.
Srini Journalist …. కొత్త FCRA రూల్స్ చూసి కొన్ని ఎన్జీఓలు ఎందుకు అంతగా వణుకుతున్నాయి?
భారతదేశంలో స్వచ్ఛంద సంస్థలు (NGOs) విదేశాల నుంచి అందుకునే వేలాది కోట్ల రూపాయల నిధులపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సరికొత్త FCRA (విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) నిబంధనలను తీసుకువచ్చింది.
దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వం, సార్వభౌమత్వమే లక్ష్యంగా తెచ్చిన ఈ చట్టం ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది.
ఒకవైపు కేంద్ర ప్రభుత్వం దేశ భద్రత దృష్ట్యా ఈ కొత్త ఆంక్షలు అనివార్యమని స్పష్టం చేస్తుంటే, మరోవైపు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, అటు అమెరికా వంటి అంతర్జాతీయ శక్తులు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Ads
అసలు ఈ కొత్త రూల్స్ ఏంటి? ఎన్జీఓలు ఎందుకు అంతగా భయపడుతున్నాయి? అమెరికా లాబీలు భారత్పై ఎందుకు ఒత్తిడి తెస్తున్నాయనే అంశాలపై పూర్తి విశ్లేషణ.
ఏమిటీ కొత్త FCRA నిబంధనలు?
విదేశీ నిధుల లొసుగులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రధానంగా ఐదు కఠినమైన ఆంక్షలను విధించింది:
(1) నిధుల పూర్తి పారదర్శకత:
విదేశాల నుంచి వచ్చే ప్రతి రూపాయిని ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో, ఏ కార్యక్రమం కోసం ఖర్చు చేస్తున్నారో ప్రభుత్వానికి నివేదించాలి.
(2) మూల దాతల గుర్తింపు:
నిధులు పంపిన అసలు వ్యక్తి లేదా సంస్థ వివరాలను దాచడానికి వీల్లేదు.
(3) ఆస్తుల జప్తు నిబంధన:
ఏదైనా సంస్థ యొక్క FCRA లైసెన్స్ రద్దయితే లేదా గడువులోగా రిన్యూవల్ కాకపోతే, ఆ విదేశీ నిధులతో నిర్మించిన భవనాలు, ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక అధికారిని నియమించవచ్చు.
(4) ఖర్చులపై పరిమితి మరియు జరిమానాలు:
పరిపాలన ఖర్చుల పేరిట నిధులను సొంతానికి వాడుకుంటే, దుర్వినియోగం చేసిన మొత్తంలో 30 శాతం లేదా లక్ష రూపాయల వరకు భారీ జరిమానా విధిస్తారు.
(5) సోషల్ మీడియా నిఘా:
నిధులు పొందే సంస్థల నిర్వాహకులు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల వివరాలను ప్రభుత్వానికి సమర్పించడం తప్పనిసరి.
రూల్స్ పాటిస్తే సరిపోతుంది కదా… NGOs ఎందుకు అంతగా బాధపడుతున్నాయి?
తప్పు చేయనప్పుడు నిబంధనలు పాటిస్తే సరిపోతుంది కదా, ఎందుకు ఇంత రచ్చ అనే ప్రశ్న సామాన్యుడికి రావడం సహజం.
కానీ ఎన్జీఓలు ఇక్కడ కొన్ని కీలకమైన ప్రాక్టికల్ ఇబ్బందులను తెరపైకి తెస్తున్నాయి…
(1) చిన్న సంస్థల మనుగడ కష్టం:
కొత్త రూల్స్ ప్రకారం సబ్-గ్రాంటింగ్ అంటే ఒక ఎన్జీఓ నుండి మరో ఎన్జీఓకు నిధులు బదిలీ చేయడంపై పూర్తి నిషేధం విధించారు. గతంలో చిన్న సంస్థల తరఫున పెద్ద మదర్ ఎన్జీఓలు పేపర్ వర్క్ చూసుకునేవి. కానీ ఇప్పుడు ఏ చిన్న సంస్థకు ఆ సంస్థే నేరుగా ఢిల్లీలోని కేంద్ర హోం శాఖతో, ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్తో లీగల్ వ్యవహారాలు నడపాలి.
(2) ఆడిటింగ్ , కంప్లయన్స్ ఖర్చులు:
ప్రతి చిన్న ఖర్చుకు విడివిడిగా దరఖాస్తులు చేసుకోవడం, ఆడిట్ నివేదికలు ఇవ్వడం, సోషల్ మీడియా లింక్ చేయడం వంటి సాంకేతిక ప్రక్రియల కోసం చార్టర్డ్ అకౌంటెంట్లు, లీగల్ అడ్వైజర్లను పెట్టుకోవాలి. చిన్న సంస్థలకు వచ్చే తక్కువ ఫండింగ్లో సగం డబ్బు ఈ ఆడిటింగ్ ఫీజులకే సరిపోతోందని వారు వాదిస్తున్నారు.
(3) సాంకేతిక లోపాలకే ఆస్తుల జప్తు భయం:
ఆడిటింగ్లో చిన్న సాంకేతిక లోపం జరిగినా ఏళ్ల తరబడి కష్టపడి కట్టిన పాఠశాలలు, ఆసుపత్రుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా అధికారులకు అపరిమిత అధికారాలు ఇవ్వడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
అమెరికా ఎందుకు అంతగా ఆందోళన చెందుతోంది? లాబీల వ్యూహం ఏంటి?
భారతదేశానికి వచ్చే విదేశీ నిధులలో సింహభాగం అమెరికాకు చెందిన మతపరమైన, మానవ హక్కుల స్వచ్ఛంద సంస్థల నుంచే వస్తాయి. కొత్త రూల్స్ వల్ల అమెరికా నుంచి వచ్చే వందల కోట్ల నిధులు నిలిచిపోవడంతో అక్కడి శక్తివంతమైన క్రిస్టియన్ మిషనరీలు, అంతర్జాతీయ సంస్థలు అమెరికా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి.
ఈ ఒత్తిడి కారణంగానే అమెరికాకు చెందిన అంతర్జాతీయ మత స్వేచ్ఛా కమిషన్ (USCIRF) తన నివేదికలలో భారతదేశాన్ని ప్రత్యేక ఆందోళనకర దేశంగా గుర్తించాలని సిఫార్సు చేస్తోంది. తద్వారా భారత్పై అంతర్జాతీయంగా ఆర్థిక, రాజకీయ ఒత్తిడి పెంచి, ఈ FCRA నిబంధనలను సవరించేలా చేయాలనేది అమెరికన్ లాబీల వ్యూహం.
ఆన్లైన్ పోర్టల్స్ వచ్చాక కూడా ఇంకా భయం ఎందుకు? అసలు గుట్టు ఇదే!
కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ ప్రక్రియ మొత్తాన్ని సులభతరం చేస్తూ అధికారిక ఆన్లైన్ పోర్టల్ను తీసుకువచ్చింది [fcraonline.nic.in]. ఆన్లైన్ లోనే తమ వార్షిక రిటర్న్స్, ఆడిట్ రిపోర్టులు అప్లోడ్ చేసే సదుపాయం ఉన్నా వీరు భయపడటానికి అసలు కారణం వేరే ఉంది…
(1) ఆన్లైన్ నిఘాలో దొరికిపోతామనే భయం: ఆన్లైన్ పోర్టల్ సిస్టమ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ టూల్స్ వచ్చాయి. ఎక్కడైనా చిన్న తేడా వచ్చినా సిస్టమ్ వెంటనే రెడ్ ఫ్లాగ్ చూపిస్తుంది. ఈ పారదర్శకత వల్లే తప్పుడు లెక్కలు రాసే నకిలీ సంస్థలకు వణుకు పుడుతోంది.
(2) పాత తప్పులు బయటపడతాయనే భయం: చాలా సంస్థలు గతంలో విదేశీ నిధులను తీసుకొచ్చి, వాటిని తమ సొంత లగ్జరీలకు లేదా పొలిటికల్ ఫండింగ్స్ కి వాడేసాయి. ఇప్పుడు ఆన్లైన్ లో రిన్యూవల్ చేసుకోవాలంటే గత ఐదేళ్ల నాటి రికార్డులను కూడా డిజిటల్గా అప్లోడ్ చేయాల్సి వస్తోంది. పాత అక్రమాలు బయటపడి జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయం వీరిది.
(3) కృత్రిమ అశాంతికి బ్రేక్ పడటం: కొన్ని స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ సేవ అని పోర్టల్ లో పేర్లు పెడతాయి. కానీ ప్రాక్టికల్ గా దేశంలో ఎక్కడైనా భారీ ప్రాజెక్టులు, పరిశ్రమల దగ్గరకు వెళ్లి స్థానిక ప్రజలను రెచ్చగొట్టి కృత్రిమ నిరసనలు సృష్టిస్తాయి.
ప్రభుత్వం ఇప్పుడు ఆన్లైన్ పేపర్లతో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా గ్రౌండ్ రిపోర్ట్స్ ని కూడా క్రాస్ వెరిఫై చేస్తోంది. పైన చెప్పే సేవా మాటలకు, లోపల చేసే పనులకు తేడా దొరికిపోతే ఆస్తులు జప్తు అవుతాయనే భయమే వాళ్లను వెంటాడుతోంది.
Share this Article