.
నిన్నటి నుంచీ జానకమ్మ అంత్యక్రియల మీద చాలామంది తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను నిందిస్తూ, తెలుగు జాతి ఆమెను ఓన్ చేసుకోలేకపోయిందనీ, ఆమె పుట్టుక తెలుగే అయినా కర్నాటక ప్రభుత్వం ఆమెను అధికారిక లాంఛనాలతో సాగనంపి, తన మర్యాదను, తన సంస్కారాన్ని చాటుకున్నదనీ బోలెడు సోషల్ మీడియా పోస్టులు కనిపిస్తున్నాయి…
ఇక్కడ నిజంగానే కొన్ని అంశాలు చెప్పుకోవాలి… నిజానిజాలు… అధికారిక లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు కర్నాటక ప్రభుత్వ ముఖ్యుల సంస్కారం, అది నిజం… కొడుకు మరణించాడు కాబట్టి మనమరాలు అప్సర ఆమె చితికర్మల్ని నెరవేర్చింది, అది నిజం… కన్నడ, తమిళ మీడియా ఆమెను బలంగా ఓన్ చేసుకుని నివాళ్లు అర్పించింది, దాంతో పోలిస్తే తెలుగు మీడియా పెద్దగా పట్టించుకోలేదు, ఇది పాక్షిక నిజం…
Ads
ఎందుకంటే..? తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియాకు రాజకీయాలు, బూతులు, పరస్పర నిందారోపణలు, డొల్ల సవాళ్లు, సొల్లు ప్రచారాలు వంటి చెత్త తప్ప దానికి వేరే ప్రయారిటీలు పట్టవు… కానీ తెలుగు సోషల్ మీడియా ఆమెకు ఘనంగా నివాళి సమర్పించింది… ఇందులో డౌట్ లేదు… (ఒకటీరెండు క్షుద్ర పోస్టులు మినహాయింపు, ఈ బురద ఎప్పుడూ ఉండేదే)…

రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కనీస మర్యాదగా ప్రతినిధులను అయినా పంపాయా..? ఈ ప్రశ్న కనిపించింది… అలాంటి ఆనవాయితీ గతంలోనూ లేనట్టుంది… ఒక్క టీవీ కూడా లైవ్ వేయలేదు… మంత్రి నారాయణ కొడుకు చనిపోతే లైవ్ వేసిన అన్ని టీవీ ఛానల్స్ ఏదో మొక్కుబడికి కాసేపు 30 నిమిషాలు ప్రోగ్రామ్ లో చూపాయి… ఇది నిజం… ఈ దరిద్రం ఎప్పుడూ గమనిస్తున్నదే…
జమున పోయినపుడు కూడా అంతే… రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ వదిలేశాయి…. బి సరోజా దేవికి ఘనంగా రాచ మర్యాదలు చేశాయి కన్నడ ప్రభుత్వమూ, అక్కడి ఛానల్స్… బాపు గారినీ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో సాగనంపలేదు. బాలు గారికి తమిళులు ఉన్నారు కాబట్టి సరిపోయింది… లేకుంటే అయన పరిస్థితీ అంతే… ఇదీ విమర్శ…
అవును, ఇంకొన్ని నిజాలు, ప్రత్యేకించి కేసీయార్ పాలనలో ఆయన రాగద్వేషాలను బట్టి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి వేర్వేరు కేసుల్లో… ఇదొక రీతిలేని సంస్కార ప్రదర్శన… బాపు నాకు తెలిసి మరణించింది చెన్నైలో… బాలు మరణించిందీ చెన్నైలోనే… అక్కడి ప్రభుత్వం బాలు పట్ల మర్యాదను కనబరిచింది… పైగా బాపు మరణించినప్పుడు రెండు రాష్ట్రాలు వేరుపడుతూ, కొత్త ప్రభుత్వాలు ఏర్పడుతున్న సంధికాలంలో ఉన్నాయి…
అవును, ప్రముఖ సినీ నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు (2015) సూపర్ స్టార్ కృష్ణ (2022) ఇద్దరి అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది… సీనియర్ నటి జమున మరణించినప్పుడు, ఆమెకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలు జరగలేదు… కొంతమంది సినీ ప్రముఖులు ఆమె అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని కోరినప్పటికీ, ప్రభుత్వం నుండి అటువంటి అధికారిక ప్రకటన రాలేదు… ఆ సమయంలో కూడా ముఖ్యమంత్రిగా కె. చంద్రశేఖర్ రావు ఉన్నాడు…
ప్రజా గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు గూడ అంజన్న 2020లో మరణించినప్పుడు, ప్రభుత్వం ఆయనకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదు… అప్పుడు అధికారిక అంత్యక్రియల విషయంలో సోషల్ మీడియాలో, కొన్ని వర్గాల్లో విమర్శలు వచ్చాయి… ముఖ్యంగా, సినీ ప్రముఖులకు ఇచ్చే ప్రాధాన్యత తెలంగాణ ఉద్యమకారులకు, సామాజిక స్పృహ కలిగిన కళాకారులకు ఇవ్వడం లేదని, రామానాయుడు వంటి వారికి అధికారిక హోదా ఇచ్చి, ఉద్యమ గాయకుడిని విస్మరించారనే కోణంలో ఆ సమయంలో చర్చ జరిగింది…

నిజానికి గాయని జానకమ్మకు హైదరాబాద్ అంటే ఇష్టం… ఇక్కడ ఓ విల్లా కూడా కొనుక్కుంది… తన జీవితం ఇక్కడే కడతేరిపోవాలనీ అనుకుంది… అందుకే చెన్నైలో ఇల్లు అమ్మేసుకుని మరీ హైదరాబాద్ వచ్చేసింది… కానీ కొడుకు చనిపోయాక కుంగిపోయింది, దీనికితోడు వృద్ధాప్య సమస్యలు, చూసుకునేవారు లేక మనమరాలు అప్సర దగ్గర ఉంటోంది చాన్నాళ్లుగా…
అప్సర కూడా అక్కడే అంత్యక్రియలను కోరింది కాబట్టే కర్నాటక ప్రభుత్వం ఆమె కోరికను మన్నించింది… ఒకవేళ ఆమె కోరితే తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా అధికారిక లాంఛనాలతో సాగనంపేది… కేసీయార్ కాలం వేరు- రేవంత్ రెడ్డి కాలం వేరు…

చూశాం కదా, అందెశ్రీ అంత్యక్రియలకు హాజరు కావడమే కాదు, ఓ పెద్ద కొడుకుగా చివరి కర్మలు నిర్వర్తించి, తన పాడె కూడా మోశాడు… తను రాసిన గీతం ఈరోజు తెలంగాణ అధికారిక గీతం… గద్దర్ పేరిట సినిమా అవార్డులు… సో, కళాకారుల పట్ల తెలంగాణ ప్రభుత్వ సంస్కారరాహిత్యం అనేది సమర్థనీయమైన విమర్శ మాత్రం కాదు..!! (ఎస్, కేసీయార్ కాలంలో వివక్షలు, రాగద్వేషాలు ఉండేవి, అది కూడా నిజం)…
Share this Article