.
మీనాక్షి నటరాజన్… అంతకుముందు ఏమో గానీ, తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా వచ్చినప్పటి నుంచీ ఓ సందేహాస్పద కేరక్టర్గానే కనిపిస్తోంది… ఆమె ఏం చేసినా ఎఐసీసీ ఎందుకంత ఉదాసీనంగా ఉంటున్నదో, ఎందుకంత స్వేచ్ఛనిస్తున్నదో తెలియదు…
నేనే హైకమాండ్, హైకమాండ్ అంటే నేనే అనే తరహా ధోరణితో ఆమె చాలామందిని దూరం చేసుకుంది… ప్రత్యేకించి ఆమె తెలంగాణలో పాదయాత్ర చేయడం పార్టీ శ్రేణులను కూడా నివ్వెరపరిచింది… స్వరాష్ట్రంలో ఓ నాయకుడు లేదా నాయకురాలు పాదయాత్ర చేస్తే పాపులారిటీ పొందడం, పొలిటికల్ ఫాయిదాకు ప్రయత్నించడాన్ని అర్థం చేసుకోవచ్చు…
Ads
కానీ ఈమెకు తెలంగాణలో పార్టీకి భిన్నంగా వ్యక్తిగత పాపులారిటీ దేనికి..? ఎందుకు ప్రయత్నించాలి..? ఇక్కడ తనకు ఉన్న పొలిటికల్ యాస్పిరేషన్స్ ఏముంటాయి..? చివరకు ఆమె మీద వ్యతిరేకత ఎంత పెరిగిపోయిందీ అంటే… తెలంగాణలో ఆమె మీద నమోదైన రెండు కేసుల వివరాల్ని అడ్డుపెట్టి, బీజేపీ ఆమె రాజ్యసభ నామినేషన్ తిరస్కరింపజేయడానికి కూడా తెలంగాణ కాంగ్రెస్ నాయకులే సహకరించారట…
ఆమె పార్టీ వ్యవహారాల ఇన్చార్జి కదా, మరి ఆమెపై నమోదైన రెండు కేసులకు సంబంధించి, ప్రధాన ఫిర్యాదుదారు శ్రీలతతో మాట్లాడి, రాజీ లేదా సయోధ్య కుదిర్చేందుకు కూడా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడూ ప్రయత్నించలేదు… దీంతోనైనా మీనాక్షికి అర్థమై ఉండాల్సింది… తాను కేవలం ఓ పరిశీలకురాలినే తప్ప తనేమీ నిర్ణయాధికారి కాదు అని… కాంగ్రెస్ నాయకులెవరికీ ఆమెపై సదభిప్రాయం లేదని..!
నిజమే కదా… కాంగ్రెస్ పవర్లోకి రావడానికి ఎఐసీసీ ప్రయత్నం ఏమీ లేదు నిజానికి… రేవంత్ రెడ్డి దూకుడు, కేసీయార్ పాలన వైఫల్యాలతో జనంలో పెరిగిన తీవ్ర వ్యతిరేకతే కాంగ్రెస్ను పవర్లోకి తీసుకొచ్చింది… ఇప్పటికీ అంతే, రేవంత్ రెడ్డి కాడి కింద పడేస్తే మళ్లీ కాంగ్రెస్ సిట్యుయేషన్ పాత కథే…
మీనాక్షి నటరాజన్ లండన్ వెళ్తోంది ఉన్నత విద్య కోసం, సో, వేరే ఇన్చార్జిని నియమిస్తారనే వార్తలూ వచ్చాయి… రెండు కేసుల్లో ప్రధాన ఫిర్యాదుదారు శ్రీలత కేసులో వెనక్కి తగ్గడానికి ఏమాత్రం సుముఖంగా లేదు… మీనాక్షి పాస్పోర్ట్ జప్తు చేయాలని, ఆమె విదేశీ పర్యటనను అడ్డుకోవాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించింది…

క్రిమినల్ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి విదేశాలకు వెళితే న్యాయ ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని, ఆమె అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం ఉందని పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొంది… అందువల్ల దర్యాప్తు, న్యాయ విచారణ ముగిసేంత వరకు ఆమె ప్రయాణాన్ని అడ్డుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది…
ఇలా ఆ రెండు కేసులూ ‘నిను వీడని నీడను నేనే’ అన్నట్టుగా మీనాక్షిని వెంటాడుతూనే ఉన్నాయి… రాజ్యసభ నామినేషన్ దగ్గర నుంచి విదేశీ పర్యటనను అడ్డుకునేదాకా…! ఒకవైపు లండన్ వెళ్తోంది అంటూనే కాంగ్రెస్ ఆమెను పంజాబ్లో ఏవో బాధ్యతల్లో నియమించింది… మొత్తానికి మీనాక్షికి సంబంధించి అంతా అయోమయం, గందరగోళమే కనిపిస్తోంది…
Share this Article