.
శ్రీలీలకు ఉపయోగపడిన ‘జన నాయగన్’?.. రీమేక్ ట్రోల్స్లో చిక్కుకున్న విజయ్ సినిమా! … ఒక సినిమా రీమేక్గా వస్తే ఒరిజినల్తో పోలికలు రావడం సహజం. కానీ ఒరిజినల్ సూపర్ హిట్ అయి, రీమేక్ మాత్రం ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోతే ఆ పోలికలు కాస్త ట్రోల్స్గా మారిపోతాయి. ఇప్పుడు విజయ్ చివరి చిత్రంగా వచ్చిన ‘జన నాయగన్’ విషయంలో కూడా అదే జరుగుతోంది.
విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై మిక్స్డ్ టాక్ నడుస్తుండగా, సోషల్ మీడియాలో మాత్రం ‘భగవంత్ కేసరి వర్సెస్ జన నాయగన్’ పోలికలే హాట్ టాపిక్గా మారాయి. తమిళ ప్రేక్షకుల్లో సినిమాపై కొంత సానుకూల స్పందన కనిపిస్తున్నా, తెలుగు ప్రేక్షకులు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు.
Ads
కారణం ఒక్కటే… ఇది నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’కి రీమేక్ కావడం. విజయ్, మమితా బైజు, పూజా హెగ్డే వంటి స్టార్ కాస్ట్ ఉండటంతో కొత్తదనం ఉంటుందని ఆశించిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైందని సోషల్ మీడియాలో కామెంట్లు…
సినిమాపై వస్తున్న ప్రధాన విమర్శ ఏమిటంటే… భగవంత్ కేసరిలో ప్రేక్షకులను కదిలించిన తండ్రి- కూతురు అనుబంధాన్ని పక్కనపెట్టి, రాజకీయ డైలాగులు, మాస్ ఎలిమెంట్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనేది. విజ్జి పాప భయం, భగవంతన్న ఆవేదన, లారీ సీన్, థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కలిపి ఒరిజినల్లో పండిన భావోద్వేగం తమిళ వెర్షన్లో కనిపించలేదు…

అయితే ఈ పోలికల్లో ఎక్కువ చర్చకు వచ్చిన విషయం మాత్రం శ్రీలీల – మమితా బైజు నటన. ఒరిజినల్లో విజ్జి పాప పాత్రలో శ్రీలీల చూపించిన భావోద్వేగ నటనను ఇప్పుడు చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్లో బాలకృష్ణతో ఆమెకు ఉన్న ఎమోషనల్ బాండింగ్, యాక్షన్ సన్నివేశాల్లో కనిపించిన సహజత్వం సినిమాకు పెద్ద బలమని అభిమానులు చెబుతున్నారు.
మమితా బైజు తన పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, ఆమెకు దక్కిన ఆ పాత్రకు అనేక మార్పులు చేయడంతో, ఆ పాత్ర రూపకల్పనే బలహీనంగా మారింది. తెలుగు వెర్షన్లో కథ మొత్తం విజ్జి పాప భావోద్వేగాల చుట్టూ తిరిగితే, తమిళ వెర్షన్లో రాజకీయ అంశాల హడావుడిలో ఆ పాత్రకు సరైన బలం ఇవ్వలేదు. దీంతో మమితా నటన కంటే, శ్రీలీల నటన విలువే ఇప్పుడు ఎక్కువగా చర్చకు వస్తోంది. సోషల్ మీడియాలో అయితే “శ్రీలీల ఎంత బాగా నటించిందో గుర్తు చేయడానికే జన నాయగన్ తీశారా?” అనే ట్రోల్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

ఈ చర్చతో పాటు శ్రీలీల కెరీర్ గురించీ నెటిజన్లు మాట్లాడుతున్నారు. నటిగా మంచి సామర్థ్యం ఉన్నప్పటికీ, వరుసగా కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్లే ఆమె కెరీర్ దెబ్బతిని పోయింది… సరైన కథ, బలమైన పాత్ర దొరికితే శ్రీలీల మరోసారి బలంగా నిలబడగలదని సినీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది…
మరోవైపు జన నాయగన్ చుట్టూ మరో వివాదం కూడా తెరపైకి వచ్చింది. సినిమాలో నటించిన నటి ఆనంది అజయ్ తన కీలక సన్నివేశాలన్నీ తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమైంది. మరోవైపు పూజా హెగ్డే పాత్ర కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఆమె సీన్లకూ కత్తెరపడటం ఆమె అభిమానులను నిరాశపరిచింది. మంచి భావోద్వేగ కథను రాజకీయ కోణంలోకి మళ్లించడం, రన్టైమ్పై సరైన ప్రణాళిక లేక ఎడాపెడా సన్నివేశాలు తొలగించడం వల్ల సినిమా గందరగోళంగా మారింది… అటూఇటూ గాకుండా పోయింది!
సినిమా ఎన్నికల ముందు విడుదలై ఉంటే రాజకీయంగా విజయ్కు కొంత ప్రయోజనం చేకూర్చేదేమో కానీ, భావోద్వేగ బలం కోల్పోవడమే సినిమాకు పెద్ద మైనస్గా మారింది...
Share this Article