.
మొన్న ఏదో పత్రికలో వచ్చింది… ఆసక్తికరమైన వార్తే… కేటీయార్ మెడపై మరో కత్తి వేలాడదీసే ప్రయత్నం ఏదైనా జరుగుతోందా..? రేవంత్ రెడ్డి పాత గ్లోబరీనా సమాధిని పెకిలిస్తున్నాడా..? ఎందుకంటే, దీనికి సందర్భం ఉంది… వివరాల్లోకి వెళ్దాం…
జెన్జీ – కాక్రోచ్ పార్టీ ఆందోళనలు – నీట్ మీద ఉద్యమం – చివరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా… సదరు మంత్రికే మరో మరక – సీబీఎస్ఈ మూల్యాంకనంలో తప్పులకుప్పలు – బదనాం – దానికి బాధ్యత కోఎంప్ట్ ఎడ్యుటెక్ – అది గతంలో గ్లోబరీనా – 23 మంది ఇంటర్ పిల్లల ఉసురు తీసిన కంపెనీ…
Ads
ఎస్, అదుగో ఆ పాత బాగోతాన్ని తవ్వుతోంది తెలంగాణ ప్రభుత్వం మళ్లీ… సదరు గ్లోబరీనా కేటీయార్ బినామీ కంపెనీ అంటూ కాంగ్రెస్ పదే పదే ఆరోపిస్తోంది… కాదని కేటీయార్ ఖండిస్తూనే ఉన్నాడు… ఓ లీగల్ నోటీసు కూడా పంపించాడు… ఇలా గ్లోబరీనా అలియాస్ కోఎంప్ట్ చుట్టూ రాజకీయ రచ్చ ఆవరించుకుని ఉంది… అందుకే పాత గ్లోబరీనా బాగోతాల్ని తవ్వడానికి ప్రాధాన్యం ఉన్నట్టే లెక్క!
మొన్న కనిపించిన వార్త సారాంశం ఏమిటంటే..? ‘‘రాష్ట్రంలో 2019 ఇంటర్మీడియట్ ఫలితాల ప్రాసెసింగ్ టెండర్ దక్కించుకున్న గ్లోబరీనా కంపెనీపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ ప్రారంభమైంది… విజిలెన్స్ అధికారుల బృందం బుధవారం మధ్యాహ్నం ఇంటర్ బోర్డు కార్యాలయానికి చేరుకుంది… 2019లో బోర్డు కార్యదర్శిగా పనిచేసిన అశోక్ను బోర్డు కార్యాలయానికి పిలిచి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి నాలుగు గంటలపాటు విచారించారు…
ఫలితాల ప్రాసెసింగ్ కోసం… గతంలో ప్రీ-ఎగ్జామ్స్కు ఒకటి… పోస్ట్ ఎగ్జామ్స్కు మరో సంస్థ ఉండేది.. దాన్ని ఇంటిగ్రేట్ చేయాలన్న నిర్ణయం ఎవరిది అని ప్రశ్నించగా… కన్సల్టెంట్ల సూచన మేరకు తాము ప్రతిపాదించినట్లు అశోక్ సమాధానమిచ్చినట్లు తెలిసింది… రెండుసార్లు ఎందుకు టెండర్లు పిలిచారని ప్రశ్నించగా… . తొలుత ఏ సంస్థలూ ముందుకు రాలేదని చెప్పినట్లు సమాచారం… కొన్ని నిబంధనలు మార్చడంపై ప్రశ్నలడిగినట్లు సమాచారం…
అన్నీ చెప్పలేమని… కొన్నింటిని విశ్వసించి, పనిచేయాల్సి ఉంటుందని ఆయన చెప్పినట్లు తెలిసింది… గ్లోబరీనా సంస్థ (ప్రస్తుతం దాని పేరు కోఎంప్ట్) కేటీఆర్ బినామీ సంస్థ అని, మీకు సంబంధం లేకపోతే సీసీఎస్లో ఫిర్యాదు చేయాలని, నిజాలను నిగ్గు తేలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జులై 24న మీడియా చిట్చాట్లో కేటీయార్కు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే…
ఆ సంస్థ అవకతవకల కారణంగానే 23 మంది విద్యార్థులు మృతి చెందిన మాట వాస్తవం కాదా అని సీఎం ప్రశ్నించాడు ఆ మీడియా ఇష్టాగోష్టి భేటీలో… ఆ సంస్థ బండారం త్వరలోనే బయట పెడతామని, విజిలెన్స్ విచారణ జరుగుతుందని సీఎం వెల్లడించాడు కూడా… అది ప్రారంభమైంది…
ఈ క్రమంలోనే కొద్ది రోజుల నుంచి విజిలెన్స్ అధికారులు… 2018లో టెండర్లు పిలవడం, రూ.4.57 కోట్ల పైచిలుకు మొత్తానికి గ్లోబరీనాకు టెండరు దక్కడం, 2019 మార్చి ఇంటర్ ఫలితాల ప్రాసెసింగ్ను ఆ సంస్థ చేపట్టడం తదితరాంశాలపై కూలంకష సమాచారం ఆరా తీస్తూ వచ్చారు… తాజాగా ప్రత్యక్షంగా రంగంలోకి దిగి… ఇంటర్ బోర్డులోనే అశోక్ను ప్రశ్నించారు…
సో, ఈ తవ్వకాల్ని రేవంత్ రెడ్డి ఎటు తీసుకుపోతాడో చూడాల్సి ఉంది… గ్లోబరీనా బాగోతాలు ఎన్ని బయటపడతాయో కూడా చూడాలి… ఎందుకంటే..? ఈ కంపెనీ నిర్వాకాల్ని ముందుపెట్టి అటు బీజేపీ (ధర్మేంద్ర ప్రధాన్), ఇటు బీఆర్ఎస్ (కేటీయార్) పార్టీలను కార్నర్ చేసే వీలుంది కాబట్టి..
Share this Article