.
సోనియా పుస్తకంలో ఏముంది..? పెంగ్విన్ ఎందుకు వెనక్కి తగ్గింది..? అసలు వివాదం ఏమిటి?
సోనియా గాంధీ రాసిన పుస్తకం.
పెంగ్విన్ ప్రచురణ సంస్థ.
కొన్ని మార్పులు చేయాలన్న ప్రచురణకర్త.
అందుకు రచయిత అంగీకరించలేదు.
చివరకు భారత్లో పుస్తకం ప్రచురణ బాధ్యత నుంచి పెంగ్విన్ తప్పుకుంది…. ఇదీ జరిగింది…
Ads
వినడానికి ఇదంతా ఒక సాధారణ ఎడిటోరియల్ డిస్ప్యూట్ లాగే ఉంది. కానీ ఇందులో ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. పెంగ్విన్ ఇప్పుడు చెబుతున్న మాట … “మేము పుస్తకాన్ని ప్రచురించడానికి వెనక్కి తగ్గలేదు. అసలు భారత్లో ఈ పుస్తకానికి మేము ప్రచురణకర్తలమే కాదు!” ఇదే ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది.

అసలు పుస్తకం ఏమిటి? సోనియా గాంధీ రాసిన Belonging: A Journey of Love ఆమె జీవితంపై వచ్చిన అత్యంత వ్యక్తిగతమైన మెమోయర్గా ప్రచారం అవుతోంది.
1965లో కేంబ్రిడ్జ్లో 19 ఏళ్ల సోనియా మైనోకు రాజీవ్ గాంధీ పరిచయం కావడం నుంచి మొదలయ్యే ఈ కథలో ఇటలీలో ఆమె బాల్యం, రాజీవ్తో ప్రేమ, వివాహం, భారతదేశానికి రావడం, నెహ్రూ- గాంధీ కుటుంబంలోకి అడుగుపెట్టడం, ఇందిరా గాంధీ హత్య, రాజీవ్ గాంధీ హత్య, ఆ తర్వాత ఆమె రాజకీయ జీవితం వంటి అనేక అంశాలు ఉంటాయని పుస్తక ప్రచురణకర్తలు చెబుతున్నారు.
ఇంకా ముఖ్యంగా… 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి పదవిని ఎందుకు స్వీకరించలేదు? అలాంటి అత్యంత కీలక రాజకీయ నిర్ణయాల వెనుక తన ఆలోచనల్ని కూడా సోనియా ఈ పుస్తకంలో చెప్పబోతున్నట్టు ప్రచురణ వివరాలు సూచిస్తున్నాయి.
అందుకే ఈ పుస్తకంపై రాజకీయ వర్గాల్లో సహజంగానే ఆసక్తి ఎక్కువ. అమెరికాలో Penguin Random Houseకు చెందిన Alfred A. Knopf ద్వారా నవంబర్ 10న పుస్తకం విడుదల కానుంది. మొదటి ముద్రణే లక్ష కాపీలుగా నిర్ణయించారు. పుస్తకం 544 పేజీలది.
మరి వివాదం ఎక్కడ వచ్చింది? ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం, భారతదేశంలో ఈ పుస్తకాన్ని Penguin Random House India ప్రచురించాల్సి ఉంది. అయితే మాన్యుస్క్రిప్ట్లోని ఒక భాగానికి సంబంధించి కొన్ని “editorial changes and deletions” చేయాలని పెంగ్విన్ కోరింది. (బహుశా కొన్ని ఇబ్బందులు, ఒత్తిళ్లు వస్తాయనే సందేహం కావచ్చు) కానీ… సోనియా గాంధీ వాటిని అంగీకరించలేదు.
దాంతో పెంగ్విన్ ఇండియా ఈ పుస్తకాన్ని ప్రచురించే వ్యవహారం నుంచి తప్పుకున్నట్టు వార్త వచ్చింది. ఇప్పుడు HarperCollins India ఈ పుస్తకాన్ని భారత్లో ప్రచురించి, పంపిణీ చేసే హక్కుల కోసం ముందుకు వచ్చినట్టు సమాచారం.

ఇక్కడే సహజంగా ప్రశ్నలు మొదలవుతాయి.
ఏం మార్చమన్నారు? ఏం తొలగించమన్నారు? ఎవరికి సంబంధించిన విషయం? రాజకీయంగా ఇబ్బంది కలిగించే విషయమా? నెహ్రూ- గాంధీ కుటుంబానికి సంబంధించిన ఏదైనా సంచలన విషయమా? ఇప్పటివరకు దీనికి సమాధానం లేదు.
పెంగ్విన్ కూడా ఆ మార్పులు ఏమిటో చెప్పలేదు. సోనియా గాంధీ తరఫున కూడా ఆ వివరాలు బయటకు రాలేదు. ఇప్పుడు పెంగ్విన్ ఎందుకు వివరణ ఇచ్చింది? ఇదే ఈరోజు వచ్చిన ట్విస్ట్.
పెంగ్విన్ అధికారికంగా ప్రకటించింది: “Penguin Random House India is not the publisher of ‘Belonging’ in India.” అంటే… “భారత్లో ఈ పుస్తకానికి మేము ప్రచురణకర్తలమే కాదు” అని తేల్చి చెప్పింది. అంతేకాదు,
“రచయిత ఎడిటోరియల్ మార్పులకు అంగీకరించకపోవడంతో మేము పుస్తకాన్ని ప్రచురించకూడదని నిర్ణయించుకున్నాం అని చెప్పడం పరిస్థితిని సరిగ్గా ప్రతిబింబించదు” అని కూడా పేర్కొంది. ప్రచురణ సంస్థగా తమకు మాన్యుస్క్రిప్ట్ను ఫ్యాక్ట్ చెక్ చేయడం, రచయితకు పుస్తక ప్రయోజనాలకు అనుగుణంగా సూచనలు ఇవ్వడం తమ హక్కు, బాధ్యత అని చెప్పింది. అవి ప్రచురణ ప్రక్రియలో సాధారణ విషయాలేనని కూడా స్పష్టం చేసింది.
అత్యంత కీలకమైన మాట మాత్రం — “We remained willing and keen to publish the book.” అంటే, “మేము పుస్తకాన్ని ప్రచురించడానికి ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నాం” అంటోంది పెంగ్విన్. కానీ చర్చల వివరాలు మాత్రం confidential కాబట్టి బయటపెట్టబోమని చెబుతోంది.
అంటే ఎవరు నిజం చెబుతున్నారు? ప్రస్తుతానికి పూర్తిగా స్పష్టంగా చెప్పలేం. ఒకవైపు వచ్చిన రిపోర్టులు చెబుతున్నది…
పెంగ్విన్ మార్పులు కోరింది → సోనియా తిరస్కరించారు → పెంగ్విన్ భారత్లో ప్రచురణ నుంచి తప్పుకుంది.
మరోవైపు పెంగ్విన్ చెబుతున్నది:
“అది మా నిర్ణయం మాత్రమే కాదు. మేము ప్రచురించేందుకు సిద్ధంగానే ఉన్నాం. భారత్లో ఈ పుస్తకానికి మేము publisher కాదు అని మాత్రమే చెప్పగలం.”
అంటే అసలు ఒప్పందం ఎలా ఉంది?
ఎప్పుడు ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నారు?
ఎడిటోరియల్ మార్పులు ఎందుకు సూచించారు?
ఇవన్నీ ఇంకా తెర వెనుకే ఉన్నాయి. ఇదే ఆసక్తికరమైన అసలు పాయింట్… సోనియా గాంధీ తన పుస్తకంలో “truth of their motivations, their actions and even their human failings” గురించి మాట్లాడబోతున్నట్టు పుస్తక ప్రచురణ ప్రకటనలోనే చెప్పారు.
అంటే కుటుంబం, రాజకీయాలు, నిర్ణయాలు మాత్రమే కాదు… మనుషులుగా వారి బలహీనతలు, తప్పిదాలు, అంతర్గత సంఘర్షణలు కూడా తన కథలో ఉంటాయని ఆమె సూచించినట్టే. అలాంటి పుస్తకంలో ఒక భాగాన్ని ప్రచురణకర్త మార్చాలని లేదా తొలగించాలని కోరడం… అందుకు రచయిత అంగీకరించకపోవడం… చివరకు అదే పుస్తకం మరో ప్రచురణ సంస్థ చేతిలోకి వెళ్లడం…
ఇది సాధారణ ఎడిటింగ్ గొడవా? లేక ఆ భాగంలో రాజకీయంగా అత్యంత సున్నితమైన విషయాలున్నాయా? ఇప్పుడే తేల్చేయడం మాత్రం తొందరపాటు. ఎందుకంటే ఆ మార్పులు ఏమిటో ఎవ్వరూ బయటపెట్టలేదు.
ఇది పెంగ్విన్కు కొత్త వివాదం కూడా కాదు ఇదే ఏడాది మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే రాసిన Four Stars of Destiny విషయంలోనూ పెంగ్విన్ ఇండియా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అలాగే జో సాకో రాసిన ముజఫర్నగర్ అల్లర్ల నేపథ్యంలోని The Once and Future Riot పుస్తకంపై కూడా పెంగ్విన్ ఇండియా వెనక్కి తగ్గింది. ఆ సందర్భంలో భారత సరిహద్దులను తప్పుగా చూపించే మ్యాప్ సహా కొన్ని కంటెంట్ అంశాలపై legal scrutinyలో అభ్యంతరాలు వచ్చాయని సంస్థ తెలిపింది.
అందుకే ఇప్పుడు సోనియా గాంధీ పుస్తకం వ్యవహారం “ఒక రచయిత– ప్రచురణకర్త మధ్య జరిగిన ఎడిటింగ్ వివాదం” దాటి, భారతదేశంలో రాజకీయంగా సున్నితమైన పుస్తకాలను ప్రచురించే విషయంలో ప్రచురణ సంస్థలు ఎంతవరకు రిస్క్ తీసుకుంటాయి? రచయిత స్వేచ్ఛ ఎక్కడ ముగుస్తుంది? ప్రచురణకర్త బాధ్యత ఎక్కడ మొదలవుతుంది? అనే పెద్ద చర్చకు దారి తీసే అవకాశం ఉంది.
కానీ ఒక విషయం మాత్రం ఇప్పటివరకు ఖచ్చితంగా చెప్పలేం — సోనియా పుస్తకంలో పెంగ్విన్ తొలగించాలనుకున్న అసలు విషయం ఏమిటో. అది బయటకు వస్తేనే ఈ కథలో అసలు బాంబు పేలుతుంది. మిగతాదంతా ఇప్పటివరకు ప్రచురణ రంగంలోని ఒక ఆసక్తికరమైన “ఎడిటోరియల్ వార్” మాత్రమే.
Share this Article