.
‘గోమూత్ర ఎక్స్పర్ట్’ మాత్రమేనా?… వి. కామకోటి అనే శాస్త్రవేత్త గురించి తెలుసుకోవాల్సిన కొన్ని నిజాలు… పార్లమెంట్లో రాజకీయ విమర్శలు కొత్త కాదు. అధికార పక్షం, ప్రతిపక్షం పరస్పరం విమర్శలు చేసుకోవడం ప్రజాస్వామ్యంలో సహజమే. కానీ కొన్ని సందర్భాల్లో ఒక మాట… ఒక వ్యక్తి దశాబ్దాల కృషిని కూడా మరుగున పడేస్తుంది. కించపరుస్తుంది, అది కరెక్టు కాదు…
ప్రహ్లాద్ జోషి విద్యా శాఖకు, పాత అత్యాచార కేసు నేరస్థుల విడుదలకూ లింక్ పెట్టిన కాంగ్రెస్, ఓ ప్రతిభాశీలిని ‘గోమూత్ర నిపుణుడు’ అని తీసిపారేసింది… అదీ పార్లమెంటులో… కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, IIT మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటిని “గోమూత్ర ఎక్స్పర్ట్” అని సంబోధించింది.
Ads
ఆమె ఉద్దేశం ఆయన గతంలో గోమూత్రంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను విమర్శించడమే కావచ్చు. కానీ ఆ ఒక్క పదంతో దేశంలోని అత్యున్నత కంప్యూటర్ శాస్త్రవేత్తల్లో ఒకరిని పరిచయం చేయడం పూర్తి చిత్రాన్ని చూపుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్ష విధానాన్ని ప్రక్షాళన చేయడానికి, నేషనల్ ఎగ్జామినేషన్ సిస్టమ్ సంస్కరణల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన హై-పవర్డ్ టాస్క్ ఫోర్స్ (ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్) ప్యానెల్లో వి. కామకోటిని నియమించారు…
ఈ టాస్క్ఫోర్స్లో సభ్యుడిగా చేరడానికీ, పాత గోమూత్రం వ్యాఖ్యలకూ లింకేమిటి అసలు..? ఎందుకు ప్రియాంక అపరిణత ధోరణిని కనబరుస్తోంది… నిజానికి వి. కామకోటి జీవితం చూడాలి ఓసారి… ప్రతిభావంతులపై ఏవేవో ముద్రలు వేసి అవమానించడం కాదు…
చిన్నప్పుడు తనకు క్రికెట్ అంటే ప్రాణం… ఒక మ్యాచ్లో కళ్లద్దాలు పగిలిపోవడంతో, కుమారుడి కంటి చూపు దెబ్బతింటుందనే భయంతో తండ్రి క్రికెట్ను ఆపించాడు… చేతిలో బ్యాట్ స్థానంలో వయొలిన్ పెట్టాడు… ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా సంగీతాన్ని సాధన చేసి, భారతరత్న ఎం.ఎస్. సుబ్బలక్ష్మి వంటి మహనీయుల సమక్షంలో వాయించే స్థాయికి ఎదిగాడు తను…
అక్కడితో తన జీవన పరీక్ష ముగియలేదు. IIT- JEEలో తొలి ప్రయత్నంలో విజయం సాధించలేకపోయాడు… చాలామందిలా నిరాశతో ఆగిపోలేదు… మరో ఇంజినీరింగ్ కళాశాలలో చదివి, తర్వాత IIT మద్రాస్లో ఉన్నత విద్య పూర్తి చేసి, అదే సంస్థలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా, చివరకు డైరెక్టర్గా ఎదిగాడు… ఒకప్పుడు తనకు ప్రవేశం రాని సంస్థకే అధిపతిగా తిరిగి రావడం ఆయన పట్టుదలకు నిదర్శనం…
భారత్ సాంకేతిక స్వావలంబన గురించి దేశం పెద్దగా మాట్లాడకముందే, విదేశీ మైక్రోప్రాసెసర్లపై పూర్తిగా ఆధారపడటం భద్రతాపరంగా ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. “మనం కొనుగోలు చేసిన చిప్ మనం కోరుకున్న పనిని చేస్తుందో పరీక్షించవచ్చు. కానీ అది మనకు తెలియకుండా ఇంకేదైనా చేయదని ఎలా నిర్ధారిస్తాం?” అనే ప్రశ్న ఆయనను SHAKTI మైక్రోప్రాసెసర్ ప్రాజెక్టు వైపు నడిపించింది…
IIT మద్రాస్ బృందంతో కలిసి అభివృద్ధి చేసిన SHAKTI ప్రాసెసర్, భారతదేశంలో స్వదేశీ RISC-V ఆధారిత మైక్రోప్రాసెసర్ రూపకల్పనలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది… 2018లో పూర్తిగా భారతీయంగా రూపొందించిన ఆ చిప్పై Linux విజయవంతంగా బూట్ కావడం, భారత చిప్ డిజైన్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిన ఘట్టంగా గుర్తింపు పొందింది…
అవును… వి. కామకోటి గోమూత్రంపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదానికి దారితీశాయి… 2025 జనవరిలో చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో తను మాట్లాడుతూ.. గోమూత్రానికి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయని, అది జీర్ణ సమస్యలకు, కొన్ని అనారోగ్యాలకు ఔషధంగా పనిచేస్తుందని వ్యాఖ్యానించాడు… అదీ వివాదం…
ఆ వ్యాఖ్యలతో ఏకీభవించని హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ప్రజాస్వామ్యంలో విమర్శ కూడా అవసరమే. కానీ అదే సమయంలో, ఒక శాస్త్రవేత్తను ఆయన మొత్తం జీవిత ప్రస్థానం, పరిశోధనలు, విద్యా సేవ, దేశానికి చేసిన సాంకేతిక కృషిని పక్కనబెట్టి కేవలం “గోమూత్ర ఎక్స్పర్ట్” అనే ఒకే ముద్రతో నిర్వచించడం సముచితమేనా..?
ఒక వ్యక్తి చేసిన ఒక వివాదాస్పద వ్యాఖ్యను విమర్శించడం ఒకటి. ఆ వ్యక్తి దశాబ్దాల శాస్త్రీయ కృషిని ఒకే పదంతో కుదించేయడం మరోటి. రెంటినీ కలపడం, పైగా పరీక్ష అక్రమాల నివారణ టాస్క్ఫోర్స్లో నియామకానికీ దీనికి లంకె పెట్టడం అనుచితం…
రాజకీయాల్లో వ్యంగ్యం తాత్కాలికం. కానీ దేశానికి శాస్త్రవేత్తలు నిర్మించే సంస్థలు, సాంకేతికత, పరిశోధనలు మాత్రం శాశ్వత ఆస్తి. వి. కామకోటి గురించి చర్చించాలంటే… గోమూత్ర వివాదాన్ని ప్రస్తావించొచ్చు. కానీ SHAKTI ప్రాసెసర్ను, ఆయన పరిశోధనను, IIT మద్రాస్లో ఆయన ప్రయాణాన్ని మర్చిపోవడం మాత్రం చరిత్రకే అన్యాయం అవుతుంది…
Share this Article