.
తెలంగాణ సమస్య ఏమిటంటే..? మేం రాష్ట్రం తీసుకొచ్చాం అని నినదించే బీఆర్ఎస్ పదేళ్లపాటు అరాచకంగా పాలించి, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షల్ని, ఆశల్ని తుంగలో తొక్కి… అధికారం కోల్పోయాక అకస్మాత్తుగా నీతులు వల్లించడం…
దానికి హఠాత్తుగా తెలంగాణ అస్థిత్వం కూడా గుర్తొస్తుంది… రకరకాల కవర్ సంఘాలతో ‘తెలంగాణ అస్థిత్వానికి ప్రమాదం వాటిల్లినట్టు’ ఓ షో నడిపిస్తూ ఉంటుంది… తెలంగాణ జనం కళ్లకు ఎప్పటిలాగే విజయవంతంగా గంతలు కట్టగలం అనేది ఆ క్యాంపు ధీమా…
Ads
అనేక ఉదాహరణల్ని అనేకసార్లు చెప్పుకున్నాం కదా… తాజాగా మరొకటి… కాసు బ్రహ్మానందరెడ్డి అనే ఓ మాజీ ముఖ్యమంత్రికి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించాడు… అది మర్యాద, ఆనవాయితీ… వైఎస్, రోశయ్యలనూ సంస్మరిస్తారు… కానీ అదీ తప్పేనట… వెంటనే గులాబీ క్యాంపు విరుచుకుపడింది… రేవంత్ రెడ్డి ఏం చేసినా దానికి గంగవెర్రులు కదా…
‘‘నాన్సెన్స్, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం నినదించిన 369 మంది అమాయక విద్యార్థులను, యువకులను నిర్దాక్షిణ్యంగా తుపాకీ గుళ్లకు బలిచ్చిన నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డిని నేడు “మహనీయుడు” అంటూ తెలంగాణ సీఎంఓ (Telangana CMO) అధికారికంగా నివాళులు అర్పించడం సమంజసమేనా ? తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అంటూ మొదలెట్టారు గాయిగత్తర.,.
తను ఉమ్మడి రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి… మరి సదరు మాజీ ముఖ్యమంత్రిపై ఈ తెలంగాణ అస్థిత్వవాదులకు, అనితర ఉద్యమ స్పూర్తిప్రదాతలకు అంత వ్యతిరేకత ఉండి ఉంటే, పాత తప్పిదాల్ని క్షమించకూడదు అనుకుంటే తన పేరిట ఉన్న పార్కు పేరెందుకు మార్చలేదు..? ఆ విగ్రహాల మాటేమిటి..? సో, నువ్వు అధికారంలో ఉంటే అన్నీ చలామణీ, అధికారం పోతే అస్థిత్వ సమస్య, ఇది బీఆర్ఎస్ పార్టీ అస్థిత్వ సమస్యా..?!
ఆంధ్రావాలా భాగో అని నినదించిన కేసీయార్ తనే తరువాత కాలంలో ఆంధ్రుడి కాలిలో ముల్లు దిగితే నా పళ్లతో తీస్తా అనలేదా..? అంతెందుకు..? ఇదే కేసీయార్ తెలంగాణ పరమ వ్యతిరేకిగా పేర్కొనే చంద్రబాబుతో కలిసి 2009లో ఓ మహాకూటమిగా పోటీచేసినప్పుడు ఎటు పోయింది ఈ తెలంగాణ ఉద్యమ స్పూర్తి..? దాన్ని ఇదే తెలంగాణ జనం నిర్మొహమాటంగా తిరస్కరించారు కదా..!
వీర సమైక్యవాది, తెలంగాణ వ్యతిరేకి వైఎస్ ప్రభుత్వంలోనూ ఉంటుంది టీఆర్ఎస్… తెలంగాణ మరో వ్యతిరేక చంద్రబాబుతో కలిసి ఎన్నికల్లో పోటీచేస్తుంది టీఆర్ఎస్ (ప్రజెంట్ బీఆర్ఎస్)… తన అవసరానికి అది పొలిటికల్ స్ట్రాటజీ… అధికారంలో లేకపోతే మాత్రం ప్రతిదీ తెలంగాణకు ఓ అస్థిత్వ సమస్య!! (కాసు బ్రహ్మానందరెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు అనేది ఇక్కడ గమనార్హం)…
అయినా… తమ మాజీ ముఖ్యమంత్రికి నివాళి అర్పించడం అంటే, అది 1969 మరణాలకు మద్దతు ఎలా అవుతుంది..? వక్రబాష్యం!! అవునూ, టీఆర్ఎస్ (ప్రజెంట్ బీఆర్ఎస్) ఏర్పడి ఇన్నేళ్లయింది కదా, ఎప్పుడైనా కాసు బ్రహ్మానందరెడ్డి మీద వీసమెత్తు విమర్శ చేసిందా..?
చివరగా… ఈ కాంగ్రెస్ పార్టీయే కదా తెలంగాణ ఇచ్చింది… నిండు శాసనసభలో కేసీయారే స్వయంగా చెప్పాడు కదా సోనియాకు కృతజ్ఞతలు… ఢిల్లీ వెళ్లి విలీనం చేయడానికి ప్రయత్నించింది… సకుటుంబంగా వెళ్లి మరీ ఆమెకు దండం పెట్టి థాంక్స్ చెప్పి వచ్చింది… అవన్నీ మరిచిపోతే ఎలా మాస్టారూ..!! ప్రస్తుత విమర్శలు, గాయిగత్తర, శోకాలు కూడా కేసీయార్ నోటి వెంట రావు, తన సోషల్ గ్యాంగు నెట్ శోకాలే..!!
Share this Article