.
నిన్న నమస్తే తెలంగాణలో ఓ వార్త… 72 వేల మందికి పీఆర్సీ కట్? … ఏదో ద్రోహం జరగబోతోంది అన్నట్టు సాగే ఆ కథనాల గురించి తెలిసిందే కదా… కానీ వెంటనే అడ్వొకేట్ మిత్రుడు మానేటి ప్రతాపరెడ్డి వివరణ కనిపించింది… అది అనవసర ప్రచారానికి తెరదించేలా ఉంది… చదవండి…
అపోహలు వద్దు.. పీఆర్సీ స్కేళ్లు అందరికీ వర్తిస్తాయి! కొత్త పీఆర్సీ అమలు నాటికి ఉద్యోగంలో ఉన్న ప్రతి ఒక్కరికీ…. 2024 డీఎస్సీ ఉపాధ్యాయులు సహా అందరికీ కొత్త వేతన స్కేళ్లు వర్తిస్తాయి… “మాకు పీఆర్సీ వర్తించదట కదా?” అంటూ పలువురు ఉద్యోగులు, 2024 డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు, messages పంపిస్తూ వ్యక్తం చేస్తున్న సందేహం ఇది.
Ads
అయితే ఇలాంటి ప్రచారాల వల్ల ఉద్యోగుల్లో అనవసరమైన ఆందోళన నెలకొంటోంది. వాస్తవానికి పీఆర్సీ అమలుకు సంబంధించి ఈ తరహా అపోహలకు ఎలాంటి ఆధారం లేదు. ముందుగా ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి.
కొత్త పీఆర్సీ అమలు సమయంలో ఉద్యోగంలో ఉన్న ప్రతి ఉద్యోగికీ, ఉపాధ్యాయుడికీ కొత్త పీఆర్సీ వేతన స్కేలు వర్తిస్తుంది. ఒక్క ఉద్యోగి కూడా పాత పీఆర్సీ స్కేలులోనే కొనసాగిపోరు. ఆ మాటకు వస్తే భవిష్యత్తులో కొలువులో చేరే వారికి సైతం కొత్త పీఆర్సీ పే స్కేల్సే అమలు చేస్తారు. కాబట్టి “కొంతమందికి పీఆర్సీ వర్తించదు” అంటూ జరుగుతున్న ప్రచారం, వస్తున్న వార్తలను, messagesని ఉద్యోగులు నమ్మాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు.

2023 జూలై 1వ తేదీకి ముందు ఉద్యోగంలో ఉన్న వారికి పీఆర్సీ నిబంధనల ప్రకారం ప్రస్తుత వేతనాన్ని కొత్త పీఆర్సీ వేతన స్కేల్లో స్థిరీకరించే ప్రక్రియ ఉంటుంది. 2023 జూలై 1 తర్వాత కొత్తగా నియమితులైన ఉద్యోగ, ఉపాధ్యాయుల విషయంలో వేతన స్థిరీకరణ లేకుండానే నేరుగా కొత్త పీఆర్సీలోని స్కేల్ మంజూరు చేస్తారు.
ఫిక్సేషన్ చేయాల్సిన పరిస్థితి లేనంత మాత్రాన కొత్త పీఆర్సీ స్కేలు వారికి వర్తించదని చెప్పడం కరెక్టు కాదు. కొత్త పీఆర్సీ అమలయ్యే నాటికి ఉద్యోగంలో ఉన్నవారందరూ కొత్త వేతన స్కేల్లోకి రావడం అనేది పీఆర్సీ వ్యవస్థలోని సాధారణ సూత్రం. ఎవరో ఒక వర్గాన్ని పీఆర్సీ పరిధి నుంచి పూర్తిగా బయట పెట్టి, వారిని జీవితాంతం పాత పీఆర్సీ స్కేలులోనే కొనసాగించే పరిస్థితి ఉండనే ఉండదు.
అందువల్ల ప్రస్తుతం సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు లేదా ఇతర వేదికల్లో “కొత్తగా నియమితులైన వారికి పీఆర్సీ వర్తించదు”, “2024 డీఎస్సీ ఉపాధ్యాయులకు పీఆర్సీ ఉండదు” అంటూ వస్తున్న messages చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
పీఆర్సీ స్కేలు వర్తింపుపై అనవసరమైన అపోహలకు తావివ్వకండి. వేతన స్థిరీకరణ విధానం వేరు కావచ్చు.. కానీ పీఆర్సీ స్కేలు ఈ రోజు ఉద్యోగంలో ఉన్న వారందరికీ వర్తిస్తుంది. భవిష్యత్తులో ఉద్యోగాల్లో చేరే వారికి సైతం కొత్త పీఆర్సీ పే స్కేల్స్ వంద శాతం వర్తిస్తాయి. ఇదీ వాస్తవం! – మానేటి ప్రతాపరెడ్డి.
Share this Article