.
తమిళనాడులోని కార్తీక దీపం కథ ఇంకా అయిపోలేదు… విజయ్ ప్రభుత్వానికి ఇదే తొలి పరీక్ష! తిరుప్పరంకుండ్రం కొండపై వెలిగే కార్తీక దీపం చుట్టూ సాగుతున్న వివాదం మళ్లీ తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది… ఒక దీపం వెలిగించాలా వద్దా అన్న ప్రశ్నగా మొదలైన ఈ వ్యవహారం, ఇప్పుడు న్యాయవ్యవస్థ, ప్రజాభిప్రాయం, రాజకీయాల మధ్య జరుగుతున్న ప్రతిష్ఠంభనగా మారింది.
మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ తాజాగా తమిళనాడు ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించింది. “దీపం వెలిగించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటి?” అని అడిగింది. “ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజల మనోభావాలను గౌరవించాల్సిందే” అని కూడా న్యాయమూర్తులు వ్యాఖ్యానించడం గమనార్హం.
Ads
ఈ వివాదానికి చరిత్ర ఉంది… తిరుప్పరంకుండ్రం కొండపై శతాబ్దాలుగా కార్తీక దీపోత్సవం నిర్వహిస్తుంటారు. అయితే గత కొన్నేళ్లుగా అక్కడ దీపం వెలిగించడంపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో వివాదం మొదలైంది. విషయం కోర్టుకు వెళ్లగా, సంప్రదాయాన్ని కొనసాగించేందుకు అనుమతిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కానీ అప్పటి డీఎంకే స్టాలిన్ ప్రభుత్వం ఆ ఆదేశాల అమలులో పెద్దగా ఆసక్తి చూపలేదు. మొరాయించింది. అంతేకాదు, కోర్టు తీర్పులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంబంధిత న్యాయమూర్తిపై అభిశంసన చర్యలకూ సిద్దపడింది… న్యాయవ్యవస్థలో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారడంతోపాటు, న్యాయవ్యవస్థపై అనుచిత ఒత్తిళ్లుగా చాలామంది న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు, వ్యతిరేకించారు, ఖండించారు…
స్టాలిన్ మొరాయింపు, ఒత్తిడి టాక్టిక్స్కు ఇండి కూటమి పార్టీలు కూడా మద్దతు పలికాయి.,.. సరే, ఆ కార్తీకదీపం పెట్టిన శాపంతో స్టాలిన్ ప్రభుత్వం కూలిపోయిందని అనుకుందాం… ఇప్పుడది కొత్తగా ఏర్పడిన విజయ్కు ఓ పరీక్షగా మారినట్టే…
తను స్వతహాగా క్రిస్టియన్… కార్తీకదీపాన్ని అడ్డుకుంటే ఈ వివాదం మతం రంగు పులుముకుంటుంది… ఇప్పుడు పరిస్థితులు మారాయి. డీఎంకే అధికారంలో లేదు. ఇండియా కూటమి రాజకీయ సమీకరణాలూ మారిపోయాయి.
కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. అందుకే ఇది కేవలం ఒక దీపం వెలిగించే అంశం మాత్రమే కాదు; కొత్త ప్రభుత్వానికి ప్రజలు, సంప్రదాయాలు, న్యాయస్థానాల తీర్పుల పట్ల ఉన్న దృక్పథాన్ని పరీక్షించే తొలి సందర్భంగా మారింది.
హైకోర్టు కూడా ఇప్పుడు స్పష్టమైన సమాధానం కోరుతోంది. “అమలు చేయలేని కారణం ఏమిటి?” అనే ప్రశ్నకు ప్రభుత్వం జూన్ 22లోపు తన తుది వైఖరిని వెల్లడించాల్సి ఉంది.
ప్రజల విశ్వాసాలు, మతాచారాలు, చారిత్రక సంప్రదాయాల విషయంలో ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాలి అన్న దానిపై ఈ కేసు మరోసారి చర్చకు దారితీస్తోంది. న్యాయస్థానం అనుమతి ఇచ్చిన తర్వాత కూడా పరిపాలన వెనుకడుగు వేయడం సరైందేనా? లేక ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ సమస్యకు పరిష్కారం కనుగొనాలా? అన్న ప్రశ్నలు ముందుకొస్తున్నాయి.
జూన్ 22న ప్రభుత్వం చెప్పబోయే సమాధానం కేవలం ఒక కోర్టు కేసు భవిష్యత్తును మాత్రమే కాదు, తమిళనాడులో సంప్రదాయం- రాజకీయం- పరిపాలనల మధ్య సంబంధాలపై కూడా కొత్త సంకేతాలను ఇవ్వబోతోంది.
అందుకే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది… తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం కథ ఇంకా ముగియలేదు. అసలు కీలక అధ్యాయం ఇప్పుడే మొదలవుతోంది.
Share this Article