.
Subramanyam Dogiparthi … గొప్ప సంగీతాత్మక చిత్రం 1993 లో వచ్చిన ఈ సరిగమలు . సినిమా ప్రేమికులలో ఎంత మంది ఈ సినిమాను చూసారో నాకు తెలియదు . కానీ తప్పక చూడతగ్గ సినిమా . ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు నిర్మించిన ఈ సినిమాకు దర్శకుడు క్రాంతి కుమార్ .
మళయాళంలో అవార్డుల వానలో మునిగిపోయిన సర్గమ్ సినిమాకు రీమేక్ మన సరిగమలు . మళయాళంలో నటించిన వినీత్ , మనోజ్ కె జయన్ , రంభలే తెలుగులో కూడా నటించారు . మళయాళంలో రంభకు ఇదే తొలి సినిమా . తెలుగు సినిమాకు దర్శకత్వాన్ని బాలీవుడ్ సంగీత దర్శకుడు రవి అద్భుతంగా అందించారు . బేక్ గ్రౌండ్ మ్యూజిక్ , పాటల మ్యూజిక్ రెండూ అద్భుతం .
Ads
వేటూరి పాటలనన్నీ గొప్పగా వ్రాసారు . అంతే శ్రావ్యంగా పాడారు బాలసుబ్రమణ్యం , జేసుదాస్ , చిత్ర . జేసుదాస్ మూడు పాటల్ని పాడారు . వాటిల్లో ఒకటి త్యాగరాజ విరచిత కృతి రాగ సుధా రస పానము జేసి రాజిల్లవే మనసా . ఎంత శ్రావ్యంగా పాడారో !
మరో పాట స్వరరాగ గంగా ప్రవాహమే . మూడవది కృష్ణ కృపా సాగరం వేణు సుధా సేవనం జయదేవ కృతం జన మోక్షకరం . అద్భుతమైన చిత్రీకరణ కూడా . చాలామంది మళయాళీలు అనగానే అయ్యప్ప భక్తులు అనుకుంటారు . గొప్ప కృష్ణ భక్తులు . గురువాయూర్ వెళితే శ్రీకృష్ణుని దేవాలయ నిర్వహణ ఎంత గొప్పగా ఉంటుందో కనులారా చూడవచ్చు .
సంగీతమే సరస సల్లాపమే అనే పాట కూడా శ్రావ్యంగా ఉంటుంది . ఇవి కాకుండా వినీత్ , రంభ మీద సాగే డ్యూయెట్ సరిగమలు ఆపవయ్యా సరసన చేరవయ్యా కూడా బాగుంటుంది . ఇవన్నీ కాకుండా చిన్న చిన్న పాటలు కూడా ఎంతో శ్రావ్యంగా ఉంటాయి .
టూకీగా కధ ఏంటంటే : గోదావరి జిల్లాలో ఓ గ్రామంలో ఓ రాజు గారు . కళాపోషకులు . ఎక్కడపడితే అక్కడ కళావతులను పోషిస్తూ ఉంటాడు . ఆయన భార్య భారతి అందరికీ గౌరవనీయురాలు . వారి కుమారుడు చిన్నప్పటి నుంచి మూర్ఛ రోగ బాధితుడు . మనోజ్ కె జయన్ అనే మళయాళ నటుడు ఈ పాత్రను పోషించాడు . కోపిష్టి , అవేశపరుడు .
అతనికో విశ్వాసపాత్రుడయిన స్నేహితుడు . వినీత్ ఈ పాత్రను పోషించాడు . బహుశా తెలుగులో అతనికి ఇదే మొదటి సినిమా అనుకుంటాను . ఇతనికి స్నేహితుడే లోకం . వినీత్ , మనోజ్ బంధువుల అమ్మాయి అయిన రంభ ప్రేమించుకుంటారు . వివాహం అయితే మూర్ఛ రోగం తగ్గుతుందనే భావనతో తల్లి అతని వివాహాన్ని రంభతో నిర్ణయిస్తుంది .
వినీత్ , రంభ ప్రేమ గురించి సమాచారం ఉన్న మనోజ్ తల్లి (సీనియర్ నటి భారతి నటించింది ఈ పాత్రను) వినీత్ ను ఎవరికీ చెప్పకుండా ఊరు వదిలి వెళ్ళిపొమ్మని చెపుతుంది . మనోజ్ , రంభ వివాహం జరిగినా దాంపత్యం పొసగదు . వినీత్ , రంభ ప్రేమ గురించి తెలుసుకున్న మనోజ్ ఆత్మహత్య చేసుకుంటాడు . రంభ పక్షవాతానికి గురవుతుంది . భారతి మనోవేదనతో మంచం పట్టుతుంది .
ఊరు వదిలి వెళ్ళిపోయిన వినీత్ దేశంలోనే గొప్ప సంగీత విద్వాంసుడిగా పేరు గడిస్తాడు . భారతి అభ్యర్ధన మేరకు గ్రామానికి తిరిగొచ్చిన వినీత్ కు ఇక్కడ పరిస్థితులన్నీ తెలుస్తాయి . క్లైమాక్సులో వినీత్ పాటకు రంభలో చలనం వస్తుంది . భారతి చనిపోతూ వినీత్ , రంభ చేతులను కలుపుతుంది . సినిమా ముగుస్తుంది .
ప్రధాన పాత్రల్లో ఈ నలుగురితో పాటు జె వి సోమయాజులు , ప్రసాద్ బాబు , సుత్తి వేలు , పి జె శర్మ , శారదాప్రీతి , నాగమణి , అల్లు రామలింగయ్య , నారాయణరావు , మల్లికార్జున రావు తదితరులు నటించారు . డైలాగులను గణేష్ పాత్రో బాగా వ్రాసారు . మళయాళ మాతృక కాబట్టి కధను హరిహరన్ వ్రాసారు .
ఈ సంగీతాత్మక సినిమా యూట్యూబులో ఉంది . రస హృదయులు , ముఖ్యంగా సంగీత ప్రియులు తప్పక చూడతగ్గ సినిమా .
Share this Article