.
రేవంత్ రెడ్డికి ఇక తప్పదు… తన కళ్లకు గంతలు కడుతూ, తన నిర్ణయాల్ని లైట్ తీసుకుంటూ, అమలు చేయడానికి విముఖంగా ఉన్న కొందరు ఉన్నతాధికారులపై కొరడా ఎత్తాల్సిందే… లేకపోతే మరింతగా బ్యూరోక్రాట్లు పాలనను మరింత దెబ్బతీస్తారు… పక్కా ఉదాహరణ, తన పరిధిలోనే ఉన్న విద్యా శాఖ… కాస్త వివరంగా చెప్పుకుందాం…
రేవంత్ రెడ్డి నిర్ణయం ఏమిటి..? కేంద్ర ప్రభుత్వ విద్యావిధానం మేరకే రాష్ట్రంలోనూ స్కూలింగ్ ఉండాలని… అంటే టెన్ ప్లస్ టు… ప్రత్యేకంగా ఇంటర్ బోర్డు అక్కర్లేదు… ఒకసారి స్కూల్లో చేరితే విద్యార్థి టెన్ ప్లస్ టు దాకా నిరంతరాయంగా చదువుకోవాలి… అదే దిశలో గురుకులాలు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, ప్రస్తుతం నడుస్తున్న స్కూళ్లు అవే దిశలో ఉండాలి…
Ads
అంతేకాదు, ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి కోర్సుల్ని కూడా స్కిల్ యూనివర్శిటీకి అనుసంధానం చేయాలి… అప్గ్రేడ్ చేయాలి స్కిల్ ట్రెయినింగును..! (ఉన్నత, సాంకేతిక విద్యావిభాగాల్లోనూ చాలా సంస్కరణలు అవసరం, ప్రస్తుతం మనం స్కూలింగ్కే పరిమితం అవుదాం ఇక్కడ)… రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఇంటర్ మీడియెట్ విద్య… ఇది ప్రభుత్వరంగంలో ఫ్లాప్… (కారణాలు బోలెడు)… ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలకు కాసుల సాగు… కాదు, ఇది ఓ దందా…
తన వైఖరి ఏమిటో రేవంత్ రెడ్డి ఎప్పుడో చెప్పాడు… కానీ ఆ దిశలో ఏ ఉన్నతాధికారి ఒక్క అడుగు కూడా వేయలేదు… తన రాజకీయాల్లో పడి రేవంత్ రెడ్డీ తన నూతన విధానం ఎంతవరకు అమల్లోకి వచ్చిందో కూడా గమనించలేదు… తీరా చూస్తే ఎవరికి వారే అడ్మిషన్ల నోటిఫికేషన్లు ఇచ్చేసుకుంటున్నారు… ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్ అడ్మిషన్లు జోరుగా, దాదాపు పూర్తయ్యే స్టేజ్…
ఇంటర్ బోర్డు కూడా అడ్మిషన్లకు రెడీ అయిపోయింది… అన్ని జిల్లాలకూ సర్క్యులర్లు పంపించేసింది… మరి రేవంత్ రెడ్డి చెప్పిన ప్లస్ టూ ఏమైనట్టు..? ఇంటర్ బోర్డు ప్రాథమిక విద్యాశాఖలో ఎందుకు విలీనం కాలేదు..? ఎవరికీ ఏ ఐడియా లేదు… ఎవరూ పట్టించుకోలేదు… రీసెంట్ సమీక్షలో రేవంత్ రెడ్డి ఇదే అడిగితే జవాబులూ లేవు… సీరియస్ అయినట్టున్నాడు… దాంతో ఇంటర్ బోర్డు అడ్మిషన్ల సర్క్యులర్లు ఉపసంహరించుకుంది హడావుడిగా…
ఒకవేళ బోర్డు విలీనంలో సమస్యలుంటే అవైనా చెప్పాలి కదా సీఎంకు… చెప్పలేదు… పోనీ, ప్టస్ టు విధానం వైపు కొన్ని అడుగులైనా వేయాలి కదా… వేయలేదు… సపోజ్, బాగా నడుస్తున్న హైస్కూళ్లలో ఈసారి ప్లస్ వన్ కోర్సు ఇమీడియెట్గా ప్రవేశపెట్టొచ్చు కదా… పెట్టలేదు… ముందు ఎక్కడో ఓచోట ప్రారంభం కావాలి కదా… చేయలేదు… రేవంత్ రెడ్డి ఆలోచన నర్సరీ నుంచి ప్లస్ టూ దాకా ప్రభుత్వ రంగంలో పిల్లలు ఉన్నత ప్రమాణాలతో చదువుకోవడం… ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల్లో కూడా స్కూళ్లలో టెన్ ప్లస్ టు ఉండాలి…
సరే, అనుకున్నంత వేగంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు రావడం లేదు అనుకుందాం… కనీసం ఈసారి 100 హైస్కూళ్లలోనైనా ప్లస్ వన్ స్టార్ట్ చేయాల్సి ఉండింది… అదీ జరగలేదు… ఏముంది..? అదే సిలబస్… అదే కరిక్యులం… అసలు విద్యార్థులే లేని జూనియర్ కాలేజీల నుంచి లెక్చరర్లను ఇటు ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోయేది… సర్వీస్ మ్యాటర్స్ వివాదాలు మెల్లిగా పరిష్కరించుకోవచ్చు…
ఇవేమీ జరగలేదు… అడ్మిషన్ల ఆదేశాలు రద్దు చేశారు… వాట్ నెక్స్ట్..? సీఎంవో నుంచైనా సీఎం ఆలోచనలు ఇవీ, ఆచరణ ఇదీ అని గైడ్ చేయాలి కదా… చీఫ్ సెక్రటరీ పట్టించుకోవాలి కదా… ఏదీ లేదు… ఇది రాబోయే కొత్తతరానికి సంబంధించిన కీలకమైన ప్రభుత్వ విధానం, దీనిపైనా అధికారగణంలో పట్టింపు లేదు… ఎప్పుడో రెండు నెలల ముందు నుంచే సంస్కరణల కార్యాచరణ ప్రారంభిస్తే ఇప్పటికైనా కొంతైనా గాడిలో పడేది..!!
Share this Article