.
గోదావరి- బనకచర్ల నీటి తరలింపు ప్రాజెక్టు వివాదంపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, సంయుక్తంగా పోరాడే దిశలో అడుగులు వేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయంగా, తెలంగాణ ప్రయోజన కోణంలోనూ గుడ్ డెసిషన్…
రాష్ట్ర స్థూల ప్రయోజనాల విషయానికొచ్చినప్పుడు… అన్ని పార్టీలు, అన్ని వర్గాలూ ఏకమై సంఘటితంగా పోరాడటం అనేది మంచి స్పూర్తి, అదిప్పుడు అవసరం కూడా… గోదావరి నుంచి తెలంగాణ ప్రయోజనాలకు భిన్నంగా ఏపీ ప్రభుత్వం వందల టీఎంసీలను కొల్లగొట్టబోతున్నది అని తెలంగాణ సమాజం ఆందోళన, ఆరోపణ…
Ads
ఒకవైపు సంబంధిత కేంద్ర సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా లేఖలు రాసి, ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని చెప్పడం సరైన చర్య… ఏ వేదికలోనూ తెలంగాణ తన అభ్యంతరాల్ని తెలపడానికి సందేహించొద్దు, అవసరమైతే న్యాయపోరాటమూ శరణ్యమే…
ఏమో, బనకచర్లను అడ్డుకుంటే కనీసం తెలంగాణ ఎగువ కృష్ణా- గోదావరి ప్రాజెక్టులకు ఏపీ సానుకూలత వ్యక్తపరచొచ్చు కదా… ఐతే ఇక్కడ చెప్పుకోవాల్సింది జగన్తో కలిసి కేసీయార్ తెలంగాణ జలప్రయోజనాలను పాతరేయడానికి ప్రయత్నించి తీరు… తెలంగాణ జాతిపితగా ఆ క్యాంపు పదే పదే కొనియాడుతున్న కేసీయార్ తెలంగాణ జాతికి నష్టకారకుడు ఎలా కాబోయాడనేదీ చర్చనీయాంశమే…
పైగా తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల మీద కదా… మహారాష్ట్ర మన తుమ్మడిహెట్టి దగ్గర ప్రతిపాదించిన బరాజ్ ఎత్తుకు అంగీకరించకపోవడంతో ప్రాణహిత చేవెళ్లను రీడిజైన్ చేసి, కాళేశ్వరం కట్టామని కేసీయార్ చెబుతున్నాడు… (వైఎస్ మాట గుర్తుతెచ్చుకోవాలి… ఇవేమైనా రసాయన ఫ్యాక్టరీలా అనుమతులు తీసుకోవడానికి…)
ఎవడు దూకుడుగా ముందుకెళ్తే వాడిదే జలప్రయోజనం… ఆలమట్టి నిర్మాణం, దాని ఎత్తు పెంపు వంటివి నిరూపించేది ఇదే… అక్కడ కేసీయార్ ప్రభుత్వం స్థిరంగా అడుగులు వేయలేక, మహారాష్ట్ర సాకుతో రీడిజైన్ చేసి, పైగా అదే మహారాష్ట్ర ప్రభుత్వ ముఖ్యులను కాళేశ్వరం ఓపెనింగుకు పిలిచింది… ఎందుకో, అదేం నిర్ణయమో తెలియదు, జగన్నూ పిలిచింది… వీర తెలంగాణ వ్యతిరేకి, సమైక్యాంధ్ర చాంపియన్ జగన్ కూడా వచ్చాడు…
సరే, అఖిలపక్షంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేసే పోరాటానికి ఎవరైనా కలిసిరాకపోతే (బీజేపీ..? ఎందుకంటే ఏపీలో కూటమి ప్రభుత్వ భాగస్వామి, చంద్రబాబు మీద ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వ మనుగడ కాబట్టి… కిక్కుమనడం లేదేమో…) సదరు పార్టీలే తెలంగాణ సమాజంలో కార్నర్ అవుతాయి… వాళ్లే ఎక్స్పోజ్ అవుతారు… దాన్ని వదిలేస్తే…
హరీష్ రావు సుదీర్ఘ ప్రెస్మీట్లను పుంఖానుపుంఖాలుగా రాస్తున్నారు కదా… నిజానికి గోదావరి నీటి మళ్లింపు ఆలోచనలు, అడుగులపై ప్రజలకు తలవంచి సరైన వివరణ ఇవ్వాల్సింది కేసీయారే… కార్నర్ అవుతున్నదీ తనే… ఏపీ నీటి మంత్రి స్ట్రెయిటుగా అధికారికంగానే అడుగుతున్నదీ ఇదే…
నిమ్మల రామానాయుడు ఏమడుగుతున్నాడు..? 1) రాయలసీమ రతనాల సీమగా మారాలంటే గోదావరి జలాల మళ్లింపే శరణ్యమని కేసీయార్ సీఎంగా ఉన్నప్పుడు అంగీకరించలేదా..? 2) ప్రగతి భవన్లో సీఎంలు జగన్, కేసీయార్ భేటీ అయినప్పుడు గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు మళ్లించడానికి అంగీకరించలేదా..?
3) 2016లో ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎంలుగా చంద్రబాబు, కేసీయార్ పాల్గొన్నారు… కృష్ణాలో 1000 టీఎంసీలు కావాలి, గోదావరి నుంచి మళ్లింపే శరణ్యం అని కేసీయార్ చేసిన వ్యాఖ్యలు మినిట్స్లో కూడా నమోదయ్యాయా లేదా…? 4) కేసీయార్తో ఈమేరకు ఒప్పందం కుదిరినట్టు జగన్ అసెంబ్లీలో కూడా చెప్పాడు కదా..? కేసీయార్ సహకరిస్తున్నాడని చెప్పలేదా..?
5) ఎగువ గోదావరి జలాల మళ్లింపుకే కేసీయార్ అంగీకరించగా, మేం పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుకు దిగు గోదావరి జలాల్ని వాడుకుంటామంటే అభ్యంతరాలు దేనికి..? ఈ ప్రశ్నలన్నీ జగన్ను, కేసీయార్ను ఉద్దేశించినవే… జగన్ మాట్లాడడు… కేసీయార్ కిమ్మనడు…
తెలంగాణ సమాజం కేసీయార్ నుంచి సమాధానాలు కోరే ప్రశ్నలు… 1) దుమ్ముగూడెం నుంచి పెన్నాకు నీటిని తరలించే బృహత్తర ప్రాజెక్టును జగన్తో కలిసి సంయుక్తంగా చేపట్టాలని ఆలోచించలేదా..? 2) పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు చేసి ప్లస్ రాయలసీమ లిఫ్టుతో ఇంకా ఇంకా కృష్ణా జలాల్ని దోచుకుపోతుంటే జగన్ను అడ్డుకోలేదేం..?
3) రోజా ఇంట్లో దావత్ తీసుకుని, రాయలసీమను రత్నాలసీమగా మారుస్తా అని ఏ ఉద్దేశంతో హామీ ఇచ్చినట్టు..? 4) గోదావరి నుంచి కృష్ణా మీదుగా పెన్నాకు తరలిస్తే తప్పేమిటనే ధోరణి కాదా ఏపీకి అలుసు ఇచ్చింది..? 5) ఎంతసేపూ కాళేశ్వరమే తప్ప కృష్ణా ఎగువ ప్రాజెక్టుల మీద ధ్యాస ఎందుకు లేకుండా పోయింది..?
……. ఎన్నో ప్రశ్నలు… ప్రతిపక్షంలో ఉండీ కేసీయార్ క్యాంపు ప్రశ్నలకు గురవుతున్నదంటే, విమర్శలు తాకుతున్నాయంటే కారణం, అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న అడ్డదిడ్డం నిర్ణయాలు, అడ్డగోలు అడుగులు…
సో, కేటీయార్కు పెద్దగా సాగునీటి మీద అధ్యయనం, అవగాహన ఉన్నట్టు కనిపించదు గానీ… ఎలాగూ కేసీయార్ జనంలోకి రాడు, ప్రజాజీవితంలోకీ రాడు కాబట్టి… నాటి నీటి మంత్రి హరీషే తెలంగాణ సమాజానికి సరైన సమాధానాలు ఇవ్వాలి… లేకపోతే ప్రస్తుత సుదీర్ఘ ప్రసంగాలు శుద్ధ దండుగ… ఏపీ మంత్రి చెబుతున్నట్టుగా… కాళేశ్వరం ఇష్యూ నుంచి ఇది ఉద్దేశపూర్వక డైవర్షన్ టెక్నికే అవుతుంది..!!
Share this Article