.
Subramanyam Dogiparthi … దివ్యభారతి నటించిన ఆఖరి తెలుగు సినిమా 1993 అక్టోబరులో వచ్చిన ఈ తొలిముద్దు . చాలా తక్కువ సమయంలో అత్యంత గరిష్ట పారితోషకం తీసుకున్న నటి ఆమె . అర్ధాంతరంగా , అనుమానాస్పద పరిస్థితులలో మరణించింది . ఆమె మరణించే సమయానికి 18 సినిమాలలో నటిస్తుందట . ఈ సినిమా కూడా వాటిల్లో ఒకటి . మిగిలిన ఆ కొద్ది సీన్లను రంభతో తీసారు . సినిమా వాళ్ళకు కూడా సినిమా కష్టాలు ఉంటాయి కదా !
మరో లేత ప్రేమ కధ . నలభై ఏళ్ళోళ్ళ , అరవై ఏళ్ళోళ్ళ ప్రేమ కధ కాదు . లేత వయసులో ఉన్న హీరోహీరోయిన్లతో తీయబడిన ప్రేమ కధ . ప్రేమ చుట్టూ ఎన్ని సినిమాలు వచ్చాయో ! వస్తున్నాయో ! Love is eternal .
Ads
కొన్ని ప్రేమ కధలు ఆస్తులు అంతస్తులు చుట్టూ తిరుగుతాయి . కొన్ని తల్లిదండ్రుల పిసినారితనం , ఇగోల చుట్టూ తిరుగుతాయి . ఈ సినిమా హీరో తండ్రి పిసినారితనం చుట్టూ తిరుగుతుంది .
హిందీలో హిట్టయిన దిల్ సినిమాకు రీమేక్ మన తొలిముద్దు సినిమా . హిందీలో అమీర్ ఖాన్ , మాధురీ దీక్షిత్ లీడ్ రోల్సులో నటించారు . మన తెలుగు సినిమాకు దర్శకుడు కె కె రెడ్డి . ఆయన కూడా ఒక అతిధి పాత్రలో నటించారు .

కధ టూకీగా : హీరోహీరోయిన్లు కాలేజీలో చదువుకుంటూ ఉంటారు . మొదట్లో తగాదాలతో మొదలయి తర్వాత ప్రేమగా మారుతుంది . సమాంతరంగా కొడుకు పెళ్లి ద్వారా కోట్లు సంపాదించుకోవాలని కలలు కనే తండ్రి కోట శ్రీనివాసరావు హీరోయిన్ దివ్యభారతి తండ్రి కెప్టెన్ రాజు వద్ద అంబానీ లెవెల్లో బిల్డప్ ఇచ్చి మోసం చేస్తాడు .
ఎంగేజ్మెంట్ జరుగుతున్న టైంలో కోట శ్రీనివాసరావు సంగతి తెలిసిన ఒకతను కెప్టెన్ రాజుకి అసలు వాస్తవం చెప్పటంతో ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది . హీరోహీరోయిన్లు తమ తల్లిదండ్రులను ఒప్పించలేని పరిస్థితులలో ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటారు . విలన్ల చేతిలో చావుబతుకుల్లో ఉన్న హీరోని కాపాడుకోవటానికి అతన్ని మరచిపోయేందుకు కూడా సిధ్ధపడుతుంది . క్లైమాక్సులో పిసినారి తండ్రి బుధ్ధి తెచ్చుకోవడంతో సినిమా శుభాంతం అవుతుంది .
చాలా సినిమాలలో చూసే కధే అయినా దివ్యభారతి గ్లామర్ , ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాటలు , దివ్యభారతి ఆఖరి సినిమా అని ప్రచారం , వగైరా అంశాలతో బాగానే ఆడింది . పాటల్ని భువనచంద్ర వ్రాయగా బాలసుబ్రమణ్యం , జానకమ్మ పాడారు .
ఇది బొంబాయి పిల్లరో శ్రీదేవి చెల్లిరో , తొలిముద్దు తొలిముద్దు తొలిప్రేమ సరిహద్దు , వన్నెలాడి గిన్నెకోడి , చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం అంటూ నాలుగు డ్యూయెట్లు సాగుతాయి . (చిట్టి గుమ్మ పదవే పాట చాలా పాపులరైంది) మేం ప్రేమికులం మేం ప్రేమికులం , రావా ప్రియతమా ప్రేమే శాపమా అంటూ రెండు విషాద/సీరియస్ గీతాలు .
హీరోగా ప్రశాంత్ , ఇతర పాత్రల్లో కోట శ్రీనివాసరావు , అన్నపూర్ణ , ఆలీ , కెప్టెన్ రాజు , పండరీబాయి , తమిళ నటుడు సెంథిల్ , రాకీ , గౌతంరాజు , బ్రహ్మానందం తదితరులు నటించారు . గణేష్ పాత్రో డైలాగులు బాగుంటాయి .
సినిమా యూట్యూబులో ఉంది . రొటీన్ ప్రేమ కధే అయినా దివ్యభారతి వలన ఆడింది . ఇప్పుడు కూడా ఇంతకుముందు చూడని ఆమె అభిమానులు చూడవచ్చు .
దివ్య భారతి అంటే దివ్య భారతే… ఆమెకు అప్పట్లో అంత గిరాకీ… తెరపై కనిపిస్తే చాలు సినిమాలు అలా నడిచిపోయాయి, కానీ అర్థంతరంగా వెళ్లిపోయింది… మరి నిర్మాణంలో ఉన్న సినిమాల పరిస్థితి ఏమిటి..? కాస్త ఆమె పోలికలున్న రంభను తీసుకొచ్చారు… కానీ దివ్య భారతికి ఆమె అస్సలు రీప్లేస్మెంట్ కాదు, అందుకని మిగిలిపోయిన సీన్లలో ఓ డూప్గా, ఓ బాడీ డబుల్గా కనీకనిపించనట్టుగా ఏదో అలా నడిపించేశారు, తప్పదు కదా…
రంభ నటించిన ఆ కొన్ని సన్నివేశాలకు ప్రముఖ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోజా రమణి చేత డబ్బింగ్ చెప్పించారు. కాకపోతే ఈ చిత్రంలోని ప్రధాన సీన్లలో ప్రధాన పాత్ర అంతా దివ్యభారతే పోషించడంతో తెరపై ఎక్కడా పెద్దగా తేడా తెలియలేదు…
Share this Article