ కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. అతన్ని పోలీసులు హత్య చేశారని, ఆ తర్వాత ఆధారాలు లేకుండా చేశారని తల్లి ఆరోపిస్తున్నారు. అది ఇప్పటికీ ఒక ఆరోపణ మాత్రమే. దర్యాప్తు తేల్చాల్సిన విషయం. కానీ విచారణ పూర్తికాకముందే రాజకీయ పార్టీలు పోటీలు పడి కుటుంబాన్ని పరామర్శించడం, అండగా ఉంటామని ప్రకటించడం, దీనిని ఒక భారీ రాజకీయ అంశంగా మార్చడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి?
నిజంగా న్యాయం కోసమేనా?
లేక ఓట్ల కోసం జరిగే కుల రాజకీయాల కోసమా? ఇదే ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్న.
అందుబాటులో ఉన్న పత్రాల ప్రకారం సాయికృష్ణపై గత కొన్నేళ్లలో అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. IPC 324, 341, 356, 379, 382, 384, 392, 394, 427, 461, 506 వంటి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు రికార్డులు సూచిస్తున్నాయి. కొన్ని కేసుల్లో రాజీలు జరిగాయి. కొన్ని కేసుల్లో నిర్దోషిగా విడుదలయ్యారు. కొన్ని కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి. మరికొన్ని కేసుల్లో శిక్షలు నమోదైనట్లు కూడా పత్రాల్లో కనిపిస్తోంది. గంజాయి స్వాధీనం కేసులు కూడా నమోదైనట్లు నమోదులు సూచిస్తున్నాయి.
ఇక్కడ ప్రశ్న ఏమిటంటే…
ఇంతటి వివాదాస్పద నేర చరిత్ర ఆరోపణలు, కేసులు ఉన్న వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడమే సమస్య కాదు. ఒక కుటుంబం బాధలో ఉన్నప్పుడు పరామర్శించడం మానవత్వం. దాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకులు పోటీలు పడి ఒకే కుటుంబాన్ని కలవడం, ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయడం, కేసు పూర్తిగా విచారణ దశలో ఉండగానే రాజకీయ యుద్ధంగా మార్చడం సరైనదేనా?
ఈ దేశంలో వేలాది మంది బాధితులు ఉన్నారు.
పోలీసుల వేధింపులకు గురైన పేదలు ఉన్నారు.
అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన సాధారణ కుటుంబాలు ఉన్నాయి.
నిరుద్యోగంతో ఆత్మహత్య చేసుకున్న యువకుల తల్లిదండ్రులు ఉన్నారు.
వైద్య నిర్లక్ష్యంతో మరణించిన కుటుంబాలు ఉన్నాయి.
వారి ఇళ్లకు ఎంతమంది ముఖ్యమంత్రులు వెళ్లారు?
ఎంతమంది మాజీ ముఖ్యమంత్రులు వెళ్లారు?
ఎన్ని సార్లు రాజకీయ పార్టీలన్నీ కలిసి బాధితులకు అండగా నిలిచాయి?
కానీ ఒక కేసు వెనుక కుల సమీకరణ కనిపించగానే రాజకీయ పార్టీలకు హఠాత్తుగా మానవత్వం గుర్తుకు రావడం ప్రజలను ఆలోచింపజేస్తోంది.
ఇక్కడే అసలు ప్రమాదం ఉంది.
ఒక సమాజం నిలబడేది చట్టం మీద.
ఒక సమాజం బలపడేది న్యాయం మీద.
కానీ ఒక సమాజం కూలిపోవడం మొదలవుతుంది, నేరం- న్యాయం అనే గీత చెరిగిపోయి కులం- ఓటు అనే లెక్కలు మొదలైనప్పుడు.
నేడు ఒక కేసు చుట్టూ కుల సమీకరణలు జరిగితే, రేపు ప్రతి కేసు చుట్టూ అదే జరుగుతుంది.
నేడు ఒక రాజకీయ పార్టీ చేస్తే, రేపు మరో పార్టీ చేస్తుంది.
అప్పుడు చట్టం ముందు నేరం ముఖ్యం కాదు.
కులం ముఖ్యం అవుతుంది.
నిజం ముఖ్యం కాదు.
ఓట్లు ముఖ్యం అవుతాయి.
ఇదే ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైన సంకేతం.
నిజంగా సాయికృష్ణకు అన్యాయం జరిగి ఉంటే బాధ్యులు శిక్షపడాలి… ఒకవేళ అతన్ని తల్లి ఆరోపిస్తున్నట్టుగా పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ చేసి ఉంటే… అందుకు కారణమైన సీఐ నాగరాజుపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలి.. ఆ తల్లి ఆరోపిస్తున్నట్టుగా చంపేసిన తర్వాత సాయికృష్ణ మృతదేహాన్ని కాల్చి బూడిద చేసి ఉంటే… నాగరాజును ఉరి తీయాలి..
వివిధ కేసుల్లో నిందితుడైనంత మాత్రాన… ఒక వేళ రౌడీషీటరే అయినా సరే.. పోలీసులు లాకప్ డెత్ చేసే అధికారం లేదు.. దానికి చట్టాలు ఉన్నాయి.. కోర్టు చూసుకుంటుంది.. కోర్టు తీర్పు ప్రకారం అతని పై యాక్షన్ తీసుకోవాలి తప్ప పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అనేది దుర్మార్గం.. దీన్నిఅందరం ఖండిద్దాం.. కచ్చితంగా ఖండిద్దాం.. అంతేగాని దీన్ని కులరాజకీయం చేయొద్దు… సమాజానికి తప్పుడు సందేశం ఇవ్వొద్దు.. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది కాదు… (ఇంతకీ సాయికృష్ణ ఏమైపోయినట్టు..? ఖతం అయిపోయినట్టేనా..?)
ఈ వ్యాసం ద్వారా ఎవ్వరినీ నేరస్తుడిగా ప్రకటించడం లేదు. ఎవరికీ శిక్ష వేయడం లేదు. కోర్టు పని కోర్టు చేస్తుంది. దర్యాప్తు సంస్థలు తమ పని చేస్తాయి.
కానీ ఒక సాధారణ పౌరుడిగా అడుగుతున్న ప్రశ్న మాత్రం ఒక్కటే…
ఒక వ్యక్తి మిస్సింగ్ కేసులో నిజం బయటపడకముందే, అతనిపై నమోదైన కేసుల చరిత్ర, వివాదాలు అన్నీ పక్కనపెట్టి, రాజకీయ పార్టీలు కేవలం కుల లెక్కల కోసం పోటీలు పడటం సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తోంది?
ఈ రోజు పిల్లలు, యువత చూస్తున్నది ఏమిటి?
చట్టాన్ని గౌరవించిన వ్యక్తులే ఆదర్శమా?
లేక రాజకీయ అవసరం వస్తే కేసులు, వివాదాలు అన్నీ మరిచిపోయి హీరోలుగా మారిపోయే వ్యక్తులే ఆదర్శమా?
నా ఆవేదన ఇదే.
నా ఆక్రందన ఇదే.
ఇది ఏ రాజకీయ పార్టీపై ద్వేషంతో రాసిన వ్యాసం కాదు.
ఇది సమాజం ప్రమాదకర దిశగా వెళ్లకూడదనే ఆందోళనతో రాసిన వ్యాసం…. అశోక్ వేములపల్లి
Share this Article