.
అత్యాచార నేరగాళ్లకు మద్దతునిచ్చిన ప్రహ్లాద్ జోషిని విద్యా శాఖ మంత్రిని చేస్తారా? ఎంత దారుణం, ఎంత దుర్మార్గం, ఎంత అవమానం అంటూ ప్రతిపక్షాలు కొత్తగా మరో వాదన ఎత్తుకున్నాయి… ఏదో ఒకటి తప్పుపట్టాలి కాబట్టి ఈ అంశం దొరికినట్టుంది వాటికి… కానీ..?
ప్రహ్లాద్ జోషి కొత్త మంత్రి కాదు, తను ఆల్రెడీ కేబినెట్ మంత్రి… తాత్కాలికంగా విద్యా శాఖను అదనపు బాధ్యతగా అప్పగించారు… పైగా అసలు ఆ కేసుకు, ఈ నీట్ యవ్వారానికీ ముడిపెట్టడం ఏమిటి..? నీట్ ఇష్యూపై, బాధ్యులపై చర్యలకు పోరాడాలి గానీ, ఎవరు మంత్రి అనేది ముఖ్యం కాదు కదా… మరీ కాంగ్రెస్ కూడా సీజేపీలాగా మారిపోతోంది…
Ads
అసలు అత్యాచార నిందితులకు మద్దతు అనే అంశాన్ని చూద్దాం ఓసారి… 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై జరిగిన సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య ఓ దుర్మార్గమైన చర్య. కానీ..?
ఆ కేసులో శిక్ష అనుభవిస్తున్న 11 మంది దోషులను (జీవిత ఖైదు) 2022లో గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ విధానంలో విడుదల చేసింది… ఆ సమయంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఈ విడుదల చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారమే జరిగిందని వ్యాఖ్యానించాడు… జైలులో నిర్దిష్ట కాలం పూర్తి చేసిన ఖైదీలకు రెమిషన్ వర్తించే అవకాశం చట్టంలో ఉందని ఆయన పేర్కొన్నాడు…
తను ఇప్పుడూ అదే చెబుతున్నాడు… రూల్ పొజిషన్ చెప్పాను కానీ, అది చెబితే ఆ విడుదలను సమర్థిస్తున్నట్టు ఎలా అవుతుందని అంటున్నాడు… అయితే కాంగ్రెస్ మాత్రం దీనిని తీవ్రంగా తప్పుబడుతోంది. అత్యాచార కేసులో దోషుల విడుదలను సమర్థించిన వ్యక్తికి విద్యాశాఖ వంటి కీలక బాధ్యత ఇవ్వడం తగదని విమర్శిస్తోంది.
ముఖ్యంగా నీట్ వివాదం, విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగం వంటి అంశాలు చర్చలో ఉన్న సమయంలో ఈ నిర్ణయం మరింత అభ్యంతరకరమని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వివాదంలో మరో కీలక విషయం ఏమిటంటే… బిల్కిస్ బానో కేసు దోషుల విడుదలను తర్వాత Supreme Court of India రద్దు చేసింది. 2024లో ఇచ్చిన తీర్పులో గుజరాత్ ప్రభుత్వ నిర్ణయం చెల్లదని పేర్కొంటూ, విడుదలైన 11 మంది మళ్లీ జైలుకు వెళ్లాలని ఆదేశించింది.
నిజంగా ప్రహ్లాద్ జోషి ఆ నేరస్థుల విడుదలకు మద్దతిచ్చాడనే స్టాండ్ మీద కాంగ్రెస్ ఉండాలి అనుకుంటే… తనను కేబినెట్ నుంచి తొలగించాలని పోరాడాలి, అంతేతప్ప విద్యా శాఖ మాత్రం ఇవ్వొద్దు, కేబినెట్లో ఉంటే పర్లేదు అన్నట్టుగా మాట్లాడటం లాజిక్లెస్…
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రహ్లాద్ జోషికి ప్రస్తుతం అదనంగా అప్పగించిన విద్యా శాఖ బాధ్యతలను కొనసాగించవచ్చు లేదా కొత్త మంత్రిని తీసుకురావచ్చు… సో, ప్రహ్లాద్ జోషిని నీట్ ఇష్యూకు ముడిపెట్టి, దానికే ప్రాముఖ్యత ఇవ్వడం కాంగ్రెస్ నిర్హేతుకమైన వాదనగా అనిపిస్తోంది!!
ఒరిజినల్గా ప్రహ్లాద్ జోషి వినియోగదారుల వ్యవహారాలు, ఆహార & ప్రజా పంపిణీ శాఖ (Ministry of Consumer Affairs, Food and Public Distribution), నూతన, పునరుత్పాదక శక్తి శాఖ (Ministry of New and Renewable Energy) మంత్రి… ఇప్పుడు విద్యా శాఖ అదనపు బాధ్యతలు!
జైలు రూల్ పొజిషన్ చెప్పినప్పుడు తను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ (Ministry of Parliamentary Affairs), బొగ్గు శాఖ (Ministry of Coal),, గనుల శాఖ (Ministry of Mines) చూస్తుండేవాడు…
Share this Article