.
- తెలంగాణ స్వరాష్ట్ర నినాదాలు ఏమిటి..? నీళ్లు- నిధులు- నియామకాలు… ఇవే కదా… మిగతా విషయాల్ని ఎప్పుడైనా చెప్పుకుందాం గానీ… నీళ్లు, అంటే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కేసీయార్ అప్రయోజకత్వం కావచ్చు అవినీతి కావచ్చు అక్రమాలు కావచ్చు… స్వరాష్ట్రానికి తీరని ద్రోహం జరిగింది…
అది కూలేశ్వరమో, కాళేశ్వరమో, స్కామేశ్వరమో కావచ్చు… దానిపైనే శ్రద్ధ పెట్టి, ఓ నాసిరకం ప్రాజెక్టును తెలంగాణ నెత్తిన మోపి, తను బాగుపడి, దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను పఢావు పెట్టి… స్థూలంగా తెలంగాణకు ఓ నష్టకారక శకాన్ని మిగిల్చాడు…
అంతర్రాష్ట్ర జలాల నడుమ ఖచ్చితంగా వివాదాలుంటాయి… ఎవడైతే ముందుగా ప్రాజెక్టులను చకచకా కంప్లీట్ చేసేస్తాడో వాడికే అడ్వాంటేజ్ ఉంటుంది, జలాల వాటాల పంపిణీ సందర్భంలోనూ ఆయా ప్రాజెక్టులకు జలాల కేటాయింపులో ప్రయారిటీ ఉంటుంది… ఉద్యమసమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలు బోలెడు దంచిన కేసీయార్ తీరా గద్దెనెక్కాక మొత్తం పెంట పెంట చేసేశాడు…
Ads
తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్కటీ దిద్దాల్సి వస్తోంది… కాళేశ్వరం రిపేర్ల దగ్గర నుంచి దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల దాకా కేసీయార్ పాపాలు రేవంత్ రెడ్డికి శాపాలు… ఈ దిద్దుబాట క్రమంలోనే పాలమూరుకు పనికొచ్చే మూడు ఉపయుక్త ప్రాజెక్టులను ఆలోచిస్తోంది… రీసెంటుగా ఓ సమీక్ష కూడా జరిగింది…
(కృష్ణాలో 70 శాతం మాకు, 30 శాతం కూడా తెలంగాణకు ఎక్కువే అని ఏపీ బరితెగింపు వాదనలు చేస్తున్న సంగతి తెలుసు కదా బచావత్ ట్రిబ్యునల్ ఎదుట… మనం సమర్థంగా వాదించాలంటే మనం ఏమైనా పదేళ్ల కేసీయార్ పాలనలో ఏమైనా కట్టుకుని ఏడిస్తేగా…)
తాజా ఆలోచనలు ఏమిటీ అంటారా..? పాలమూరు ఆయకట్టుకు మరింత భరోసా.. కృష్ణా జలాలతో సాగు, విద్యుత్కు కొత్త ప్లాన్!
రూ.15 వేల కోట్లతో మూడు భారీ సాగునీటి ప్రతిపాదనలు… లక్ష ఎకరాలకు కొత్తగా నీరు … గుడెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యం 15 టీఎంసీలకు పెంపు …. పంప్డ్ స్టోరేజీతో విద్యుదుత్పత్తికీ ప్రణాళిక…
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఉపయోగపడేలా సుమారు రూ.15 వేల కోట్ల వ్యయంతో మూడు సాగునీటి పథకాలను విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీటిలో గట్టు ఎత్తిపోతల పథకం విస్తరణ, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమైన గుడెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని భారీగా పెంచడం, మక్తల్–నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకం రెండో దశ ఉన్నాయి.
ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, అధికారులు ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. మంత్రివర్గం ముందుకు వెళ్లిన తర్వాతే వీటి భవిష్యత్తు స్పష్టమవుతుంది.
లక్ష ఎకరాలకు మరో భరోసా… మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం మొదటి దశ పనులు ఇప్పటికే కొనసాగుతున్నాయి. ఇప్పుడు రెండో దశ ద్వారా దాదాపు లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరందించాలన్నది ప్రతిపాదన. ఈ రెండో దశకు సుమారు రూ.2,100 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాంతాల్లోని వేలాది ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా, మార్గంలోని గ్రామాలకు తాగునీటి సదుపాయం కల్పించే ఉద్దేశం కూడా ఇందులో ఉంది. ఈ పథకానికి జూరాల నుంచి నీటిని వినియోగించుకుని మూడు దశల్లో ఎత్తిపోతల చేయాలని ప్రతిపాదించారు.
మొదటి దశలో చేపట్టిన పనుల్లో డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలు పూర్తిగా లేకపోవడంతో, ఇప్పుడు వాటిని కూడా చేపట్టాల్సి ఉంది. రెండో దశలో భూసేకరణకే భారీగా నిధులు అవసరం కానున్నాయి. మొత్తంగా ఈ పథకం వ్యయం రూ.6,825 కోట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేసినట్లు సమాచారం.
గట్టు రిజర్వాయర్.. చిన్నదిగా ఎందుకు ఉండాలి? … ఇక గట్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచే ప్రతిపాదన మరో కీలక అంశం. మొదట తక్కువ సామర్థ్యంతో ప్రతిపాదించిన ఈ రిజర్వాయర్ను ఇప్పుడు మూడు టీఎంసీల సామర్థ్యానికి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
2018లో సుమారు 0.78 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించి 33 వేల ఎకరాలకు నీరందించేలా రూ.558 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చారు. అనంతరం మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే రిజర్వాయర్ పనులు, భూసేకరణపై వందల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. అయితే కృష్ణా జలాలను మరింత సమర్థంగా వినియోగించుకోవాలంటే రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
గుడెందొడ్డి.. పాలమూరుకు మరో భారీ జలకళ … ఈ మూడు ప్రతిపాదనల్లో అన్నింటికంటే భారీది గుడెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచే ప్రణాళిక. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన గుడెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని భారీగా పెంచి 15 టీఎంసీలకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది కేవలం సాగునీటి రిజర్వాయర్గా మాత్రమే కాకుండా భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తికి కూడా ఉపయోగపడేలా ప్రణాళిక రూపొందుతోంది.
పంప్డ్ స్టోరేజీ విధానంలో విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా నీటిని ఒకసారి వినియోగించుకోవడంతో ఆగిపోకుండా, విద్యుత్ అవసరాలకు అనుగుణంగా నీటిని పైకి ఎత్తి మళ్లీ కిందకు పంపుతూ విద్యుదుత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 180 నుంచి 250 మెగావాట్ల వరకు విద్యుదుత్పత్తి చేసే అవకాశం ఉందని అంచనా.
సాగునీటి ప్రాజెక్టా? విద్యుత్ ప్రాజెక్టా? పాలమూరు ప్రాంతానికి సంబంధించిన ఈ కొత్త ప్రతిపాదనల్లో ఆసక్తికరమైన అంశం ఇదే. ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం—నీటిని ఎత్తి పొలాలకు చేర్చడం. ఇప్పుడు ఆలోచన కొంత మారుతోంది.
కృష్ణా నీటిని నిల్వ చేయాలి.. సాగుకు ఉపయోగించాలి.. అదే సమయంలో ఆ నీటితో విద్యుత్ ఉత్పత్తి చేయాలి. అంటే నీటిని ఒకే ప్రయోజనానికి కాకుండా బహుళ ప్రయోజనాలకు ఉపయోగించుకునే ప్రయత్నం.
- దిక్కుమాలిన, కాలం చెల్లిన సీకెంట్ ఫైల్స్తో కాళేశ్వరం… అదే నాసిరకం సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పవర్ ప్లాంట్లు ఆలోచించిన కేసీయార్… పంప్డ్ స్టోరేజీ వంటి ఆధునిక ఆలోచనలు చేయలేడు, చేయడు, చేసేవాడిని చేయనివ్వడు… అదీ తెలంగాణ అసలు దురదృష్టం, ఆ పదేళ్ల పాలనకాలంలో..!!
రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టే ఈ మూడు ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే పాలమూరు సాగునీటి ముఖచిత్రంలో మరో పెద్ద మార్పు రావచ్చు. ముఖ్యంగా లక్ష ఎకరాలకు కొత్తగా నీరు, రిజర్వాయర్ల సామర్థ్య పెంపు, పంప్డ్ స్టోరేజీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి— ఇవన్నీ కలిస్తే ఇది కేవలం మరో సాగునీటి ప్యాకేజీ కాకుండా నీరు–సాగు–విద్యుత్ను కలిపిన సమగ్ర ప్రణాళికగా మారే అవకాశం ఉంది…
Share this Article