.
ఆంధ్రజ్యోతిలో ఓ స్టోరీ… రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఓ జెడ్పీటీసీ సభ్యుడిగా మొదలై ఏకంగా సీఎం కుర్చీ దాకా ఎలా సాగిందో వివరించే కథనం అది… దీనికి 20 ఏళ్లు పట్టింది… నిజమే, ఒక స్వతంత్ర జెడ్పీటీసీ సభ్యుడు… ఎదగడానికి ఏయే పార్టీలు దోహదం చేసినా సరే, అంతర్గత రాజకీయాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ నుంచి సీఎం కావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు…
నిజమే… వెయ్యి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది! సీఎం రేవంత్రెడ్డి రాజకీయ ప్రస్థానం కూడా అంతే. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ జడ్పీటీసీ సభ్యుడిగా తను వేసిన తొలి అడుగు.. నేడు రాష్ట్ర అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టింది. ప్రజాప్రతినిధిగా ప్రస్థానం ప్రారంభమై ఈ జూలై 4 నాటికి సరిగ్గా 20 ఏళ్లు…
Ads
తన రాజకీయ జన్మభూమి అయిన మిడ్జిల్ ప్రజల సమక్షంలోనే ప్రజాప్రతినిధిగా 20వ పుట్టిన రోజును జూలై 4న సీఎం రేవంత్ రెడ్డి జరుపుకోనున్నాడు. అప్పట్లో తన గెలుపునకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అలాగే అక్కడ జరిగే బహిరంగ సభలోనూ పాల్గొననున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
మిడ్జిల్ జడ్పీటీసీగా తొలి విజయం!
విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసినా, ప్రత్యక్ష రాజకీయాల్లో రేవంత్ రెడ్డి తొలి అడుగు స్వతంత్రంగానే పడింది… ఉమ్మడి రాష్ట్రంలో 2006 పరిషత్ ఎన్నికల్లో మిడ్జిల్ జడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, జూలై 4న విజయం సాధించాడు. మరుసటి ఏడాదే (2007) మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగానే గెలిచి, శాసనమండలిలో అడుగు పెట్టాడు.
తరువాత టీడీపీ… కొడంగల్ నియోజకవర్గం నుంచి 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం… రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, తెలంగాణ శాసనభలో టీడీపీఎల్పీ.. బీఆర్ఎస్ఎల్పీలో విలీనం కావడం, ఆ పార్టీ మనుగడా ప్రశ్నార్థకం కావడంతో తన రాజకీయ లక్ష్య సాధన కోసం కాంగ్రెస్ పార్టీలో చేరాడు…
కాంగ్రెస్ పార్టీలో చేరాక ఏం జరిగిందనేది అందరికీ తెలిసిన కథే… టీడీపీ నుంచి తను గౌరవంగా వచ్చేశాడు, చంద్రబాబుకు సావధానంగా పరిస్థితిని వివరించి ఓ సుదీర్ఘ లేఖ కూడా రాశాడు… తరువాత 2018 ఎన్నికలకు ముందు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది పార్టీ. కానీ ఆ ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ కొడంగల్ పైన బాగా కాన్సంట్రేట్ చేయడం, ఇతర పరిణామాల నేపథ్యంలో ఆ ఎన్నికల్లో రేవంత్రెడ్డి ఓటమిపాలయ్యాడు…
ఇక రేవంత్ రెడ్డి వేగవంతమైన ఎదుగుదలకు బ్రేక్ పడ్డట్టే అనుకున్నారు అందరూ ఆ దశలో… కానీ ఇది జస్ట్, ఓ స్పీడ్ బ్రేకరే… 2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి స్థానం నుంచి రేవంత్రెడ్డిని అధిష్ఠానం బరిలోకి దింపింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న రేవంత్రెడ్డి.. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు.
2021 జూలై 7న టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం. అసలు బోలెడు మంది సీనియర్లు ఉండగా, రేవంత్ రెడ్డికి ఆ పోస్టు ఇవ్వడమే ఓ పెద్ద విశేషం… తరువాత తనదైన దూకుడుతో బీఆర్ఎస్ మీద రాజకీయంగా దాడి… కేసీయార్ సహించలేక కేసులు పెట్టించి, జైలుపాలు చేసినా రేవంత్ రెడ్డి జర్నీని అవేమీ ఆపలేదు, పైగా తనలో ఓ పొలిటికల్ కసిని పెంచాయేమో… చివరకు 2023 డిసెంబర్ 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
ఎక్కడి మిడ్జిల్… ఎక్కడి సచివాలయం… వర్తమాన తెలంగాణ రాజకీయాల్లో ఓ పే-ద్ద సక్సెస్ స్టోరీయే… నిజంగానే తను మిడ్జిల్లో తన పొలిటికల్ బర్త్డే జరుపుకోవాలని నిర్ణయించుకుంటే… ఆహ్వానించదగిన నిర్ణయమే!!
ఎందుకంటే… అనేక మంది ‘‘ముఖ్యమంత్రులు’’ ఉండే కాంగ్రెస్లో తను సీఎం పీఠంపై ఎన్నాళ్లు ఉంటాడులే అనుకున్న తన సొంత ప్రత్యర్థులు, పింక్ ప్రత్యర్థులు, కాషాయ ప్రత్యర్థుల ఆశల్ని వమ్ముచేస్తూ తను సీఎం పీఠంపై మరింత పాతుకుపోయాడు కాబట్టి..!!
Share this Article