.
నిన్నే కదా మనం చెప్పుకున్నది… ప్రతిపక్షం ప్రధానంగా ప్రశ్నించబడుతున్న విశేషం గురించి కదా… ఈ సినిమాలో క్లైమాక్స్ కేసీయార్ ప్రశ్నించబడే సీన్… అసలు ఓ కమిషన్ ఎదుట, వాళ్ల ప్రశ్నలకు కేసీయార్ జవాబులు చెప్పడం అనే సీన్ ఊహించుకుంటేనే అదొక పెద్ద విశేషం… ఎందుకు..?
తను ప్రశ్నను సహించడు కాబట్టి… ప్రశ్న వినడానికి కూడా ఇష్టపడడు… అంతకుముందు ఏమో గానీ, తను అధికారంలోకి వచ్చాక ఆ ప్రశ్నను సహించలేనితనం పీక్స్కు చేరింది… అది ఎంతలా అంటే..?
Ads
మీడియా ప్రశ్నించలేదు… ఆర్ఎఫ్సీ భూముల యవ్వారం కావచ్చు, మరింకేమైనా భయాలు కావచ్చు, రామోజీరావు కేసీయార్ జోలికి వెళ్లేవాడు కాదు… అతిరథ మహారథులు ఎవరైనా సరే, అందరినీ తన వద్దకే రప్పించుకునే రామోజీరావు అనే అక్షర నియంత మరో రాజకీయ నియంత దగ్గరకే వెళ్లినట్టు గుర్తు…
సరే, ఆ లక్ష నాగళ్లు గట్రా వివాదాలు, విమర్శలు ఎలా ఉన్నా… ఆంధ్రజ్యోతి మొదట్లో కేసీయార్కు అనుకూలంగానే ఉన్నా… తరువాత ఎక్కడో బెడిసింది… రాధాకృష్ణ ఒక్కడే మీడియాలో కేసీయార్ పట్ల విమర్శనాదృష్టితో ఉన్నాడు… యాడ్స్ ఆపేయడం వంటివి ఎన్ని ఎదురైనా తను నిలబడ్డాడు…
కేసీయార్ వర్సెస్ చంద్రబాబు రాజకీయ వైరంలో… రాధాకృష్ణ చంద్రబాబు మనిషిగా ముద్రపడ్డాడు కాబట్టి అలా కేసీయార్కూ వ్యతిరేకమయ్యాడేమో కూడా తెలియదు… జగన్ కేసీయార్కు జాన్ జిగ్రీయే, ఇద్దరూ కలిసి గోదావరి టు పెన్నా బృహత్తర ప్రణాళిక కూడా అమలు చేయాలనుకున్నారు… సంయుక్తంగా… సో, సాక్షి కేసీయార్ అనుకూల ధోరణే… ఈరోజుకు కూడా…
తను అధికారంలోకి వచ్చాక ఎప్పుడో ఓసారి ఇంటర్వ్యూ… కానీ తనకు నచ్చిన ప్రశ్నలు మాత్రమే… వాటికి తను చెప్పదలుచుకున్న సమాధానాలే… మన తెలంగాణ పత్రిక ఆవిష్కరణకు రమ్మంటే, వేరే ఏ ఇతర పార్టీ నాయకుడు వచ్చినా నేను రాను అని చెప్పాడు… దాంతో తనొక్కడినే పిలిచి, ఇంకెవరూ రాకుండా తనతో మాత్రమే ఆవిష్కరింప చేశాడు ప్రస్తుత మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి…
బాహుబలిలో శివగామిలాగా… కేసీయార్ మాటే శాసనం… గీత గీస్తే అది లక్ష్మణ రేఖే… టీవీ చానెళ్ల గురించి చెప్పనక్కర్లేదు… అసలు చట్టసభల్లో తనను ప్రశ్నించేవాడు ఉండకూడదు అన్నట్టుగా టీడీపీ, కాంగ్రెస్ను, చివరకు కమ్యూనిస్టులను కూడా వదల్లేదు… చీల్చి, చెండాడి, తొక్కేసి… కకావికలం చేశాడు…
రేవంత్ రెడ్డి ఒక్కడే చంద్రబాబు క్యాంపులో ఉండి, తనకు కంట్లో నలుసుగా మారుతున్నాడనే భావనతో… వోటుకునోటు కేసులో భలే దొరకబట్టాడు… తరువాత కూడా మరేవో కారణాలతో జైలులో వేశాడు… అంతేతప్ప తెలంగాణ ఏ ఇతర పార్టీ నుంచి ఏ ప్రముఖ నాయకుడూ కేసీయార్ను పల్లెత్తు మాట అనేవాళ్లు కాదు… అలా మేనేజ్ చేయగలిగాడు కేసీయార్…
ప్రశ్నించేవాళ్లు ఎవరెవరు..? ఏం చేస్తున్నారు..? దాని కోసం దేశంలోనే ఎక్కడా లేనంత భీకరమైన ఫోన్ ట్యాపింగ్… చివరకు బిడ్డ, అల్లుడి మీద కూడా… ‘అసలు ప్రశ్నించే వాతావరణమే’ లేకుండా చేసుకోవడంలో ఇదొక భాగం…
సీన్ కట్ చేస్తే… అదే రేవంత్ రెడ్డి సీఎం… నాకెదురు లేదు అనుకున్న కేసీయార్ ప్రస్తుతం నథింగ్… ఇల్లు కదలని ప్రజానాయకుడు… అసలు ప్రశ్నను సహించని, ఎదుర్కోని కేసీయార్ ప్రస్తుతం ఓ కమిషన్ ఎదుట ప్రశ్నించబడటం అనే సీన్ అందుకే విశేషం, ఆశ్చర్యం… అవును, ఓ మిత్రుడు చెప్పినట్టు… టైమ్, అంటే కాలమహిమ…
(కాలేశ్వరం కమిషన్ విచారణకు వెళ్లే ముందు ఫోటో ఇది… బీఆర్కేఆర్ భవన్కు కార్యకర్తలు, బహిరంగ సభకు వెళ్తున్నట్టుగానే చేతికి దట్టీ…)
ఈ కమిషన్ల విచారణతో ఏమవుతుందీ అనే మరో ప్రశ్న… కానీ కేసీయార్ను నువ్వు తప్పు చేశావ్, జవాబు చెప్పు అని ప్రశ్నింపజేస్తూ… కార్నర్ చేయడం..! ఇది కొత్తేమీ కాదు… విచారణను ఎదుర్కోవడంలో కేసీయార్ మొదటివాడు కాదు, చివరివాడూ కాదు… అంతకుముందు మాజీ ప్రధాని ఏకంగా కోర్టు విచారణకే హాజరయ్యాడు నిందితుడిగా, అదీ తను ఉద్దరించిన పార్టీకి కోపమొచ్చి…
ఇదే కేసీయార్కు గతంలో గురువు, నాయకుడు చంద్రబాబు కూడా వైఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుప్పం విచారణ కమిషన్ ఎదుట హాజరైనట్టు గుర్తు… అయితే వాళ్లు అప్పుడు పదవుల్లో లేరు… పదవులు దిగిపోయాక లాలూ కొన్నేళ్లపాటు జైలులో ఉన్నాడు, ఇందిర కూడా అరెస్టయింది… కాకపోతే అరెస్టు, కొన్ని గంటల్లోనే విడుదల అంతా నాటకీయం…
అంతెందుకు..? సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ అప్పటికప్పుడు సీఎం పదవికి రాజీనామా చేసి, జైలుకు వెళ్లాల్సి వచ్చింది… సో, టైమ్ డిసైడ్స్ ఎవరీ థింగ్… అదే అల్టిమేట్… నాకు శుక్రమహర్దశ నడుస్తోంది, నేను ప్రశ్నకు, విమర్శకు, పరాజయానికి అతీతం అనుకున్న ఎవరైనా సరే, అదీ కొన్నేళ్లే అని గుర్తుంచుకోవాలి…
కానీ అధికారం, కుర్చీ ఆ నిజాన్ని గుర్తించనివ్వదు… అదీ చెప్పదలిచింది… ఏమో, రేప్పొద్దున ఇదే రేవంత్ రెడ్డికీ ఈ స్థితి ఎదురవుతుందా..? ఏమో, టైమ్ ఏం రాసి పెట్టిందో..!!
అవునూ, కేసీయార్కు ఓ ప్రశ్న… ఏ తప్పు ఎరుగని వీర తెలంగాణ ప్రయోజనవాదివి కదా… మరి నీ వాదనను బహిరంగంగానే వినిపించవచ్చు కదా… మరి ఘోష్ కమిషన్ ఎదుట వన్ టు వన్ విచారణను ఎందుకు అడిగావు..? దాల్ మే కుచ్ కాలా హై… నిజమేనా..?
Share this Article