.
ఏమో… నిజంగానే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకొచ్చినట్టు… తెలంగాణలో కూడా ఎన్డీయే కూటమి ఎంట్రీ మీద పొలిటికల్ సర్కిళ్లలో బాగా చర్చ జరుగుతూ ఉండొచ్చు… మనకే తెలియడం లేదేమో…
ఏపీలో విజయ దుందుభి మోగించారు కదా, ఇక తెలంగాణలో కూడా కూటమి జెండా పాతినట్టే అని కనీసం రాధాకృష్ణ భావనో, ఆశో, కల్పనో, సంకల్పమో… ఏదైనా కావచ్చు… కానీ నిజంగానే అది జరిగితే… ఓటమితో ఇల్లు దాటి బయటికి రాలేని నిస్పృహలో కూరుకుపోయిన కేసీయార్ నెత్తిన పాలు పోసినట్టే…
Ads
ప్లీజ్, ప్లీజ్, కాస్త త్వరగా రండిరా బాబూ అని సాక్షాత్తూ కేసీయార్ ఆహ్వానం పలుకుతాడు కేసీయార్, ఎందుకంటే అది తనకే అందివచ్చే మంచి అవకాశం కాబట్టి… ఎందుకంటే..? కాస్త సంక్షిప్తంగా…
చంద్రబాబు అండ్ హిజ్ పార్టీ తెలంగాణ వ్యతిరేకం అనే భావన తెలంగాణవ్యాప్తంగా బలంగా ఉంది… అటు సమైక్య ఉద్యమాలకు వెన్నుదన్నుగా ఉంటూ, ఇటు తెలంగాణకు సానుకూల లేఖ ఇచ్చి, డబుల్ గేమ్ ఆడిన, కొబ్బరి చిప్పల సిద్ధాంతకర్త తను…
దాన్ని బలంగా ఎక్స్పోజ్ చేసి, తెలుగుదేశాన్ని వోటుకునోటు కేసుతో తెలంగాణ పొలిమేరల్ని దాటించడం మాత్రం కేసీయార్ ఘనతే… ఆ దెబ్బకు తెలంగాణలో తెలుగుదేశం దుకాణం ఖాళీ… ఎప్పుడైనా సరే, తన సర్కారుకు మొదటి థ్రెట్ తెలుగుదేశమే అని కేసీయార్ బలంగా నమ్మాడు, అందుకే తరిమాడు…
2018లో నిజానికి కేసీయార్ మీద వ్యతిరేకత ఉంది, అప్పుడే ఓడిపోవాల్సింది… కానీ చంద్రబాబు ఎప్పుడైతే కాంగ్రెస్తో జతకట్టి ప్రజాకూటమిగా దొంగమార్గంలో తెలంగాణలోకి రావాలనుకున్నాడో అప్పుడే కేసీయార్కు చాన్స్ దొరికింది… మళ్లీ తెలంగాణ సమాజం ఈసారి చంద్రబాబునే కాదు, తనతో అనైతిక పొత్తు (అసలు టీడీపీ పుట్టుకే కాంగ్రెస్ వ్యతిరేకత నుంచి కదా) పెట్టుకున్న కాంగ్రెస్ను కూడా తిరస్కరించింది…
ఆ తరువాత కేసీయార్ పాలన వైఫల్యాలు, లోపాలు, తప్పులు, పొరపాట్లతో జనంలో వ్యతిరేకత పెరిగి… కేవలం ఆ కారణంగా మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది… తెలుగుదేశంతో తెగతెంపులు కూడా దానికి ఉపయోగపడింది… తనను తాను ప్రక్షాళన చేసుకుంది…
గతంలో వెంకయ్యనాయుడు పుణ్యమాని తెలుగుదేశం పార్టీకి అనేక ఎన్నికల్లో జస్ట్, తోకపార్టీగా ఉండిపోయి, బలహీనపడిన బీజేపీ ఇప్పుడిప్పుడే తలెత్తుకుని, కొత్త జోష్తో తెలంగాణలో జలం పుంజుకుంటోంది… మళ్లీ ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్తో కలిసి కూటమిగా ఎంట్రీ ఇస్తే… కేసీయార్కే నయం అంటున్నది అందుకే…
చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకత తెలిసిందే… సెటిలర్స్, ఆయన సామాజికవర్గం కూడా ఇప్పుడు ఆయనతో లేదు తెలంగాణలో… ఇక తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజులు నిద్రాహారాలు మాని చింతించిన పవన్ కల్యాణ్ సంగతి తెలంగాణ సమాజానికి తెలిసిందే… పైగా తన కాపు వర్గం అధికంగా ఇప్పుడు బీజేపీతో ర్యాలీ అవుతోంది… (ధర్మపురి, బండి, లక్ష్మణ్ తదితరులంతా అదే…)
పైగా కూటమిగా వస్తే మళ్లీ తెలంగాణ బీజేపీ పాత దురవస్థలోకి కూరుకుపోవడమే అనే నిజం తెలంగాణ బీజేపీ నేతలకూ తెలుసు… ప్రతిఘటిస్తారు, కాదూ కూడదూ మోడీ చెప్పాడు, కూటమి తప్పదు అనుకుంటే… ప్రజావ్యతిరేత ఎదుర్కొనడానికి సిద్ధపడటమే ఇక… దశాబ్దాలుగా తెలంగాణ బీజేపీకి చంద్రబాబు దోస్తానా శాపమే కదా…
నిజానికి ఏపీ విజయంలో కూడా తెలుగుదేశం కూటమి గొప్పతనమేమీ లేదు… జనసేన అసలు బలం తెలిసిందే, బీజేపీ అసలు బలం తెలిసిందే… కాస్తోకూస్తో అభ్యర్థులను కూడా టీడీపీయే సర్దుబాటు చేసిందట… దీనికితోడు జగన్ పాలన తీరుపై జనంలో ఏర్పడ్డ భీకరమైన వ్యతిరేకత ఈ కూటమిని గట్టెక్కించింది… అది టీడీపీ కూటమి పాజిటివ్ వోటు కాదు… జస్ట్, జగన్ వ్యతిరేక వోటు…
ఈ నిజాలు మరిచి, విశ్లేషణలు విడిచి… మోడీ గనుక కూటమి రూపంలో పోరాడదలుచుకుంటే… నాయకత్వ లోపాలతో కూడా ఇప్పుడిప్పుడే మాంచి పరుగులో ఉన్న బీజేపీ ఉత్సాహం మీద ఓ ట్యాంకర్ చల్లనీళ్లు గుమ్మరించినట్టే… కేసీయార్ నువ్వు ఫామ్ హౌజ్ వదిలి, బయటికి వచ్చే రోజులు సమీపిస్తున్నట్టున్నాయి..! (ఎలాగూ కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత స్టార్టయింది…) (కాకపోతే కేటీయార్ను వారస సీఎంగా ఎక్స్పోజ్ చేస్తూ జనబాహుళ్యంలోకి వెళ్తే మటుకు రిజల్ట్ ఏమిటో చెప్పలేం…)
అప్పట్లో మహాకూటమి మహాపరాజయం తరువాత ఇప్పటిలాగే ఇల్లు కదలని నువ్వు వైఎస్ మరణించాక దొరికిన చాన్స్ అందుకున్నట్టే… ఇప్పుడూ ఓ చాన్స్ మోడీ ఇచ్చేట్టుగానే కనిపిస్తోంది..!!
ఏపీ రాజకీయాలు వేరు- తెలంగాణ రాజకీయాలు వేరు… చంద్రబాబు పాత్ర వేరు, జనం యాక్సెప్టెన్సీ వేరు… అన్నింటికీ మించి నార్తరన్ బీజేపీ పాలిటిక్స్ వేరు, తెలుగు బీజేపీ పాలిటిక్స్ వేరు… ఈ సోయి లేనంతకాలం బీజేపీ హైకమాండ్ సాధించేది ఏమీ ఉండదు… బీజేపీ వైపు మళ్లుతున్న బీఆర్ఎస్ శ్రేణులూ కాస్త ఆగండి… ఏవో క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొస్తున్నట్టున్నాయి..!!
చివరగా…… రేవంత్ రెడ్డి చంద్రబాబుతో మంచిగా ఉన్నంతకాలమే ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 ఎట్సెట్రా సంస్థలు రేవంత్ రెడ్డి మావాడేలే అనుకుంటాయి… బహుపరాక్… ఆ పార్టీలు, ఆ నాయకులు, ఆ సంస్థలు అందరూ అక్కడివారే… అక్కడివారే…!!
Share this Article