.
అశ్వత్థామ… మహాభారతంలో అమరుడైన ఆ యోధుడు ఇప్పుడు బాలీవుడ్కు మాత్రం అంతగా కలిసొచ్చినట్టు కనిపించడం లేదు.
ఒకప్పుడు విక్కీ కౌశల్తో తెరకెక్కాలని అనుకున్న ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ ఆగిపోయింది. ఇప్పుడు షాహిద్ కపూర్తో భారీ స్థాయిలో తీయాలనుకున్న ‘అశ్వత్థామ: ది సాగా కంటిన్యూస్’ కూడా తెరపైకి రాకముందే చీకట్లోకి వెళ్లిపోయింది. అంటే… సినిమాల్లోకి రావడానికి ప్రయత్నించిన ఇద్దరు అశ్వత్థామలు కూడా ప్రస్తుతానికి తెర వెనక్కే వెళ్లిపోయారు.
Ads
షాహిద్ సినిమా విషయంలో నిర్మాత జాకీ భగ్నాని తాజాగా చెప్పిన కారణాల్లో కల్కి 2898 ఏడీ కూడా ఒకటి. భారీ స్థాయి సినిమా తీస్తే సరిపోదని, అందులో ప్రేక్షకుడికి కొత్తదనం కనిపించాల్సిందేనని ఆయన చెప్పాడు. కల్కిలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా కనిపించిన తీరు తర్వాత అదే పాత్రను మరోసారి భారీ స్థాయిలో చూపించడం అంత సులభం కాదన్నది ఆలోచన.
కానీ ఇక్కడ అసలు కథ ఇంకొంచెం పెద్దదిగా కనిపిస్తోంది. అశ్వత్థామను కల్కి చంపలేదు… కల్కి తర్వాత అశ్వత్థామ సినిమాను తీయడానికి అయ్యే ఖర్చే భయపెట్టింది.
ఎందుకంటే షాహిద్ అశ్వత్థామ చిన్న సినిమా కాదు. మొదటినుంచీ రూ.500 కోట్లకు పైబడే స్థాయిలో ఒక గ్లోబల్ యాక్షన్ ఎపిక్గా దీన్ని ఊహించారు. పలు దేశాల్లో షూటింగ్, భారీ యాక్షన్, VFX… ఇవన్నీ కలిస్తే బడ్జెట్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతకు ఒకటే ప్రశ్న—ఇంత డబ్బు పెట్టి, ప్రేక్షకుడికి ఇప్పటికే అమితాబ్ బచ్చన్ రూపంలో ఒక అశ్వత్థామను చూపించిన తర్వాత, కొత్తగా ఏం అమ్మాలి?
కల్కి 2898 ఏడీలో అమితాబ్ అశ్వత్థామ కేవలం ఒక పాత్రగా రాలేదు. ఆ పాత్రకు ఒక కొత్త సినిమా ఇమేజ్ వచ్చింది. పురాణంలోని శాపగ్రస్త అమరుడిని భవిష్యత్తు ప్రపంచంలోకి తీసుకెళ్లి, భారీ VFXతో, ఒక లెజెండరీ స్టార్తో చూపించారు. ఆ పాత్ర ప్రేక్షకుల మైండ్లో కూర్చుంది.
అక్కడితో సమస్య మొదలైంది. షాహిద్ సినిమా కూడా భారీగా చేయాలి. చేస్తే కల్కితో పోలిక తప్పదు. తక్కువ స్థాయిలో చేస్తే “కల్కిలో చూసినదానికంటే ఏం కొత్త?” అనే ప్రశ్న వస్తుంది. మరింత భారీగా చేస్తే బడ్జెట్ అదుపు తప్పుతుంది.
ఇది చాలదన్నట్టు భారతీయ సినిమా ఇప్పుడు మరో భారీ పురాణ దశలోకి వెళ్తోంది. రెండు భాగాల ‘రామాయణం’ భారీ స్థాయిలో వస్తోంది. దాని స్కేల్, విజువల్ ఎఫెక్ట్స్, అంతర్జాతీయ మార్కెట్పై దృష్టి అన్నీ కలిపి అది ఒక ఈవెంట్ ఫిల్మ్గా తయారవుతోంది.
మరోవైపు రాజమౌళి ‘వారణాసి’ కూడా పురాణం, కాల ప్రయాణం, విజువల్ స్పెక్టకిల్ కలిసిన భారీ ప్రాజెక్ట్గా తయారవుతోంది. ఆ సినిమా కోసం కాశీని తలపించే సెట్లు, అంతర్జాతీయ లొకేషన్లు, రామాయణానికి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ వంటి వాటిపైనే భారీ స్థాయిలో పని జరిగింది.
అంటే ప్రేక్షకుడి ముందు వరుసగా భారీ సినిమాల క్యూ ఉంది.
కల్కి చూపించిన అశ్వత్థామ…
రామాయణం చూపించబోయే పురాణ ప్రపంచం…
వారణాసి చూపించబోయే విజువల్ స్పెక్టకల్…
ఈ మధ్యలో మరో రూ.500 కోట్ల అశ్వత్థామను నిలబెట్టడం నిర్మాతలకు ఎంత రిస్కో లెక్క వేయాల్సిందే. అందుకే బయటకు వినిపించే కారణం— “కల్కిలో అశ్వత్థామను అద్భుతంగా చూపించారు. ఇప్పుడు మేం కొత్తగా ఏం చూపించినా ప్రేక్షకుడికి పట్టదు.”
లోపల వినిపించే లెక్క మాత్రం బహుశా— “అదే స్థాయిలో చూపించాలంటే మళ్లీ వందల కోట్లు ఖర్చు పెట్టాలి. అదే సమయంలో ప్రేక్షకుడి ముందు ఇంకా పెద్ద పెద్ద పురాణ సినిమాలు ఉన్నాయి. మరి ఈ రిస్క్ ఎందుకు?”
అశ్వత్థామ పాత్రకు ఇంతటి దురదృష్టం ఇదే మొదటిసారి కాదు. విక్కీ కౌశల్తో ఆదిత్య ధర్ చేయాలనుకున్న The Immortal Ashwatthama కూడా భారీ VFX, బడ్జెట్ కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు షాహిద్ కపూర్ వంతు.
అంటే తెరపై అమరుడైన అశ్వత్థామ… సినిమా ప్రపంచంలో మాత్రం రెండుసార్లు చనిపోయినట్టే. ఒకసారి విక్కీ కౌశల్ రూపంలో. మరోసారి షాహిద్ కపూర్ రూపంలో. ఇద్దరి సినిమాలూ పూర్తి కాలేదు. కానీ ఇందులో విచిత్రం ఏమిటంటే… అశ్వత్థామను ఎవ్వరూ ఓడించలేదు. అతన్ని ఓడించింది బడ్జెట్.
మరింత విచిత్రంగా చెప్పాలంటే— కల్కిలో అశ్వత్థామ బతికిపోయాడు. బాలీవుడ్లో అశ్వత్థామ సినిమా మాత్రం బతకలేకపోయింది. ప్రస్తుతానికి ఇద్దరు అశ్వత్థామలు ఇక చీకట్లోనే…
Share this Article