.
అసలు లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఆడటమే ప్రతి క్రికెటర్ స్వప్నం… అందులోనూ లార్డ్స్ హానర్స్ బోర్డులో పేరు రాయించుకోవడం అంటే ఇక అది జీవితకాలపు మెమొరీ… దాన్ని తాజాగా మన ఇండియన్ జట్టు యువ పేసర్ క్రాంతి గౌడ్ సాకారం చేసుకుంది…
ప్రస్తుతం ఇంగ్లండ్లో జరుగుతున్న టెస్టు మ్యాచు మొదటి ఇన్నింగ్స్లో అయిదు వికెట్లు తీసుకోవడం ద్వారా… గ్రేట్… లార్డ్స్ టెస్ట్ హానర్స్ బోర్డులో పేరు లిఖించుకున్న తొలి మహిళా క్రికెటర్గా అరుదైన రికార్డు నెలకొల్పింది… (టెస్టుల్లో ఐదు వికెట్లు తీసిన అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయ మహిళా పేసర్గానూ ఆమె రికార్డు)
Ads
మన టీ20 జట్టు ఇంగ్లండ్ జట్టు మీద అత్యంత ఘోర పరాజయాలతో తలదించుకుంటుంటే… మరోవైపు మన వుమెన్ క్రికెటర్ ఒకరు ఈ ఘనత సాధించడం అపురూపమే కదా… అసలు ఈ లార్డ్స్ టెస్ట్ హానర్స్ బోర్డు అంటే ఏమిటి ఓసారి తెలుసుకుందాం…

లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ పెవిలియన్లో ఉండే ప్రత్యేకమైన చెక్క ఫలకాలను ‘లార్డ్స్ హానర్స్ బోర్డ్స్’ (Lord’s Honours Boards) అని పిలుస్తారు. క్రికెట్ ప్రపంచంలో ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన గుర్తింపుగా పరిగణించబడుతుంది.
లార్డ్స్ మైదానంలో ఆడే ఆటగాళ్లలో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారి పేర్లను ఈ బోర్డులపై శాశ్వతంగా నమోదు చేస్తారు. ఆ మైదానంలోని హోమ్ (ఇంగ్లాండ్/MCC), అవే (సందర్శక జట్లు) డ్రెస్సింగ్ రూమ్లలో ఈ ఫలకాలు ఉంటాయి. ఒక ఆటగాడు తన పేరును ఈ బోర్డుపై చూడాలంటే ఈ క్రింది ఘనతలను సాధించాల్సి ఉంటుంది:
-
బ్యాటింగ్…: లార్డ్స్లో జరిగే టెస్ట్ మ్యాచ్ లేదా వన్డే అంతర్జాతీయ (ODI) మ్యాచ్లో సెంచరీ (100 పరుగులు) సాధించడం….
-
బౌలింగ్…: ఒకే ఇన్నింగ్స్లో 5 వికెట్లు లేదా ఒక మ్యాచ్లో 10 వికెట్లు సాధించడం…
చరిత్ర – మార్పులు: ఇవి చాలా కాలం పాటు కేవలం టెస్ట్ మ్యాచ్లలో సాధించిన విజయాలను మాత్రమే గుర్తించేవి. అయితే, 2019లో జరిగిన మార్పుల తర్వాత, వన్డే అంతర్జాతీయ (ODI) మ్యాచ్లలో సాధించిన సెంచరీలు, ఐదు వికెట్ల ఘనతలను కూడా ఈ బోర్డులపై గుర్తిస్తున్నారు. దీనివల్ల మహిళా క్రికెటర్ల అద్భుత ప్రదర్శనలకు కూడా చోటు దక్కింది.
-
క్రికెటర్ల కల…: లార్డ్స్ను ‘హోమ్ ఆఫ్ క్రికెట్’ అని పిలుస్తారు. ఇక్కడ బోర్డుపై పేరు నమోదు చేసుకోవడం ఒక క్రికెటర్ కెరీర్లో అతిపెద్ద మైలురాయిగా, గొప్ప గౌరవంగా భావిస్తారు.
-
అరుదైన రికార్డు…: ఇప్పటివరకు కేవలం కొద్దిమంది ఆటగాళ్లు మాత్రమే బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ తమ పేరును ఈ బోర్డుపై లిఖించుకోగలిగారు.
సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజ క్రికెటర్లు కూడా లార్డ్స్లో సెంచరీ సాధించలేకపోయారనే విషయం ఈ హానర్స్ బోర్డుపై చోటు సంపాదించడం ఎంత కష్టమో, ఎంత గొప్ప విషయమో తెలియజేస్తుంది…

మన క్రాంతి గౌడ్ ఆ అరుదైన ఘనతను పొందింది… ఆమె లాస్ట్ ఇయర్ వుమెన్ వరల్డ్ కప్ విజేత జట్టులో మెంబర్ కూడా… 22 ఏళ్ల క్రాంతి గౌడ్… 8వ తరగతి డ్రాపవుట్… బుందేల్ఖండ్కు చెందిన గోండ్ ట్రైబ్… లోకల్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్లలో బాల్ బాయ్ పాత్ర నుంచి వరల్డ్ కప్ విజేత జట్టు మెంబర్ దాకా అనూహ్య ప్రస్థానం ఆమెది…!!
ఏదో ఓ మారుమూల ఊరి నుంచి లార్డ్స్ హానర్స్ బోర్డు దాకా ప్రస్థానం అంటే, అదీ వుమెన్ క్రికెట్లో అదంత సులభం కాదు… పైగా చాలా పేద కుటుంబం నుంచి వచ్చింది, తండ్రి ఓ కానిస్టేబుల్… ఎన్నికల విధుల్లో ఏవో పొరపాటు, నిర్లక్ష్యం కారణాలతో తనను కొలువు నుంచి తొలగించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం…
తరువాత..? ‘‘ఆ ఉద్యోగం పోయాక మా కుటుంబం చాలా కష్టాలు పడింది… కొన్నిసార్లు భోజనం కోసం ఇరుగుపొరుగు వారిపై ఆధారపడేవాళ్లం… మా నాన్న మళ్లీ యూనిఫామ్ వేసుకుని, గౌరవంగా రిటైర్ కావడాన్ని చూడాలని అనుకుంటున్నాను..,’’ అని చెప్పుకొచ్చింది ఓసారి క్రాంతి…
వరల్డ్ కప్ గెలిచాక… క్రాంతికి భోపాల్లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సన్మానం చేసింది… అంతేకాదు, క్రాంతి తండ్రి మున్నాసింగ్ గౌడ్ కానిస్టేబుల్ను తిరిగి ఆయన్ని పోలీసు కొలువులోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి ఆమెకు ఆ సభలో హామీ ఇచ్చాడు… ఆమె కన్నీటిపర్యంతమైంది…
క్రాంతి స్వస్థలం ఛతార్పూర్లో ఓ వరల్డ్ క్లాస్ స్టేడియం కడతాం, ఆమె విజయానికి గుర్తుగా నవంబరు 15న ట్రైబల్ ప్రైడ్ డే ఘనంగా జరుపుతాం అని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించాడు… ఒక గెలుపు ఎన్నెన్నో ఫలాలను మోసుకొస్తుంది… అటు వరల్డ్ కప్, ఇటు హానర్స్ బోర్డు… నువ్వు సూపర్ తల్లీ…
Share this Article