.
అసలే ఏదీ లేకుండానే గాలి నుంచి టన్నుల కొద్దీ బురదను సృష్టించి, నేపాల్ వరదలాగా పారించే బీఆర్ఎస్ ఒకవైపు ఉన్నప్పుడు… అధికారం కోల్పోయి ఆబగా, ఆత్రంగా, అగడు పడ్డట్టున్న బీఆర్ఎస్ దేనికైనా తెగించగలదు… కోట్లకుకోట్ల ఖర్చుతో ఆ సోషల్ మీడియా ప్రాపగాండా విషవ్యాప్తి చూస్తున్నదే…
కానీ ఈ స్థితిలో కాంగ్రెస్ ఏం చేస్తోంది… చేష్టలుడిగి చూస్తోంది… టీపీసీసీకి ఎలాగూ ఏ సోయీ లేదు… చేతులెత్తేసింది… మరి రేవంత్ రెడ్డి స్వయంగా సీఎం కదా, తను రాజకీయాల్లో బిజీగా ఉంటే ఉండవచ్చుగాక… పరిపాలనలో మంచి సలహాదారులు ఏరి..? అన్నీ చేజేతులా చెడగొట్టుకుంటున్న అంశాలే…
Ads
1) మంచి చేసినా చెప్పుకోలేని వైఫల్యం 2) బీఆర్ఎస్, బీజేపీలను కౌంటర్ చేయలేని టీమ్ 3) కొన్ని చక్కదిద్దుకునే అంశాలనూ పట్టించుకోని నిర్లక్ష్యం 4) కొన్ని ప్రతిపక్షాలకు చేజేతులా అందించడం… అరగయ కర్ణుడీల్గె అన్నట్టుంది… రేవంత్ రెడ్డి ఇదంతా చదవాలనే కోరుకుందాం…
కొండా సురేఖ, చిన్నారెడ్డి, రాజగోపాలరెడ్డి, అనిరుధ్ రెడ్డి వ్యవహారం పార్టీ మీద జనంలోకి నెగెటివ్ సంకేతాలు వెళ్లిపోయాయి, అఫ్కోర్స్, ఇది సీఎం తప్పు కాదు, కంప్లీటుగా హైకమాండ్ తప్పు… అంతా హరాకిరీ ధోరణి ఇది… ఇంకేం, రేప్పొద్దున ప్రతి ఒక్కడూ సీఎంను టార్గెట్ చేసి స్వేచ్ఛగా మాట్లాడతాడు…
ఎథిక్స్ కమిటీ భేటీ పెట్టి, కనీసం ఆ కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేయలేకపోవడం ఎవరి వైఫల్యం..? గతంలో బీఆర్ఎస్ ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేదా..? మరోవైపు కాంగ్రెస్లోకి వచ్చినవాళ్లూ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు, దానం, మహిపాల్, పోచారం ఎట్సెట్రా… కక్కలేక మింగలేక పీసీసీ…
పాలనకు వద్దాం… రైతు బీమా విషయంలో అట్టర్ ఫ్లాప్… జనంలోకి నెగెటివ్గా వెళ్లిపోయింది బలంగా, అసలే యూరియా యాప్ దారుణంగా నెగెటివ్ ఇమేజ్ తీసుకొచ్చింది… రేవంత్ ఓ మంచి పనిచేయాలని అనుకున్నాడు… రైతులే కాదు, కౌలు రైతులు, కూలీలు, వ్యవసాయ అనుబంధ వృత్తులవాళ్లు, ఇతరులు అందరూ బీమా పరిధిలోకి వచ్చే ఇందిరమ్మ బీమా పథకం ప్రతిపాదించాడు, బడ్జెట్లో పెట్టాడు…
కానీ ఎక్కడేసిన గొంగళి అక్కడే… ఈలోపు రైతు బీమా ప్రీమియం గడువు ముగిసింది… ఎవరి తప్పు..? 22ఏ మరో బీభత్సమైన వైఫల్యం… నిజానికి బీఆర్ఎస్ హయాంలో కబ్జాలకు అనువుగా, సెటిల్మెంట్లకు అనుగుణంగా కొన్ని సర్వే నెంబర్లను నిషేధజాబితాలో పెట్టారు, దాన్ని దిద్దాల్సింది పోయి కొత్త సర్వే నెంబర్లు పెట్టేసి ఉన్నతాధికారులు కంపు కంపు, పెంట పెంట చేశారు…
యాడ్ చేసినవి మొత్తం డిలిట్ కొట్టేసి, పాతవి అలాగే ఉంచేస్తే జనంలో వ్యతిరేకత ఉండేది కాదు… ఈ పని చేయలేక, అధికారులతో చేయించలేక పొంగులేటి ఫెయిల్యూర్ ఇది… రావల్సినంత నెగెటివిటీ, డ్యామేజీ వచ్చేసింది… పాలిటెక్నిక్ సంగతీ అంతే… పేరుకు స్కిల్ యూనివర్శిటీ పెట్టారు, దానికి ఈ పాలిటెక్నిక్కులు, ఐటీఐలు జత చేశారు… జీవో 97… లేటరల్ ఎంట్రీలు, సర్వీస్ మ్యాటర్ల మీద నచ్చజెప్పే కసరత్తు జరగలేదు…
ఫీజు రీయింబర్స్మెంట్ పద్ధతి మార్చారు, అడ్వాన్సుగా చెల్లిస్తున్నారు… పాత బకాయిలపై పోరాటం అటుంచి, కనీసం ఈ కొత్త పద్ధతి విద్యార్థులకు- కాలేజీలకు ఎందుకు మంచిదో చెప్పుకున్నవారేరీ..? లీస్ట్ క్యాంపెయిన్, లీస్ట్ కౌంటర్ సిస్టమ్…
అసలు ఆ యూనివర్శిటీకే దిక్కూదివాణం లేదు… దాని బాధ్యతలు ఎవరు చూస్తున్నారో కనీసం ఆ శాఖ చూసే సీఎంకు, ఆ ప్రిన్సిపల్ సెక్రెటరీకైనా తెలుసా అసలు..? సీఎంఓలో ఎవరు చూస్తున్నారో తెలియదు… సేమ్, హిల్ట్… మంచి పని, ముందుకు సాగడం లేదు… మెట్రో, ఫ్యూచర్ సిటీ, ఆర్ఆర్ఆర్, మూసీ అడుగు కదలడం లేదు… ఇలా చెబుతూ పోతే ఎన్నో… సీఎంకు ఎవరూ చెప్పేవారు లేరు, చెప్పినా వింటాడో లేదో తెలియదు…
బనకచర్ల, జలవివాదాలు సహా ప్రతి చిన్న అంశాన్నీ బీఆర్ఎస్ అందుకుంటోంది, కేటీయార్కు పెద్దగా సబ్జెక్టు తెలియదు కానీ హరీష్ రావు పట్టేసుకుంటున్నాడు, ప్రతిదీ గాయిగత్తర చేయాలని చూస్తున్నాడు… ఒకవైపు సన్నబియ్యం, ఫ్రీ బస్సు, ఫ్రీ 200 యూనిట్ల కరెంటు, సబ్సిడీ సిలిండర్, పెంచిన పెన్షన్లు, దాన్యం కొనుగోళ్లు, రైతు భరోసా… ఏదీ ఆగడం లేదు…
ఒకటి చేసే మంచి చెప్పుకోలేరు – చెడు ప్రచారం కౌంటర్ చేయలేరు – ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయలేరు… రేవంత్ రెడ్డి పార్టీలోని అసంతృప్తుల గురించే కాదు, ఈ విషయాలపైనా సీరియస్ లుక్కేయాల్సిందే… తను మళ్లీ సీఎం కావాలంటే, ఇప్పట్నుంచే ఓ కార్యాచరణ, కసరత్తు ఆరంభం కావాలి… కానీ తనకు ఎవరు చెప్పాలి..? సమాధానం లేని అసలు ప్రశ్న ఇదే !!
Share this Article