.
బీఆర్ఎస్ వంటి కుటుంబ, వ్యక్తి కేంద్రిత పార్టీలకు ఎన్ని అవలక్షణాలున్నా సరే, ఒక విషయంలో మాత్రం అడ్వాంటేజ్ ఉంటుంది… అధినేత ఓ నిర్ణయం తీసుకుంటే ఇక అది ఫైనల్… ఎవరి అనుమతీ అక్కర్లేదు, కింది స్థాయి వరకూ క్రమశిక్షణతో పాటిస్తారు, అనుసరిస్తారు, ఆమోదిస్తారు… దీనివల్ల అధినేత అనుకున్నది స్వేచ్ఛగా అమలు చేయగలుగుతాడు… అది మంచైనా, అది చెడైనా…
బీజేపీ జాతీయ పార్టీయే, కానీ నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధానికి స్వేచ్ఛ ఉంటుంది, కానీ దాని ప్రభావం, ఫలితాలపై సంఘ్ కావచ్చు, దాని అనుబంధ సంఘాలు కావచ్చు అభిప్రాయాలు చెబుతాయి… అవసరమైతే దిద్దుకోవాలని సూచిస్తాయి… ఎటొచ్చీ, కాంగ్రెస్ పార్టీకే ఇదొక వింత సమస్య…
Ads
ఢిల్లీ నుంచి గల్లీ దాకా బంధనాలు… పెత్తనాలు… అసలు పెత్తందారీ ఎవరో ఎవరికీ అర్థం కాదు… ఉదాహరణకు తెలంగాణ… మొన్న ఢిల్లీలో ఓ మీటింగ్ జరిగింది… సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్, పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి, భట్టి, ఉత్తమ్ తదితరులు పాల్గొన్నారు… ఇలాంటి సమన్వయ కమిటీ మీటింగులు, సమీక్షల వరకూ వోకే… తప్పొప్పుల మథనం జరుగుతుంది, గుడ్ టు పార్టీ…
కానీ పొద్దున పత్రికల్లో ఆ మీటింగు నిర్ణయాలు చదివి ఆశ్చర్యపోవడం ప్రజల వంతయింది… ఏమిటయ్యా అంటే..? ‘‘సమన్వయ కమిటీ వోకే చెప్పాలి… ఆ తరువాతే ప్రభుత్వ నిర్ణయాలు, పథకాలు అమలు… ప్రతి 45 రోజులకు ఓసారి భేటీ… దీని వల్ల సర్కారు ప్రోగ్రామ్స్, స్కీమ్స్ మీద కేడర్కు అవగాహన ఉంటుందట, ప్రచారం చేసే అవకాశం ఉంటుందట…
అసలే కొందరు మంత్రుల జోలికి రానివ్వరు, వాళ్ల మంత్రిత్వ శాఖలు స్వతంత్ర రాజ్యాలు… దీనికితోడు ఇక పార్టీ పెత్తనం… సమన్వయ కమిటీ వోకే చెబితే గానీ అడుగు వేయలేకపోతే, ఇక ముఖ్యమంత్రిత్వానికి అర్థం ఏమున్నట్టు..? ఇదీ విస్మయపరిచే ప్రశ్న!
ప్రభుత్వానికీ, పార్టీకి నడుమ గ్యాప్ ఉండకూడదనే స్థూల భావన, ఉద్దేశం మంచిదే… కానీ కొన్నిసార్లు పార్టీతో చర్చించాకే, ఏకాభిప్రాయం కుదిరాకే ప్రోగ్రామ్ అంటే అది ముందరికాళ్లకు బంధనాలు వేయడమే… ఉదాహరణకు… పీసీసీ అధ్యక్షుడే చెప్పాడు, యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు వేసే ముందు పార్టీలో చర్చించి ఉంటే బాగుండును అని…
సాధ్యమేనా..? మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నాయకులు, ఎమ్మెల్సీల అభిప్రాయాలు అడిగితే కొన్ని వందల ప్రతిపాదనలు వస్తాయి… ఆ వడబోత సాధ్యమేనా..? ఎవరి ప్రతిపాదనా కాదనలేరు, పక్కన పడేయలేరు… మరెలా..? నిజానికి చిరంజీవి భార్యను అందులోకి తీసుకోవడం మినహా బోర్డు నియామకంపై పెద్దగా వ్యతిరేకత ఏమీ రాలేదు, కూర్పు బాగుంది కూడా… పార్టీకి ముడిపెట్టి ఉంటే అదిప్పట్లో అయ్యేది కాదు…
ఎస్, నామినేటెడ్ పోస్టులకు సంబంధించి సమన్వయ కమిటీలో చర్చిస్తే బెటరే, ఎందుకంటే ఎవరు పార్టీ కోసం కష్టపడుతున్నారు, ఎలా అకామిడేట్ చేయాలో ఓ విస్తృత అభిప్రాయ సమీకరణ మంచిదే… సో, ప్రతి ప్రభుత్వ నిర్ణయానికీ పార్టీ సమన్వయ కమిటీ ఆమోదం తప్పనిసరి అనేది కొన్నిసార్లు నష్టదాయకమే…!!
Share this Article