.
కరూర్ తొక్కిసలాట బాధితులకు ఉద్యోగాలపై మద్రాస్ హైకోర్టు బ్రేక్.. విజయ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ! ఇదీ వార్త… ముందుగా ఇది చదవండి.,.
తమిళనాడులో కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వానికి రాజకీయంగానూ, న్యాయపరంగానూ ఎదురుదెబ్బగా మారింది.
Ads
గత ఏడాది కరూర్లో టీవీకే (TVK) నిర్వహించిన భారీ సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించడమే కాకుండా, అర్హులైన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకు 32 మంది కుటుంబ సభ్యులకు ఉద్యోగ నియామక పత్రాలు కూడా అందజేశారు.
అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు, కారుణ్య నియామకాలు సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగి విధుల్లో ఉండగా మరణించిన సందర్భాల్లో మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. ప్రజా ప్రమాదాల్లో మరణించిన వారికి నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం రాజ్యాంగంలోని సమాన అవకాశాల సూత్రానికి విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. అందువల్ల ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది.
ఈ తీర్పుతో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల భవితవ్యంపై అనిశ్చితి నెలకొంది. అయితే ప్రభుత్వం బాధితులకు ఆర్థిక సహాయం, ఇతర పునరావాస చర్యలు చేపట్టేందుకు ఎలాంటి అడ్డంకి లేదని, కానీ ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో చట్టబద్ధమైన విధానాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసినట్లు సమాచారం…
ఇదే నెల పదో తారీఖున ‘ముచ్చట’ చెప్పింది, ఈ నియామకాలపై ఎవరైనా కోర్టుకెక్కితే విజయ్కు షాక్ తగలక తప్పదని… ఎందుకంటే..?
పార్టీ అంటే తన అభిమాన సంఘాల సమాఖ్య, కార్యకర్తలు అంటే తన ఫ్యాన్స్, ప్రజలు అంటే తన అభిమానులు అనే ఓ అపరిణత భావజాలంలో ఉన్నాడు విజయ్… తన చుట్టూ ఉన్నవాళ్లు, తన సేవకులు, తన వాళ్లకే టికెట్లు ఇవ్వడం కూడా అదే…
రాజకీయ సిద్ధాంతాలు, అవగాహన, సమాజం పట్ల- పాలన వ్యవస్థ పట్ల ఏమీ తెలియనితనం కనిపిస్తోంది… ఎందుకంటే… కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నాడు తను… 32 బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు అట… ఆ బాధిత కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నాడు… తొక్కిసలాటలో మృతిచెందిన కుటుంబాలకు పరామర్శ…
అయ్యా, విజయ్… ఆ తొక్కిసలాట నీ తప్పు, నీ పార్టీ తప్పు, నువ్వు ప్రభుత్వానిది, పోలీసులది తప్పు అని చెప్పినా సరే… అది పార్టీ యవ్వారం… ఆదుకోవాలి అనుకుంటే ఒక్కో కుటుంబానికి కోటి ఇస్తావో రెండు కోట్లు ఇస్తావో నీ పార్టీ నిర్ణయించుకోవాలి… ప్రభుత్వ ఉద్యోగాలు దేనికి..? ఆ కుటుంబాలు నీ కోసం త్యాగం చేశాయి, ఆరిపోయాయి తప్ప, సమాజం కోసం కాదు, ఎవరినీ ఉద్దరించిన త్యాగాలు కావు…
ప్రభుత్వ ఉద్యోగాలు పోటీపడి గెలుచుకోవాల్సినవి… వేలు, లక్షల మంది పోటీపడతారు… వారిని కాదని, వీళ్లకు కొలువులు ఇవ్వడం అంటే 32 మంది అర్హులైన ఇతర నిరుద్యోగుల పొట్టగొట్టినట్టు..! వీళ్లు కొలువుల్లో చేరి ఎవరినీ ఏమీ ఉద్దరించేదేమీ ఉండదు, మరింత మూఢ భక్తులు కావడం తప్ప… ఇవి మరోరకం కారుణ్య నియామకాలు..!!
ఎవరైనా ఉద్యోగంలో ఉండి మరణిస్తే, ఆ కుటుంబంలో ఒకరికి ఆ కొలువు ఇస్తే ఒకరకంగా సమర్థనీయం… నిజానికి అదీ తప్పే… అది మెరిట్ ఎలా అవుతుంది..? సరే, ఎవరైనా జవాను దేశరక్షణలో ప్రాణాలు విడిస్తే ఆ కుటుంబంలో ఒకరికి కొలువు ఇస్తే, జాతి కృతజ్ఞత చాటుకున్నట్టు అనుకుందాం, నిజానికి అదీ తప్పే… అంతేకాదు, ఏవో క్రీడాపోటీల్లో ఏదో ఊడబొడిస్తే ఏకంగా గ్రూపు-1 కొలువులు ఇవ్వడం మరీ బాధ్యతారాహిత్యం… ఇవన్నీ ఇంకెవరో నిజమైన అర్హుడి అవకాశాన్ని మింగేయడం!!
అర్హులైన మెరిటోరియస్ నిరుద్యోగులకు వంచించడమే అది! సో, సీఎం కుర్చీలో కూర్చున్నంత మాత్రాన స్టేట్ నీ ఎస్టేట్ కాదు, నీకోసం ప్రాణాలు విడిస్తే జాతి వాళ్లకు ఏమీ రుణపడిపోలేదు..!!
Share this Article