.
కీలెరిగి వాతలు పెట్టడంలో రేవంత్ రెడ్డి తరువాతే ఎవరైనా..? అందుకే అబద్దాలు, అక్రమాలు, వక్రబాష్యాలకు పెట్టింది పేరైన బీఆర్ఎస్ కూడా ఫుల్ డిఫెన్సులో పడిపోతోంది… కేసీయార్ అయితే మోదీని గోకగలను గానీ రేవంత్ను ఇక గోకలేను అని ఫామ్ హౌజులో స్వీయబందిఖానాలో పడిపోయాడు…
దేశమంతా నీట్ విద్యార్థుల ఆందోళనలు, మద్దతు ప్రదర్శనలు, ఆ రాజకీయాల మీద కల్లోలం నడుస్తోంది కదా… తమ రహస్య సంసారం కారణంగా బీఆర్ఎస్ బీజేపీ మీద విరుచుకుపడలేదు, అసలే కొత్త పొత్తుపొడుపుల కాలం… ఇన్ని రోజులైనా కిమ్మనలేదు… కానీ తాము బదనాం అవుతున్న తీరు తెలుసుకుని, ఇక తెలివిగా కేటీయార్ జన్మదినానికీ, విద్యార్థుల మద్దతుకూ ముడిపెట్టి ఓ పేద్ద వ్యూహం రచించింది పింక్ క్యాంపు…
Ads
ఇంత ఆందోళనల నేపథ్యంలో సారు గారు బర్త్ డే వేడుకలు జరుపుకోవడం లేదు అనే ఓ సూపర్ త్యాగశీలి ఇమేజ్ ప్లస్ విద్యార్థులకు మద్దతు ఇమేజ్, పాత బదనాం పోవాలనే బహుముఖ ఫాయిదాలతో ఓ స్కీమ్ రచించారు… మొన్ననే కదా నిరుద్యోగ ర్యాలీ ఏదో చేశారు… వెంటనే రేవంత్ రెడ్డి అలర్టయ్యాడు… కేటీయార్ మార్క్ స్కీమ్ బ్రేక్ చేసి, ఉల్టా బదనాం చేయడానికి పాత గ్లోబరీనాను తెరమీదకు తీసుకొచ్చాడు ప్లాన్ ప్రకారం…
అసలు నువ్వే పరీక్షలు, మూల్యాంకనాల ఫ్రాడ్ ఏజెన్సీ గ్లోబరీనాకు పాత్రధారివి, సూత్రధారివి, నీకు బినామీ అది, నువ్వు కూడా మాట్లాడేవాడివి అయ్యావా అని పొలిటికల్ అటాక్ స్టార్ట్ చేశాడు, వేరేవాళ్లు కూడా అందుకుని తామూ పలుచోట్ల ఇవే ఆరోపణలు చేశారు… ఇక్కడ నీట్ లీకేజీలకు, గ్లోబరీనాకు ఏం లింక్ అనడక్కండి… రాజకీయాల్లో హేతువు కనుమరుగై చాన్నాళ్లయింది, ప్రత్యేకించి తెలంగాణ రాజకీయాల్లో..!!
గ్లోబరీనా… గుర్తుందా..? ఏడేళ్ల క్రితం, కేసీయార్ పాలన కాలంలో మన ఇంటర్ పిల్లల జీవితాలతో ఆడుకుంది… అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారు… మొదట్లో తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం వెనకేసుకొచ్చింది ఆ సంస్థను… అది కేటీయార్ స్నేహితుడిదనే రాజకీయ ఆరోపణలు కూడా వచ్చాయి అప్పట్లో… ఇదంతా నిజమే…
అప్పటి విషాదం, వైఫల్యం… ప్రభుత్వం పిల్లల జీవితాలతో, భవిష్యత్తుతో ఆడుకుంది… గ్లోబరీనా తప్పులతడక ఒప్పందాలు, పరీక్ష మార్కుల మూల్యాంకనం, రీవెరిఫికేషన్, ఫలితాల క్రోడీకరణలో తప్పుల వల్ల… మెరిట్ పిల్లలు ఫెయిలయ్యారు… దాదాపు 25 మంది పిల్లలు చనిపోయారు… దాదాపు 3 లక్షల మంది పిల్లలతో అది ఆడుకుంది… విషాదం ఏమిటంటే..? బోర్డుకు అసలు ఆ సంస్థతో అప్పటికి అధికారిక ఒప్పందమే లేదు…
తరువాత చాలా వివాదాలు, కోర్టు దాకా వెళ్లాయి సంస్థ వైఫల్యాలు… కానీ ఆ Globarena Technologies కథ ముగియలేదు… ఆ పడగ నీడ అలాగే ఉంది… కాకపోతే వేరే పేరుతో… కొత్త పేరు Coempt Edutech … దానికి కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్కూ నడుమ ఏం లింకులున్నాయనేది ఇక్కడ అప్రస్తుతం…
కానీ రీసెంట్ సీబీఎస్ఈ బ్లండర్స్, ఫెయిల్యూర్స్కు కూడా అదే కారణం… దాన్నీ కేంద్ర మంత్రి వెనకేసుకు వచ్చాడు, అదీ నిజం… ఆ వైఫల్యాల మాటేమిటంటే..? ఈ ఏడాది (2026) CBSE తొలిసారిగా భారీ స్థాయిలో డిజిటల్ మూల్యాంకన వ్యవస్థను అమలు చేసింది… సంప్రదాయంగా ఎగ్జామినర్లు ఫిజికల్ ఆన్సర్ షీట్లు చెక్ చేసే విధానానికి బదులుగా, స్కాన్ చేసిన కాపీలను ఆన్లైన్లో చూసి మార్కులు వేయించే విధానాన్ని తీసుకొచ్చింది…
- తమ ఆన్సర్ షీట్ స్థానంలో వేరే విద్యార్థి షీట్ కనిపించడం.
- స్కాన్ చేసిన కాపీలు బ్లర్గా ఉండటం.
- కొన్ని పేజీలు పూర్తిగా చెక్ కాకపోవడం.
- పేజీ వారీ మార్కులు, మొత్తం మార్కులు సరిపోకపోవడం.
- రీ-వెరిఫికేషన్ పోర్టల్ పదేపదే క్రాష్ కావడం.
- ఊహించని విధంగా 20-40 మార్కుల వరకు తేడాలు రావడం.
ఈ ఫిర్యాదులు అంత పెద్ద స్థాయికి వెళ్లాయి కాబట్టి…
- 4 లక్షలకుపైగా విద్యార్థులు తమ ఆన్సర్ షీట్ల కాపీలు కోరారు…
- 11 లక్షలకు పైగా ఆన్సర్ బుక్ కాపీల కోసం దరఖాస్తులు వెళ్లినట్లు నివేదికలు చెబుతున్నాయి…
- JEEలో మంచి ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులు బోర్డుల్లో ఆశ్చర్యకరంగా తక్కువ మార్కులు రావడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు…
అందుకే ఆ వివాదం ఇప్పుడు “మార్కులు తక్కువ వచ్చాయి” అనే స్థాయిని దాటి… “భారతదేశంలో అతిపెద్ద విద్యా బోర్డు డిజిటల్ మూల్యాంకన వ్యవస్థ నిజంగా నమ్మదగినదేనా?” అనే పెద్ద ప్రశ్నగా మారింది… ఈ ప్రశ్న పదే పదే అదే గ్లోబరీనా, ప్రస్తుత కోఎంప్ట్ ఎడ్యుటెక్ కంపెనీ నిర్వాకాల వైపు కూడా వేలెత్తి చూపిస్తోంది…
- CBSE OSM వ్యవస్థ కోసం కాంట్రాక్ట్ పొందిన సంస్థ Coempt Edutech… ప్రతిపక్ష నేతలు, ముఖ్యంగా Rahul Gandhi, ఈ సంస్థ గతంలో Globarena Technologies పేరుతో పనిచేసిందని, 2019 తెలంగాణ ఇంటర్ ఫలితాల వివాదంలో పేరు వచ్చిన అదే సంస్థ అని ఆరోపించారు…
సో, పరీక్షల నిర్వహణలో, లీకేజీల బాగోతాల్లో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వైఫల్యం చాలా ఉంది… విద్యార్థుల జీవితాలతో ఆడుకునే గ్లోబరీనా, ప్రస్తుత కోఎంప్ట్ కంపెనీలో మంత్రి సన్నిహితులు ఎవరైనా ఉన్నారా..? మోదీ ఈ మంత్రి నిర్వాకం, వైఫల్యాన్ని ఎందుకు ఉపేక్షిస్తున్నట్టు..? ఇవన్నీ ప్రశ్నలు…
నో, నో, గ్లోబరీనాకూ నాకేం సంబంధం? రేవంత్కు లీగల్ నోటీసు ఇస్తున్నా అని కేటీయార్ స్పందించాడు, సహజమే… కానీ సందర్భాన్ని సరిగ్గా వాడుకుని రేవంత్ రెడ్డి అదే గ్లోబరీనాను తెర మీదకు తీసుకొచ్చాడు… అదీ విశేషం..! అందుకే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కు కొరకరాని కొయ్య అయిపోయాడు!!
Share this Article