.
Mohammed Rafee …. పాపం తెలుగు మీడియా!
గవర్నర్ ను ఎవరు నియమిస్తారు?
మన తెలుగు రాష్ట్రాల్లో అయితే గవర్నర్ ను అనధికారికంగా జర్నలిస్టులు నియమిస్తారు! టివి ఛానెల్స్ కీలక పాత్ర పోషిస్తాయి!
ఈమధ్య సోషల్ మీడియాకు కూడా బోలెడన్ని అధికారాలు ఇచ్చారనుకోండి! అందుకే ఏడుసార్లు ఎమ్మెల్యే గా ఎన్నికైన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు గారిని ఏడుసార్లు గవర్నర్ గా నియమించేసి పాపం ఆయనకు అసలు పదవి రాకుండా చేసేశారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి గారికి తాజాగా గవర్నర్ పదవి ఇచ్చేసారు. పైగా ఆయనకు తమిళనాడు కేటాయించేసారు! ఇలా ఉంది మన మీడియా దుందుడుకు వ్యవహారం!
Ads
ఊహాగానాలు జర్నలిజంలో భాగమే కానీ, అది కాస్త హందాతనంగా ఉండాలి! అదీ ఎక్స్ -క్లూజీవ్ గా వార్త వండాలి! కానీ మారిన కాలానుగుణంగా అందరూ వండేస్తున్నారు! మా వంట ఫస్ట్ ఆన్, మాది ఎక్స్-క్లూజజివ్ అని ప్లేట్ వేసేసుకుంటున్నారు! అదే విచిత్రం!
నిజానికి, నర్సింహులు, కిరణ్ కుమార్ రెడ్డి… ఇద్దరూ ఇద్దరే! సీనియర్ రాజకీయ దిగ్గజాలు! ఎంతో హుందాగా రాజకీయ రంగంలో కొనసాగుతున్నారు. అలాంటి మంచి నేతలను బదనాం చేయడం ముమ్మాటికీ తప్పు! తొందరేముంది… రాష్ట్రపతి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాక రాసుకోవచ్చు! ఇలా ముందస్తుగా రాసేయడాన్ని మా ఊర్లో “అలు లేదు చూలు లేదు…” అనే సామెత ఉపయోగిస్తారు. నిజానికి మీడియా తొందరపాటు వల్ల ఆయా నేతలకు ఇబ్బందే !
గవర్నర్ వ్యవస్థను కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ అధికార పార్టీ ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగించడం మనం ఎన్నో ఏళ్లుగా చూస్తున్న వ్యవహారమే! పేరుకే గవర్నర్ గిరీ రాజ్యాంగ బద్ధం! కేంద్రానికి కోపం వస్తే వెంటనే ఆ గవర్నర్ కు రాష్ట్రపతి నుంచి ఊస్టింగ్ ఆర్దర్స్ వస్తాయి! అధికార పార్టీ సీట్లు కేటాయించలేని సీనియర్ నేతలను, వయసు పైబడి పార్టీకి విశేష సేవలు అందించిన వారిని గవర్నర్ గా నియమించడం చూస్తూనే ఉన్నాం!
భారత రాజ్యాంగంలోని 155 ఆర్టికల్ ప్రకారం కేంద్ర మంత్రి మండలి సిఫారసు చేస్తే, వారిని నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారే చేస్తారు. కేంద్ర మంత్రిమండలికి సహజంగా ప్రధానమంత్రి, ఆ పార్టీ అధ్యక్షులు,లేదా కీలక నేతలు సిఫారసు చేస్తుంటారు!
ప్రపంచం మొత్తంలో అత్యంత వేగంగా వార్తలు వండి అందించేది తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులు మాత్రమే! మిగిలిన దేశాల్లో రాష్ట్రాల్లో రాత్రి 8 గంటల తరువాత జర్నలిస్టులు పని చేయరు. ఫోన్లు కూడా బంద్ చేస్తారు. ఒక్క మన తెలుగు రాష్ట్రాల్లోనే 24 x 7 ఆన్ డ్యూటీ లోనే ఉంటారు! జీతాలు ఇవ్వకున్నా బాధ్యతగా పని చేస్తూనే ఉంటారు!
ఏదొక వార్త వండి వడ్డిస్తూనే ఉంటారు. అందుకే మన ఛానెల్స్ కు, మన సోషల్ మీడియాకు వార్తలు కావాలి! ఆవురు ఆవురంటూ వార్తలు వండి పడేస్తుంటారు! పర్యవసానమే ఇలాంటి ఆధారాలు లేని వార్తలు! ముందస్తుగా వచ్చేస్తుంటాయి! సారీ కిరణ్ కుమార్ రెడ్డి గారు.. లైట్ తీసుకోండి… పాపం తెలుగు మీడియా!
– డా. మహ్మద్ రఫీ
Share this Article