.
అదుగో పులి- ఇదుగో తోక… రాజకీయాల్లో ఏ వ్యవహారమైనా ఇలాంటి కథనాలకు ఆస్కారమిస్తూనేే ఉంటాయి… రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి – తన అధికారిక విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాల్సింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం… కానీ తన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వలేదు, సో, ముందస్తు ప్లాన్ ప్రకారమే లండన్ పర్యటనను ముగించుకుని, హైదరాబాద్ వచ్చేస్తున్నాడు…
కానీ… దీనిపైనా అనుమానాలు, అపోహలు ముసురుకున్నాయి… నిజానికి రేవంత్ రెడ్డి వ్యక్తిగత పర్యటన అయితే ఏ అభ్యంతరాలూ ఉండవు… కానీ అక్కడ కొన్ని యూనివర్శిటీలతో చర్చలు, ఒప్పందాలు జరగాల్సి ఉన్నాయి… అది తెలంగాణ ప్రయోజనాల కోసమే, కానీ తన Itinerary సరిగ్గా ప్రిపేర్ చేయనట్టున్నారు అఫీషియల్స్…
Ads
మధ్యలో ఒకటీరెండు ప్రోగ్రామ్స్ గురించిన వివరాలు సరిగ్గా లేవు… ఐఓసీ ఆధ్వర్యంలో ఓ గెట్టుగెదర్ కూడా ఉన్నట్టుంది… సో, పక్కా దౌత్య కారణాలు, సందేహాలతో అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతించలేదని ప్రాథమిక సమాచారం… కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కూడా అదే చెప్పాడు…
“ముఖ్యమంత్రి పర్యటనలు, అలాగే ఇతర ప్రముఖుల పర్యటనలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుంది. రాజకీయ అనుమతి (Political Clearance) పొందేందుకు, ప్రతిపాదిత పర్యటన ఏ కార్యాలయం/ హోదాకు సంబంధించినదో, అలాగే పర్యటన ఉద్దేశం ఏమిటో స్పష్టంగా ఉండాలి. ఈ ప్రత్యేక సందర్భంలో, అమెరికా పర్యటనకు సంబంధించి ఆ వివరాలు తగిన విధంగా లేవు. అందువల్ల అమెరికాలో పర్యటించేందుకు రేవంత్ రెడ్డికి అనుమతి ఇవ్వలేదు. ఇదే సమయంలో.. యునైటెడ్ కింగ్డమ్ (UK) పర్యటనకు మాత్రం అనుమతి ఉంది” అన్నాడు…
క్లియర్… లండన్ పర్యటన కారణం ఎంఐఎం నేత అక్బరుద్దీన్ బిడ్డ కనీజ్ ఫాతిమా ఒవైసీ పెళ్లి… ప్యూర్లీ పర్సనల్… దీనికి హరీష్ రావు కూడా హాజరు… కానీ అమెరికా పర్యటనపై ఇంత స్పష్టత లేదు… దాంతో దౌత్య పరమైన సందేహాలతోనే అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదు… ఇదేమీ కొత్త కాదు…
(రాహుల్ గాంధీ చీటికీమాటికీ చీమ చిటుక్కుమన్నా విదేశాలకు చెక్కేస్తుంటాడు రోజుల తరబడీ, అక్కడ ఏవేవో పొలిటికల్ కామెంట్లు కూడా చేస్తుంటాడు… కానీ ఎప్పుడూ కేంద్రం ఆ పర్యటనల్ని అడ్డుకోలేదు, అవి తన పర్సనల్ టూర్స్ కాబట్టి…)
2012 లో యూపీఏ హయాంలో అసోం సీఎం గా ఉన్న తరుణ్ గొగోయ్ (నాటి కాంగ్రెస్ సీఎం) కూడా అమెరికా, ఇజ్రాయెల్ పర్యటనకు అనుమతి ఇవ్వలేదు… ఝార్ఖండ్ సీఎంగా ఉన్న అర్జున్ మొండా (బీజేపీ) కు కూడా ధాయ్ లాండ్కు అనుమతి ఇవ్వలేదు. 2019లో ఢిల్లీ సీఎంగా ఉన్న అర్వింద్ కేజ్రీవాల్ కు కూడా … నిజానికి రేవంత్ రెడ్డి కూడా హుందాగా దాన్ని యాక్సెప్ట్ చేశాడు… దీన్ని ఓ ఇష్యూ చేయలేదు… తిరిగి వస్తున్నాడు…
వికసిత్ భారత్, ‘తెలంగాణ రైజింగ్’ (Telangana Rising) లక్ష్యంగా పెట్టుకున్న ఈ పర్యటనకు రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించడం తనను ఆశ్చర్యానికి గురిచేసింది అని ముక్తసరిగా చెప్పాడు, తాను వెళ్లకపోయినా మీరు వెళ్లి యూనివర్శిటీలతో సంప్రదింపులు జరపండి అని అధికారులను ఆదేశించాడు…
కేంద్రంతో రేవంత్ రెడ్డికి పెద్ద ఘర్షణ లేదు… ప్రభుత్వాలు వేరు- పార్టీల పోరాటాలు వేరు అంటూ తను స్పష్టమైన విభజన రేఖ గీసుకునే వ్యవహరిస్తున్నాడు… హార్వర్డ్ (Harvard), మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT), నార్త్-ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో అగ్రిమెంట్లు, ఎంఓయూలు (MoUs) కుదరనున్నాయి…
కొందరైతే ఇంకా ముందుకు వెళ్లిపోయి… అసలే ఇది ఆగస్టు (అప్పట్లో ఎన్టీయార్కు పదవీగండం అయితే ఇక ఆగస్టు నెలంతా దుర్మాసమేనా..?) ఇక్కడ కొండా సురేఖ యవ్వారం, అసమ్మతి ఎమ్మెల్యేల భేటీ, ఇక ఇప్పుడో, మరో గంటకో రేవంత్ రెడ్డిని తీసేస్తారన్నట్టుగా వార్తలు రాసిపారేశారు…
నిజానికి రేవంత్ రెడ్డి ఈ సమయంలో హైదరాబాదులోనే ఉండటం బెటర్… కొరడా పట్టుకోవడం బెటర్… ఏమాత్రం ఉపేక్షించకుండా ఒకరిద్దరిపై వేటు వేయడం బెటర్… ఈ పర్యటన రద్దుతో ఆ చర్యలు వెంటనే ప్రారంభమైతే మరీ మరీ బెటర్… అన్నీ ఒకందుకు మంచిదే..!!
Share this Article