.
( రమణ కొంటికర్ల 99126 99960 ) …. 21 ఏళ్ల సర్వీస్.. 25 సార్లు బదిలీ: కల్తీపాలపై కొరడాతో.. దేశవ్యాప్త గుర్తింపు!
బతికేందుకింత ఆక్సిజన్, నీరు ఎట్లా అవసరమో… ఆ తర్వాత పాలూ అంతే. అంత ప్రాధాన్యత ఉన్న పాలు మరి నకిలీగా మన ఇళ్లకు చేరితే జరిగే అనర్థాలేంటి..? ఆ అనర్థాలను అరికట్టేందుకు ఓ ఐఏఎస్ అధికారి ఏం చేశాడు…?
Ads
వేడి వేడి ఛాయ్ కావాలన్నా.. పిల్లల అల్పాహారం కింద పాలు పోయాలన్నా… మంచి పెరుగు తయారు కావాలన్నా.. పన్నీర్ తో కలిపి బట్టర్ మసాలా దట్టించాలన్నా… అన్నింటికీ కావల్సింది పాలే. ఆ పాలు స్వచ్ఛంగా ఉంటేనే ఆరోగ్యాలకూ భద్రత.
అయితే, ఇప్పుడు దేశమంతా పాల ప్యాకెట్స్ వచ్చి పడటంతో ఏ పాలు మంచివో.. ఎందులో ఏం కంటెంట్ ఉంటుందో… ఎక్కడా కనీసం పేర్కొనకుండానే ఆ పాల ప్యాకెట్ల అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. జనం వాటికే అలవాటు పడిపోయారు కూడా. కానీ, పాలు స్వచ్ఛంగా ఉంటాయనే నమ్మకం మాత్రం సడలిపోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలో ఓ ఐఏఎస్ మహారాష్ట్రలో స్పందించిన తీరు ఇప్పుడు యావత్ దేశాన్ని ఆకట్టుకుంటోంది.
మహారాష్ట్రలో కల్తీపాలపై వెలువడిన నివేదికలు తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. పరీక్షించిన పాల నమూనాల్లో దాదాపు 70 శాతం కల్తీ పాలేనని రుజువైంది. దీంతో కోట్లాది మంది వినియోగించే పాల నాణ్యత ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది.
ఈ పరిస్థితుల్లోనే మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి తుకారం ముండే సింథటిక్ పాలు, నకిలీ పాల ఉత్పత్తులు, హానికర రసాయనాలు ప్రజల ఇళ్లకు చేరొద్దనే సంకల్పం తీసుకున్నాడు.
పాల నాణ్యతపై తనిఖీలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక దాడులు!
కేవలం 30 రోజుల టార్గెట్. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శాఖ భారీగా తనిఖీలు చేపట్టింది. పాల ఉత్పత్తి కేంద్రాలు, డెయిరీలు, గిడ్డంగులు, పంపిణీ కేంద్రాలు, స్థానిక దుకాణాలు ఇలా అన్నిచోట్లా విస్తృతంగా దాడులు చేసింది. కల్తీపాలు, నకిలీ పాల ఉత్పత్తులు విక్రయిస్తున్నవారందరిపైనా చర్యలు మొదలయ్యాయి.
ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి… మొత్తం 360 చోట్ల దాడులు చేశారు. 235 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. 350 మంది కల్తీదారులను అరెస్ట్ చేశారు. 274 అక్రమ తయారీ కేంద్రాలనూ సీజ్ చేశారు. ఇందులో ప్రముఖ సంస్థలకూ మినహాయింపు లేకుండా కఠిన చర్యలు తీసుకున్నారు.
ముంబైలో ప్రసిద్ధి చెందిన కే. రుస్తుమ్ అండ్ కంపెనీ సంస్థలో నాణ్యత, పరిశుభ్రత నిబంధనలను గుర్తించి.. ఏకంగా అంత పెద్ద సంస్థ లైసెన్సునే రద్దు చేశారు. దీంతో ఆహార భద్రతా నిబంధనలు ప్రతీ సంస్థకూ సమానంగా వర్తిస్తాయనే సందేశం ప్రభుత్వం పంపింది.
మరి ఇదెవరి చొరవ..?
తుకారాం ముండే. ఈయన కఠిన పాలనా విధానానికి కేరాఫ్. ఈ ఐఏఎస్ అధికారి తన 21 ఏళ్ల ప్రభుత్వ సర్వీసులో 25 సార్లు బదిలీ అయ్యారు. అయినప్పటికీ ప్రజాహితమే తన లక్ష్యంగా పనిచేస్తూ పాలనలో రాజీపడని అధికారిగా గుర్తింపు పొందారు.
పాల కల్తీపై తుకారాం చేపట్టిన చర్యలు కూడా ఆయన నిబద్ధతకు నిదర్శనం. చట్టాల అమలును కఠినతరం చేయడం.. బాధ్యతను పెంచడం.. నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ఆచరణలోకి తీసుకురావడమే తుకారాం లక్ష్యం.
ప్రతీ గ్లాస్ పాలూ సురక్షితంగా ఉండాలన్నదే తుకారాం తపన!
తెల్లార్లేస్తే ప్రతీ కుటుంబానికీ అవసరమయ్యే పాలు స్వచ్చమైనవేనా అన్న అనుమానం ప్రజలకు ఉండటం ఓ విషాదం. అది జరక్కూడదనన్న గట్టి సంకల్పమే తుకారాం రైడ్స్ కు ప్రధాన కారణం.
కల్తీపాలపై రాష్ట్రవ్యాప్తంగా తుకారాం చేపట్టిన చర్యలు… ఆయన్ను ప్రజల మనిషిని చేశాయి. లక్షలాది కుటుంబాల్లో పాలపై విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పేందుకు తుకారాం ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న పాల వ్యాపారంపై తుకారాం పెట్టిన దృష్టి.. నిబద్ధత ఉంటే సమాజంలో ఎలాంటి అంశాల్లోనైనా ఎంతటి మార్పు తీసుకురావచ్చో తెలిపేది.
Share this Article