.
ఉండవల్లి ఓటమి! ‘మార్గదర్శి’ కథకు తెర! శాంతించిన రామోజీ ఆత్మ..!! ఇదొక్కటే కాదు, చివరి రోజుల్లో రామోజీరావును వేధించిన, పీడించిన ‘గ్రహచారం’ తన మరణం తరువాత గానీ, ఇన్నేళ్లకు గానీ ‘క్లోజ్’ అయిపోలేదు…
కొన్ని పోరాటాలు గెలుపోటములతో ముగుస్తాయి. కొన్ని పోరాటాలు పోరాడిన మనుషులు లేకపోవడంతో ముగుస్తాయి. మరికొన్ని పోరాటాల్ని… కాలమే ముగించేస్తుంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో ఉండవల్లి అరుణ్కుమార్ సాగించిన సుదీర్ఘ న్యాయపోరాటాన్ని చూస్తే ఇప్పుడు మూడో రకమే కనిపిస్తోంది.
Ads
దశాబ్దాలుగా రామోజీరావు సామ్రాజ్యానికి ఎదురుగా నిలిచిన ఉండవల్లి… చివరకు సుప్రీంకోర్టు గడప దగ్గర కూడా ఆగిపోతే, ఈ సమయానికి ఆ రామోజీరావు మాత్రం ఈ లోకంలోనే లేడు. కానీ ఆయన ఆత్మ తేలికగా ఊపిరి పీల్చుకుంటోంది… ఈ మబ్బులు- ఈ చీకట్లన్నీ తొలగిపోయి!!
ఆ పత్రిక ఆర్థిక మూలాల్ని పెకిలించే వైఎస్ మార్క్ ఆలోచన నుంచి పుట్టిన న్యాయపోరాటం ఇది… మొదట్లో ఉండవల్లి తనూ ఓ బాధితుడిగా చెబుతూ పోరాటం ఆరంభించి ఉండొచ్చుగాక… కానీ ఆ వైఎస్ లేడు, ఆ రోజులు వేరు… చివరకు ఉండవల్లి ఒంటరి పోరాటం అయిపోయింది… ఇదొక ప్రజాప్రయోజన వ్యాజ్యం అయిపోయింది…

కానీ ఈ డిపాజిట్ల కథలో బాధితులు లేరు, ఎవరూ రామోజీరావు తమకు అన్యాయం చేశాడని, డబ్బు ఎగ్గొట్టాడని అనలేదు, పైగా తనను గట్టిగా నమ్మారు కూడా… ఈ డిపాజిట్ల సేకరణ చట్టబద్ధమా కాదా అనేదే కేసు… రకరకాల దశలు, విచారణలు దాటాక ఇప్పుడు ఇక ఈ కేసు తలుపుల్ని సుప్రీంకోర్టు మూసేసింది…
ఉండవల్లి సత్వర స్పందన తెలియలేదు గానీ, తను మరింత ఉన్నత స్థాయికి కేసును తీసుకుపోయినా, ఇంతకు భిన్నమైన తీర్పు రాకపోవచ్చు… ఒంటరిగా పోరాడుతున్న ఉండవల్లికి పైస్థాయిలో మరో తలుపు తెరుచుకుంటుందని ఆశించడం కూడా కష్టం. రెండు తెలుగు ప్రభుత్వాలకు కూడా ఈ కేసుపై ఆసక్తి లేదు…

ఈ కేసు ఒక్కటే కాదు… తనపై జగన్ మార్గదర్శి చిట్ఫండ్ కేసులు పెట్టించాడు, రామోజీ ఆర్థిక సామ్రాజ్యంలో దానిదే ప్రధాన పాత్ర… ఒక దశలో రామోజీరావును అరెస్టు చేసి, ఏపీ జైలులో పెట్టాలని కూడా అనుకున్నాడు… కానీ కేన్సర్ పీడితుడిగా ఉన్న తనను లిఫ్ట్ చేయడానికి కేసీయార్ అనుమతించలేదని ఓసారి కేటీయార్ చెప్పాడు కూడా..!

జగన్ అధికారం కోల్పోయాడు, లోకల్గా పెట్టబడిన కేసుల నుంచి చంద్రబాబు మార్గదర్శి చిట్స్ను విముక్తం చేస్తున్నాడు… ఈలోపు రామోజీరావే ప్రాణాలు వదిలాడు, ఈ లోకమే వదిలేసి పోయాడు… సో, జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చినా ఇక సాధించిందేమీ ఉండదు… ఇదే కాదు… రామోజీ ఫిలిమ్ సిటీ భూముల వ్యవహారమూ అంతే…

ఏపీలో ఎలాగూ కూటమి ప్రభుత్వం, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆ కేసుపై ఇంట్రస్టు లేదు… సో, ఆ మబ్బులు కూడా తొలగిపోయినట్టే… ఏపీలో మళ్లీ జగన్ ప్రభుత్వం వచ్చినా తెలంగాణలోని ఫిలిమ్ సిటీ మీద తను చేయగలిగిందేమీ ఉండదు…

సో, ముఖ్యమైన ఈ కేసుల చీకట్లు, మబ్బులు ఇక మొత్తం తొలగిపోయినట్టే… అదీ ఆయన మరణించాక ఇన్నాళ్లకు… నిజానికి రామోజీరావు కాబట్టి తట్టుకున్నాడు, ఎన్ని అవస్థలు ఎదురైనా సరే… అందుకే చెబుతోంది… రామోజీరావు ఆత్మ ఇప్పుడు తేలికగా ఊపిరి తీసుకుంటున్నది… స్వేచ్ఛగా, అన్ని చీకట్లు చెదిరిపోయి..!!
ఒకటీరెండు తరాల తెలుగు రాజకీయాల్ని శాసించిన తను కూడా విధివశాత్తూ చివరి రోజుల్లో తీవ్ర మానసిక వేదనకు, ఆందోళనకు, భయానికి గురయ్యాడు… చివరకు ఇప్పుడు అసలైన విముక్తిని పొందాడు… అది డెస్టినీ..!!

Share this Article